Bank Strike: వారానికి ఐదు రోజుల పనిదినాల కోసం బ్యాంకుల సమ్మె కారణంగా హైదరాబాద్ లో బ్యాంకు సేవలకు తీవ్ర అంతరాయం కలిగింది. బ్యాంకు ఉద్యోగులు, సిబ్బంది దేశవ్యాప్తంగా నిన్న జరిగిన సమ్మెలో పాల్గొనడంతో.. హైదరాబాద్, తెలంగాణ అంతటా బ్యాంకింగ్ కార్యకలాపాలు గణనీయంగా నిలిచిపోయాయి. తొమ్మిది ప్రధాన యూనియన్లకు ప్రాతినిధ్యం వహిస్తున్న యునైటెడ్ ఫోరం ఆఫ్ బ్యాంక్ యూనియన్స్ (UFBU).. వారానికి ఐదు రోజుల పని దినాలు అమలు చేయాలని కేంద్రంపై ఒత్తిడి తీసుకురావడానికి సమ్మెకు పిలుపునిచ్చింది.
గణతంత్ర దినోత్సవం, బ్యాంకుల సమ్మెతో లాంగ్ వీకెండ్ రావడంతో.. ప్రభుత్వ రంగ బ్యాంకులు, ప్రాంతీయ గ్రామీణ బ్యాంకులు, సహకార సంస్థలలో లావాదేవీలు స్తంభించిపోయాయి. డిజిటల్ ప్లాట్ఫారమ్లు, ఏటీఎంలు పనిచేస్తున్నప్పటికీ, చెక్ క్లియరెన్స్లు, మనీ డిపాజిట్లు, అడ్మినిస్ట్రేటివ్ అప్డేట్లు వంటి వ్యక్తిగత లావాదేవీలు నిలిచిపోయాయని ఆల్ ఇండియా బ్యాంక్ ఆఫీసర్స్ కాన్ఫెడరేషన్ ఉపాధ్యక్షుడు గలేటి నాగేశ్వర్ ఒక ప్రకటనలో తెలిపారు.
అన్ని శనివారాలను సెలవు దినాలుగా ప్రకటించాలనే కేంద్ర ప్రభుత్వ నోటిఫికేషన్ పెండింగ్లో ఉండటంతో ఈ వివాదం కొనసాగుతోంది. ఆర్బీఐ, ఎల్ఐసీ వివిధ కేంద్ర ప్రభుత్వ కార్యాలయాలు ఇప్పటికే ఐదు రోజుల షెడ్యూల్ ప్రకారం పనిచేస్తున్నాయని బ్యాంకు సిబ్బంది అంటున్నారు. దీంతో బ్యాంకు ఉద్యోగులు వివక్షకు గురవుతున్నారని యూనియన్ నాయకులు వాదిస్తున్నారు. బ్యాంకు సిబ్బంది పనిసమయం తగ్గకుండా, సోమవారం నుండి శుక్రవారం వరకు రోజువారీ పని గంటలను 40 నిమిషాలు పెంచాలని యూనియన్లు ఇప్పటికే ప్రతిపాదించాయి.
Also Read: రూ.85,920 జీతంలో భారీగా ఉద్యోగాలు.. ఇంకా వారం రోజులే గడువు
ఐదు రోజుల పని దినాల అమలుకు కచ్చితమైన హామీ కేంద్ర ప్రభుత్వం నుంచి రాకపోవడంతో.. వేరే మార్గం లేక సమ్మెకు దిగామని యూనియన్ ప్రతినిధులు అంటున్నారు. ఈ సమ్మెతో ప్రైవేట్ రంగ బ్యాంకులు ప్రభావితం కానప్పటికీ, ప్రభుత్వ రంగ బ్యాంకుల కార్యకలాపాలు తీవ్రంగా ప్రభావితమయ్యాయి.