BJP – Janasena Alliance: తెలంగాణ మున్సిపల్ ఎన్నికలకు సంబంధించి బీజేపీ – జనసేన పొత్తుకు శుభం కార్డు పడబోతోందా? పొత్తు పొడవకముందే బీజేపీ యూటర్న్ తీసుకుందా? తెలంగాణలో పవన్ ఎన్నికల ప్రచారం వాయిదా వెనుక ఇదే కారణమా? అంటే అవుననే అంటున్నాయి పొలిటికల్ వర్గాలు. ఏపీతో పోలిస్తే కాస్తో కూస్తే బలమున్న తెలంగాణలో పవన్ తో పొత్తు పెట్టుకొని.. ప్రత్యర్థి పార్టీలకు ఆయుధం అందించామా? అన్న ఆందోళనలో బీజేపీ నేతలు ఉన్నట్లు సమాచారం. అయితే పవన్ వల్ల పార్టీకి లాభం కంటే నష్టమే ఎక్కువన్న డైలామాలో కమలం నేతలు సైతం ఉన్నట్లు తెలుస్తోంది. ఈ కారణం రిత్యా పొత్తుకు బ్రేకులు వేసే దిశగా కమలం యోచిస్తున్నట్లు స్ట్రాంగ్ బజ్ వినిపిస్తోంది.
ఆగమేఘాల మీద పవన్ ఇంటికెళ్లి పొత్తు పెట్టుకున్న తెలంగాణ బీజేపీ చీఫ్ రామచంద్ర రావు, కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి ప్రస్తుతం డైలామాలో పడిపోయినట్లు రాజకీయంగా చర్చ జరుగుతోంది. భవిష్యత్తు పరిణామాలను అంచనా వేయకుండా జనసేనతో పొత్తు పెట్టుకొని తప్పు చేశామా? అన్న ఆలోచనలో ప్రస్తుతం ఇరువులు నేతలు ఉన్నట్లు రాజకీయ విశ్లేషకులు చెబుతున్నారు. మరోవైపు అధికార కాంగ్రెస్, విపక్ష బీఆర్ఎస్ పార్టీలు.. బీజేపీపై విమర్శల కంటే ఆంధ్రా పార్టీతో పొత్తునే ఎక్కువ హైలెట్ చేస్తుండటం బీజేపీకి తలనొప్పిగా మారింది. ఇది మున్నిపల్ ఎన్నికల్లో తమ పార్టీ అవకాశాలను దెబ్బతీస్తుందా అన్న ఆందోళనను కమలంలో పెంచుతోంది.
బీజేపీ రాష్ట్ర అధినాయకులు తీసుకున్న నిర్ణయంపై ఆ పార్టీ ఎమ్మెల్యేలు, ఎంపీలు అంతర్గతంగా తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేస్తున్నట్లు తెలుస్తోంది. జనసేన, పవన్ ఫొటోలు లేకుండా ఎన్నికల ప్రచారం నిర్వహించాలన్న నిర్ణయానికి పలువురు అభ్యర్థులు వచ్చేసినట్లు కూడా చర్చ జరుగుతోంది. ఒకవేళ పవన్ ఫొటోను గానీ, పవన్ చేత ప్రచారం గానీ నిర్వహిస్తే అది ప్రత్యర్థులకు పెద్ద అవకాశంగా మారుతుందని బీజేపీ నేతలు భావిస్తున్నట్లు సమాచారం. తద్వారా తమపై విమర్శలు చేసేందుకు ఎక్కువ అవకాశం ఇచ్చినట్లు అవుతుందని పలువురు నేతలు భావిస్తున్నారు. ఈ క్రమంలోనే భద్రతా అంశంలో క్లారిటీ లేకపోవడం, ప్రచారానికి సంబంధించి షెడ్యూల్ ఇవ్వకపోవడంతో పవన్ పర్యటన వాయిదా పడినట్లు తెలుస్తోంది.
Also Read: GHMC: జీహెచ్ఎంసీలో ఔట్సోర్స్ బదిలీల వెనుక మర్మమేంటి? కమిషనర్ను తప్పుదోవ పట్టించారా?
మరోవైపు బీజేపీ వైఖరి పట్ల.. జనసేన శ్రేణులు తీవ్ర అసహనంలో ఉన్నట్లు సమాచారం. జనసేన మద్దతు కోసం బీజేపీనే తొలుత ముందుకు వచ్చి.. ఇప్పుడు యూటర్న్ తీసుకుంటామన్న సంకేతాలు ఇవ్వడాన్ని తప్పుబడుతున్నారు. రామంచంద్రరావు, కిషన్ రెడ్డి.. స్వయంగా పవన్ ఇంటికి వెళ్లి మద్దతు కోరిన విషయాన్ని జనసైనికులు గుర్తుచేస్తున్నారు. తెలంగాణలో పవన్ పర్యటన కూడా ఖరారైన తర్వాత ఇప్పుడు అనూహ్యంగా వెనక్కి తగ్గి ఆయన ఇమేజ్ ను దెబ్బతీస్తారా? అంటూ ప్రశ్నల వర్షం కురిపిస్తున్నారు. మెుత్తం మీద జనసేన-బీజేపీ పొత్తు అంశం ప్రస్తుతం తెలంగాణ రాజకీయాల్లో హాట్ టాపిక్ గా మారింది. బీజేపీ ఎమ్మెల్యేలు, ఎంపీలు.. జనసేన మద్దతు తీసుకోవడాన్ని పెద్ద ఎత్తున తప్పుబడుతున్న నేపథ్యంలో ఏ క్షణమైనా పొత్తుకు బ్రేకులు పడొచ్చన్న ప్రచారం విస్తృతంగా జరుగుతోంది.
Also Read: Black Magic Allegation: టీడీపీ ఎమ్మెల్యేపై క్షుద్రపూజలు? ఇంటి ముందు నిమ్మకాయలు.. ఏపీలో తీవ్రకలకలం!