BJP: రాజకీయాల్లో హత్యలు ఉండవు.. ఆత్మహత్యలే ఉంటాయంటారు. తెలంగాణ బీజేపీ ఇప్పుడు కీలక దశలో ఉంది. ఎన్నికలకు ముందు సందిగ్థావస్థలో పడింది. ఇన్నాళ్లూ ఎవరైతే కరెక్ట్ అనిపించారో.. ఇప్పుడు వాళ్లే రాంగ్ అయిపోతున్నారు. కర్నాటక ఎఫెక్ట్ కమలనాథులను బాగా కన్ఫ్యూజ్ చేసిపడేస్తోంది.
కొన్ని వారాలుగా ఎలాంటి హడావుడి లేదు. తీవ్ర నిరుత్సాహంలో కూరుకుపోయింది టీబీజేపీ. కర్నాటక ఫలితాలు మానసికంగా దెబ్బ తీశాయి. పార్టీలో గ్రూపులు తయారై.. వెనుక గోతులు తీస్తున్నాయి. కవిత అరెస్టుపై వెనుకంజవేసి.. మరింత అబాసు పాలైంది. ఇలా కష్టకాలంలో.. కమలంపార్టీకి అన్నీ తిప్పలే.
ఏళ్లుగా తెలంగాణలో బీజేపీ ఉంది. ఉందంటే.. ఉంది అన్నటుగా ఉండేది. ఒకప్పుడు దేశంలో రెండే ఎంపీ స్థానాలు గెలిస్తే.. అందులో ఒకటి తెలంగాణలోనే. గుజరాత్లో ఎల్కే అద్వానీ, వరంగల్ నుంచి జంగారెడ్డి. అప్పటి నుంచి ఇప్పటివరకూ.. అలా సింగిల్ డిజిట్తోనే నెగ్గుకొస్తోంది. జాతీయ బీజేపీ మాత్రం యావత్ దేశాన్ని కబలిస్తుంటే.. భారీ బలగంతో రెండు దఫాలుగా దేశాన్ని ఏలుతుంటే.. తెలంగాణ బీజేపీ మాత్రం దశాబ్దాలుగా పాకుతూనే ఉంది. అప్పుడప్పుడు ఒకటి, రెండు ఎంపీ సీట్లు.. అదే సంఖ్యలో ఎమ్మెల్యేలు. అంతే. మాకింతే చాలని సరిపెట్టుకుంటోంది. ఇలాంటి దుర్భర పరిస్థితుల్లో.. ఒకే ఒక్కడు ఆ పార్టీని ఉరకలెత్తించాడు. సోదిలో కూడా లేని బీజేపీకి జవసత్వాలు తీసుకొచ్చాడు. బండి సంజయ్ నాయకత్వంలో.. కమలదళం రేసుగుర్రంలా దూసుకొచ్చింది.
