తెలంగాణలో అధికారంలో కోల్పోయిన తర్వాత బీఆర్ఎస్ నేతలు గజినీల్లా ప్రవర్తిస్తున్నారనే ఆరోపణ ఉంది. కేసీఆర్, కేటీఆర్, హరీష్ రావు గతం మరచిపోయి మాట్లాడుతున్నారు. స్థానిక సంస్థల ఎన్నికలకు టైమ్ దగ్గరపడటంతో కేటీఆర్ మరింత దూకుడుగా వ్యవహరిస్తున్నారు. కాంగ్రెస్, బీజేపీని ఒకేగాటన కట్టి విమర్శలు గుప్పిస్తున్నారు. ప్రాంతీయవాదాన్ని మరోసారి తెరపైకి తెస్తున్నారాయన. తాజాగా ఆయన చేసిన విమర్శలకు ఏపీ నుంచి గట్టి కౌంటర్ పడింది. ఏపీ బీజేపీ ఎంపీ సీఎం రమేష్ కేటీఆర్ కి బహిరంగ సవాల్ విసిరారు. తనపై తప్పుడు ఆరోపణలు చేశారంటూ మండిపడ్డారు. బహిరంగ చర్చకు సిద్ధం కావాలంటూ కేసీఆర్ కి సవాల్ విసిరారు సీఎం రమేష్.
బీఆర్ఎస్ విలీనం!!
కవితను జైలునుంచి బయటకు తెచ్చేందుకు సహకరిస్తే, ఈడీ కేసులు లేకుండా చేస్తే బీఆర్ఎస్ ని బీజేపీలో విలీనం చేసేందుకు కూడా సిద్ధమని కేటీఆర్ ప్రాధేయపడినట్టు చెప్పారు సీఎం రమేష్. వీలైతే పొత్తు పెట్టుకుంటాం, లేదంటే పార్టీనే విలీనం చేస్తామన్నారని, దమ్ముంటే కేటీఆర్ ప్రెస్ మీట్ పెట్టి సమాధానం చెప్పాలన్నారు.
కేటీఆర్ ఏమన్నారు?
హైదరాబాద్ సెంట్రల్ యూనివర్శిటీ భూముల గురించి సీఎం రేవంత్ రెడ్డిపై ఆరోపణలు చేసే క్రమంలో ఏపీలోని బీజేపీ నేతల్ని కూడా టార్గెట్ చేశారు కేటీఆర్. ఆ భూముల అమ్మకం, తాకట్టు విషయంలో సీఎం రేవంత్రెడ్డికి ఏపీ బీజేపీ ఎంపీ సీఎం రమేష్ కి మధ్య లావాదేవీలు జరిగాయన్నారు. సీఎం రమేష్ చేసిన మేలుకి ప్రతిఫలంగా.. ఆయనకు ఫోర్ట్ సిటీ రోడ్డు కాంట్రాక్ట్ అందిందని ఆరోపించారు. 1600 కోట్ల రూపాయల విలువైన ఫోర్త్ సిటీ రోడ్డు కాంట్రాక్ట్ ని ఏపీకి చెందిన బీజేపీ ఎంపీకి ఎలా ఇస్తారని ప్రశ్నించారు. బీజేపీ ఎంపీలకు తెలంగాణ ప్రభుత్వం కాంట్రాక్ట్ లు అప్పగిస్తుంటే రాహుల్ గాంధీ ఎందుకు మౌనం వహించారని అడిగారు కేటీఆర్.
మరచిపోయేవా కేటీఆర్..!
సీఎం రేవంత్ రెడ్డిని విమర్శించే క్రమంలో తనపై తప్పుడు ఆరోపణలు చేశారంటూ కేటీఆర్ పై మండిపడ్డారు ఎంపీ సీఎం రమేష్. తెలంగాణలో తనకు 1600 కోట్ల రూపాయల కాంట్రాక్ట్ పనులు వచ్చాయని కేటీఆర్ చెప్పడం ఆయన అవగాహన రాహిత్యానికి నిదర్శనం అన్నారు. తనపై తప్పుడు ఆరోపణలు చేస్తే చూస్తూ ఊరుకోబోమని హెచ్చరించారు. కేటీఆర్ తనతో బహిరంగ చర్చకు రావాలని సవాల్ విసిరారు సీఎం రమేష్. ఎమ్మెల్సీ కవిత జైల్లో ఉన్నప్పుడు కేటీఆర్ ఢిల్లీలోని తన ఇంటికి వచ్చేవారనే విషయాన్ని గుర్తు చేశారు సీఎం రమేష్. అప్పుడు మంచివాడినైన తాను, ఇప్పుడు చెడ్డవాడినైపోయానా అని ప్రశ్నించారు. అవసరానికి తన వద్దకు వచ్చిన కేటీఆర్, ఇప్పుడు తనపైనే తప్పుడు ఆరోపణలు చేస్తున్నారని చెప్పారు.
ఎందుకిదంతా?
తెలంగాణ స్థానిక ఎన్నికల్లో బీజేపీ, టీడీపీ కలసి పోటీ చేస్తాయనే భయంతోనే కేటీఆర్ అసత్య ఆరోపణలు చేస్తున్నారని చెప్పారు సీఎం రమేష్. బీజేపీ, టీడీపీ కలసి పోటీ చేస్తే బీఆర్ఎస్ గల్లంతవుతుందనే భయం ఆయనలో ఉందన్నారు. పార్టీ పని అయిపోయిందని అనిపించినప్పుడల్లా సెంటిమెంట్ ని రెచ్చగొట్టడం కేటీఆర్ కి అలవాటేనంటున్నారు నెటిజన్లు. ఇటీవల కాలంలో కేటీఆర్, సీఎం రేవంత్ రెడ్డిని విమర్శించే క్రమంలో ఏపీ సీఎం చంద్రబాబు పేరుని కూడా పదే పదే ప్రస్తావించడం గమనార్హం. మరి లోకేష్ తో ములాఖత్ సంగతేంటని కేటీఆర్ ని ప్రశ్నిస్తే మాత్రం అందులో తప్పేముందని చెప్పడం ఆయనకే చెల్లింది. రాజకీయ అవసరాలకోసం కేటీఆర్ ఎంతకైనా దిగజారతారని వైరి వర్గాలు ఘాటు విమర్శలు చేస్తున్నాయి.