Kavitha Vs BJP : కవిత ఎపిసోడ్ బీఆర్ఎస్ కంటే బీజేపీనే ఎక్కువ టెన్షన్కు గురి చేస్తోంది. మై డియర్ డాడీ అంటూ ఆమె రాసిన లేఖ.. కాషాయ పార్టీని షేక్ చేస్తోంది. కల్వకుంట్ల ఫ్యామిలీ ఇంటిపోరు కంటే కూడా.. కమలం పార్టీతో కారు దోస్తానా గురించే ఎక్కువ చర్చ నడుస్తోంది. వరంగల్ మీటింగ్లో బీజేపీ గురించి కేవలం 2 నిమిషాలు మాత్రమే మాట్లాడటం బాగా లేదని.. భవిష్యత్తులో రెండు పార్టీలు పొత్తు పెట్టుకునే ఛాన్స్ ఉందని ప్రజలు అనుకుంటారంటూ అసలు విషయం బయటపెట్టేశారు. పొరబాటున ఆ స్టేట్మెంట్ రాశారో, లేదంటే కావాలనే చేర్చారో తెలీదు కానీ.. ఆ మాటతో కాషాయ దళం ఉలిక్కిపడిండి.
బీజేపీకి ఇమేజ్ ప్రాబ్లమ్?
తెలంగాణలో బీజేపీ ఇప్పటికీ డల్గానే ఉందని అంటున్నారు. కాంగ్రెస్, బీఆర్ఎస్ మధ్యనే వార్ నడుస్తోంది. గాంధీభవన్ ముట్టడి లాంటి గొడవలతో కాషాయ పార్టీ హడావుడి చేస్తున్నా ఇంకా చేయాల్సింది చాలానే ఉందని అంటున్నారు. ఇలాంటి టైమ్లో బీజేపీ, బీఆర్ఎస్ పొత్తు అనే సంకేతాలు ప్రజల్లోకి వెళితే..? ఉన్న ఇమేజ్ కాస్తా ఢమాల్ అనే ప్రమాదం ఉండొచ్చు. ఢిల్లీ లిక్కర్ స్కాం కేసులో కవితకు బెయిల్ రావడం వెనుక బీజేపీ సహకారం ఉందనే ప్రచారం జరిగింది. ఇప్పుడు అదే కవిత లెటర్లో డైరెక్ట్గా పొత్తు టాపిక్ బయటకు వచ్చింది. కాషాయ సమూహంలో కలకలం చెలరేగింది.
కవిత ఇష్యూతో కాషాయం గేమ్
కవిత లెటర్ రిలీజ్ కాగానే.. పలువురు మంత్రులు, విప్లు, కాంగ్రెస్ ఎమ్మెల్యేలు వరుసబెట్టి కామెంట్లు చేశారు. బీజేపీ సైతం లైన్లోకి వచ్చింది. కాషాయ శ్రేణులు కవిత టాపిక్ అస్సలు వదలట్లేదు. మరీ ముఖ్యంగా ఎంపీ రఘునందన్రావు.. రోజుకో సంచలన కామెంట్ చేస్తూ కవిత ఇష్యూ లైమ్లైట్లో ఉండేలా చేస్తున్నారు.
రావుల గోల!
రఘునందన్రావుకు కేసీఆర్ ఫ్యామిలీకి మెదక్లో కులం పంచాయితీ ఉంది. ఈ రావును ఆ రావులంతా కలిసి తొక్కేశారని అంటారు. గులాబీ పార్టీ లీడర్గానే రఘునందన్ పొలిటికల్ కెరీర్ స్టార్ట్ చేశారు. మెదక్లో హరీశ్రావుకు పోటీగా ఎదిగడంతో.. ఆయనే ఈయన్ను అణిచేశారని చెబుతారు. హర్ట్ అయిన రఘునందన్ కారు దిగేసి, కాషాయ కండువా కప్పేసుకున్నారు. కవిత లేఖ తర్వాత తన డైలాగులతో రిటర్న్ గిఫ్ట్ ఇస్తున్నారని అంటున్నారు.
కొత్తపార్టీ.. పాదయాత్ర.. నిజమేనా?
అసలే మాటకారి రఘునందన్రావు. కవిత ఇష్యూలో సంచలన కామెంట్స్ చేస్తున్నారు. కవిత మరో షర్మిల అవుతుందంటూ మొదటి రోజే కాక రేపారు. అధిపత్యం కోసం, ఆస్తుల కోసం గొడవ పడుతున్నారని చెప్పారు. ఆ తర్వాత కవిత కొత్త పార్టీ పెడుతోందంటూ ప్రచారం చేశారు. ఆ డేట్ కూడా ఆయనే ఫిక్స్ చేశారు. జూన్ 2న కవిత కొత్త పార్టీ అంటూ స్టేట్మెంట్ ఇచ్చారు. పార్టీ పెట్టగానే తెలంగాణలో పాదాల మీద నడిచే యాత్ర.. పాదయాత్ర చేయొచ్చంటూ మరింత ఇంట్రెస్టింగ్ టాపిక్ ప్రస్తావించారు.
Also Read : కవిత పాదయాత్ర? ఆ తర్వాత..!
నాన్స్టాప్ అటాక్ అందుకేనా?
కవిత వ్యూహాలు తన లాయర్ లాజిక్తో రఘునందన్ ముందే పసిగడుతున్నారా? లేదంటే, ఆయన తన సోర్సెస్ ద్వారా ఇంటర్నల్ మేటర్ తెలుసుకుంటున్నారా? కావాలనే బట్టకాల్చి మీదేస్తున్నారా? రఘునందన్రావు వ్యాఖ్యల వెనుక బీజేపీ ఉందా? అవి ఆయన వ్యక్తిగత స్టేట్మెంట్సా? బీజేపీ, బీఆర్ఎస్ పొత్తు అనే ప్రచారం బలపడకుండా జాగ్రత్త పడేందుకే ఇలా కవితపై బీజేపీ నాన్స్టాప్ అటాక్ చేస్తోందని అనుమానిస్తున్నారు.