బంగారు లక్ష్మణ్, కె.లక్ష్మణ్, దత్తాత్రేయ, కిషన్రెడ్డి.. ఇలా ఉద్దండులే గతంలో పార్టీ పగ్గాలు చేపట్టారు. కానీ, బండి సంజయ్ రథసారధి అయ్యాకే.. బీజేపీ బండి దూసుకుపోయింది. కరీంనగర్ కార్పొరేటర్ స్థాయి నుంచి ఒక్కసారిగా ఎంపీ కావడం, ఆ వెంటనే పార్టీ అధ్యక్షుడు కావడం అనూహ్యంగా జరిగిపోయింది. మొదట్లో.. ఆ బండి వల్ల ఏమౌతుందిలే అనుకున్నారు చాలామంది. కానీ, గల్లీ స్థాయి మాస్ రాజకీయాన్ని.. స్టేట్ లెవెల్ పాలిటిక్స్లోనూ అప్లై చేసి.. సక్సెస్ అయ్యారు బండి సంజయ్. మొదట్లో ఆయన ప్రసంగాలు పేలవంగా ఉండేవన్నారు. ఇప్పుడు పదునైన విమర్శలకు మారుపేరయ్యారు. దుబ్బాక ఉప ఎన్నికల్లో పోలీస్ ఝులుం ప్రదర్శిస్తే.. వెంటనే అక్కడ వాలిపోయారు. జనగాంలో బీజేపీ కార్యకర్తలను ఖాకీలు చితకబాదితే.. నేనున్నానంటూ తరలివెళ్లారు. ఖమ్మంలో కార్యకర్త చనిపోతే చలించిపోయారు. ఇలా రాష్ట్ర నాయకుడిగా ఉంటూనే.. గ్రామ స్థాయి నేతల్లో సైతం భరోసా నింపారు. పాదయాత్రలతో కమలదళాన్ని ఏకం చేశారు. బండి దూకుడుకు.. అధిష్టానం దండిగా సపోర్ట్ చేయడంతో.. మూడేళ్లలోనే బీజేపీ.. కేసీఆర్ను ఢీకొట్టే స్థాయికి చేరింది. పలు ఉప ఎన్నికల్లో సత్తా చాటింది. తెలంగాణలో హిందుత్వ నినాదం గట్టిగానే వినబడుతోంది. ఎవరు కాదన్నా.. ఆ క్రెడిట్ అంతా బండి సంజయ్దే..అంటారు.
కానీ.. ఇటీవల బండి నాయకత్వం సందేహంలో పడింది. పార్టీలో గ్రూపులు పెరిగాయి. కిషన్రెడ్డి, అర్వింద్, రఘునందన్, రాజేందర్, వివేక్.. ఇలా ఎవరికి వారే. సంజయ్కు పోటీగా ఈటల రాజేందర్ వేగంగా ఎదిగారు. చేరికల కమిటీ ఛైర్మన్గా ఆయన పెద్దగా ప్రభావం చూపకపోయినా.. ఈటల ప్రయారిటీ మరింత పెరుగుతూ వస్తోంది. అధిష్టానం సైతం బండిని కాదని.. ఈటలనే ఢిల్లీకి పిలిపించుకుని పదే పదే చర్చలు జరుపుతోంది. ఇప్పుడు ఏకంగా బండి సంజయ్నే పార్టీ అధ్యక్ష పదవి నుంచి తప్పించే ప్రయత్నాలు జరుగుతున్నాయని ప్రచారం జరుగుతోంది. బండికి కేంద్ర మంత్రి పదవి కట్టబెట్టి.. పార్టీ బాధ్యతలు డీకే అరుణకు అప్పగిస్తారని అంటున్నారు. డీకే అరుణ అయితేనే బెటర్.. అలా అయితే బీజేపీని సైతం ఒకప్పటి కాంగ్రెస్ నేతలే పాలిస్తున్నట్టు అవుతుందని లేటెస్ట్గా పీసీసీ చీఫ్ రేవంత్రెడ్డి సైతం సెటైర్లు వేశారు. అటు, ఈటల రాజేందర్కు కీలకమైన ప్రచార కమిటీ బాధ్యతలు కట్టబెడతారని తెలుస్తోంది.
బండి సంజయ్ స్థానంలో డీకే అరుణ అధ్యక్షురాలు అయితే.. కమలదళంలో మునుపటి ఫైర్ కనిపిస్తుందా? బండి ఎక్కడ విఫలం అయ్యారని ఆయన్ను సైడ్ చేస్తున్నారు? సంజయ్ కంటే అరుణ ఎందులో బెటర్? పార్టీలోని గ్రూపులే.. బండికి గోతులు తవ్వాయా? కర్నాటక ఓటమితో కమలదళంలో కల్లోలం పెరిగిందా? అంతా ఈటలనే చేస్తున్నారా? అధిష్టానం దగ్గర ఆయనకు ఎందుకంత వెయిట్? నాయకులందరినీ కరివేపాకులా వాడుకుంటున్నారా?