Bhatti Vikramarka: ఖమ్మం నగరంలో జరిగిన సూడా (SUDA), జిల్లా లైబ్రరీ చైర్మన్ల అభినందన సభ రాజకీయంగా తీవ్ర చర్చనీయాంశమైంది. డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క, మంత్రి తుమ్మల నాగేశ్వరరావు ఈ కార్యక్రమంలో పాల్గొని కీలక వ్యాఖ్యలు చేశారు. పార్టీ కోసం నిలబడిన వారికి గుర్తింపు దక్కుతుందని చెబుతూనే, గత ప్రభుత్వ తీరుపై ఘాటు విమర్శలు గుప్పించారు.
తుమ్మల కామెంట్స్
సూడా చైర్మన్గా దుర్గ ప్రసాద్ నియామకంపై మంత్రి తుమ్మల నాగేశ్వరరావు హర్షం వ్యక్తం చేశారు. నిబద్ధత గల వ్యక్తికి ఈ పదవి దక్కడం వల్ల ఖమ్మం ఎమ్మెల్యేగా తనకు కొంత పనిభారం తగ్గిందని, రిలీఫ్ దొరికిందని అన్నారు. సీఎం రేవంత్ రెడ్డి ఎప్పుడు కలిసినా దుర్గ ప్రసాద్ గురించే అడిగేవారని గుర్తు చేశారు. రాజకీయాల్లోకి వచ్చే ఏ నాయకుడైనా నాయకత్వం కోసం, కార్యకర్తల రక్షణ కోసం పనిచేయాలని తుమ్మల సూచించారు.
భట్టి విక్రమార్క ఘాటు వ్యాఖ్యలు
డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క మాట్లాడుతూ.. గత పదేళ్ల బీఆర్ఎస్ పాలనలో కాంగ్రెస్ కార్యకర్తలను తీవ్ర ఇబ్బందులకు గురిచేశారని మండిపడ్డారు. కాంగ్రెస్ టికెట్పై గెలిచి స్వార్థంతో బీఆర్ఎస్లోకి మారిన వనమా వెంకటేశ్వరరావు, కందాల ఉపేందర్ రెడ్డి లాంటి వారిని క్షమించే ప్రసక్తే లేదని స్పష్టం చేశారు. గత పదేళ్లు జిల్లాలో తాను, పొదెం వీరయ్య మాత్రమే కాంగ్రెస్లో నిలబడి పోరాడామని.. కష్ట కాలంలో పార్టీని నమ్ముకున్న ప్రతి కార్యకర్తకూ న్యాయం చేస్తామని భరోసా ఇచ్చారు.
సంక్షేమ పథకాలపై వరాల జల్లు
కాంగ్రెస్ ప్రభుత్వం పేదల కోసం అందిస్తున్న పథకాలను భట్టి వివరించారు. డబుల్ బెడ్రూం పేరుతో గత ప్రభుత్వం మోసం చేస్తే, తమ ప్రభుత్వం రాష్ట్రవ్యాప్తంగా 4 లక్షల ఇందిరమ్మ ఇళ్లను మంజూరు చేసిందని, త్వరలోనే రెండో విడత కింద మరో 2 లక్షల ఇళ్లు ఇస్తామని ప్రకటించారు. మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం, రూ. 20 వేల కోట్ల రుణాలు, 53 లక్షల కుటుంబాలకు ఉచిత కరెంట్ ఇస్తున్నట్లు చెప్పారు.
ప్రభుత్వ పాఠశాలల్లో బ్రేక్ ఫాస్ట్ పథకంతో పాటు, త్వరలోనే కులమతాలకు అతీతంగా ప్రతి కుటుంబానికి రూ. 5 లక్షల భరోసా కల్పించే ‘ఇందిరమ్మ బీమా పథకాన్ని’ అమలు చేయబోతున్నామని డిప్యూటీ సీఎం వెల్లడించారు.