Bandi Sanjay: కరీంనగర్ పార్లమెంట్ పరిధిలో కరీంనగర్ కార్పొరేషన్ మేయర్ పీఠంతోపాటు 3 మున్సిపాలిటీల్లో చైర్మన్ స్థానాలను బీజేపీ విజయం కైవసం చేసుకునే అవకాశాలు పుష్కలంగా ఉన్నాయని సర్వేల్లో వెల్లడైందని కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ కుమార్(Bandi Sanjay Kumar) చెప్పారు. మున్సిపల్ ఎన్నికల నేపథ్యంలో ఈరోజు కరీంనగర్ లోని శుభం కన్వెన్షన్ లో కరీంనగర్ కార్పొరేషన్ డివిజన్ ఇంఛార్జీలు, కన్వీనర్లు, కో కన్వీనర్లతో సమావేశం నిర్వహించారు.
ఈ సందర్భంగా బండి సంజయ్ మాట్లాడుతూ.. మున్సిపల్ ఎన్నికల్లో అత్యధిక స్థానాల్లో విజయం సాధించడమే లక్ష్యంగా పనిచేయాలని బీజేపీ కార్యకర్తలకు పిలుపునిచ్చారు. బీజేపీని నమ్ముకుని కష్టపడి పనిచేస్తున్న కార్యకర్తలకే టిక్కెట్ల విషయంలో అత్యధిక ప్రాధాన్యతనిస్తున్నట్లు చెప్పారు. కరీంనగర్ కార్పొరేషన్ లో 80 శాతంపైగా టిక్కెట్లు వారికే ఇవ్వాలని నిర్ణయించినట్లు పేర్కొన్నారు. గెలిచే అవకాశం లేని మిగిలిన స్థానాల్లో మాత్రమే ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేస్తున్నట్లు చెప్పారు. ఆయా చోట్ల టిక్కెట్లు రాని బీజేపీ కార్యకర్తలు బాధపడాల్సిన అవసరం లేదన్నారు. నామినేటెడ్ పోస్టులతోపాటు పార్టీ పదవులిచ్చి వారికి న్యాయం చేస్తామని భరోసా ఇచ్చారు.
Also Read: Ambati Arrest: అంబటి రాంబాబు అరెస్ట్.. ఆయన ఇంటిని- కారుని తగలబెట్టిన టీడీపీ శ్రేణులు, ఆపై కోర్టుకి
తొందరపడి ఎలాంటి తొందరపాటు నిర్ణయాలు తీసుకోవద్దని కోరారు. కరీంనగర్(Karimnagar)లో జరిగిన అభివృద్ధి పనులన్నీ కేంద్ర నిధులవల్లనేని స్పష్టం చేశారు. ఈ అభివృద్ధి ఆగకూడదంటే బీజేపీకి ఓటేసి ఆశీర్వదించాలని కోరుతూ ఇంటింటికీ ప్రచారం చేయాలని కోరారు. మేయర్ పీఠాన్ని బీజేపీకి అప్పగిస్తే కేంద్రం నుంచి మరిన్ని నిధులు తీసుకొస్తానని చెప్పారు. కరీంనగర్ కార్పొరేషన్ పై కాషాయ జెండాను ఎగరేసే బాధ్యత కార్యకర్తలదేనన్నారు. టిక్కెట్ ఆశించి భంగపడిన కార్యకర్తలను సముదాయించి డివిజన్లో బీజేపీ గెలుపు కోసం కలిసికట్టుగా పనిచేసేలా చూడాలని కోరారు. ఈ సమావేశంలో బీజేపీ మహిళా మోర్చా రాష్ట్ర మాజీ అధ్యక్షురాలు గీతామూర్తి, పార్టీ సీనియర్ నేతలు సాయిని మల్లేశం, గుజ్జ శ్రీను, ఇనుగొండ నాగేశ్వరరెడ్డి తదితరులు హాజరయ్యారు.