Fund Misuse: స్వేచ్ఛ బ్యూరో: మున్సిపల్ ఎన్నికల నిధుల కేటాయింపులో జరిగిన అక్రమాలపై బీజేపీ రాష్ట్ర నాయకత్వం అత్యంత కఠినంగా వ్యవహరిస్తోంది. గెలుపు అవకాశాలు లేని మున్సిపాలిటీలను అత్యధిక ప్రాధాన్యత ఉన్న కేటగిరీలుగా చూపి, నిధులు దారి మళ్లించిన వ్యవహారం పార్టీలో చిచ్చు రేపుతోంది. ఈ మున్సిపల్ ఎన్నికల పైసల పంచాయితీ హైకమాండ్ కు సైతం చేరింది. దీంతో రాష్ట్ర నాయకత్వం ఒక కమిటీని నియమించి వాస్తవాలు తేల్చే పనిలో పడింది. ఇప్పటికే మూడు దఫాలుగా ఈ కమిటీ భేటీ అయినట్లు తెలుస్తోంది. కాగా త్వరలోనే ఈ కమిటీ ఫైనల్ నివేదికను అందించే అవకాశాలున్నట్లు తెలుస్తోంది. ఆ నివేదిక ఆధారంగా బాధ్యులపై పార్టీ కఠిన చర్యలకు సిద్ధమవుతోంది.
ఇటీవల జరిగిన మున్సిపల్ ఎన్నికల్లో నిధుల కేటాయింపులకు సంబంధించిన అంశంపై ఎలాంటి ఫ్రాడ్ జరగలేదని రాష్ట్ర నాయకత్వం చెబుతోంది. ఎన్నికల సమయంలో మున్సిపాలిటీలను గెలుపు అవకాశాల ఆధారంగా బీజేపీ మూడు కేటగిరీలుగా విభజించింది ఏ కేటగిరీ అంటే గెలుపు ఖాయమని భావించే స్థానాలు కాగా బీ కేటగిరీ గట్టి పోటీ ఇస్తే గెలిచే అవకాశం ఉన్న స్థానాలని, సీ కేటగిరీ పార్టీకి బలం తక్కువగా ఉండి, గెలుపు అవకాశాలు ఏమాత్రం లేని స్థానాలుగా విభజించింది. అయితే ఏమాత్రం గెలుపు ఆశలు లేని సీ కేటగిరీ మున్సిపాలిటీలను, రికార్డుల్లో ఏ కేటగిరీ కింద చూపించి భారీగా నిధులు డ్రా చేసినట్లు పార్టీ అంతర్గత విచారణలో తేలింది. ఈ నిధుల గోల్మాల్ పై రాష్ట్ర నాయకత్వం తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తోంది. ఏ కేటగిరీ కింద పేరు నమోదు చేసుకున్న వారు గెలవకపోగా.. కనీసం ఒకట్రెండు చోట్ల 10 ఓట్లు కూడా దక్కించుకోకపోవడం గమనార్హం. ఇకపోతే.. సీ కేటగిరీలో ఉన్న పలు స్థానాల్లో మాత్రం విజయం సాధించినట్లు తెలిసింది.
Also Read: Steve Smith: సమయానికి భోజనం కూడా పెట్టడం లేదు..PSL మా చావుకు వచ్చింది
ఈ అవినీతి పర్వంపై నిజానిజాలు తేల్చేందుకు పార్టీ ప్రత్యేక కమిటీని రంగంలోకి దించింది. ఇప్పటికే ఈ ప్రత్యేక కమిటీ మూడుసార్లు సమావేశమై కీలక ఆధారాలను సేకరించింది. నిధుల మళ్లింపు ఎక్కడ జరిగింది? ఎవరి హస్తం ఉంది? అనే అంశాలపై తుది నివేదిక సిద్ధమవుతోంది. ఇందులో ఇన్వాల్వ్ అయిన వారు ఎవరైనా సరే.. ఎంతటి వారైనా సరే ఉపేక్షించే ప్రసక్తే లేదని రాష్ట్ర నాయకత్వం ఇప్పటికే స్పష్టమైన హెచ్చరికలు జారీ చేసింది. నివేదికలో దోషులుగా తేలిన వారిపై వేటు వేసేందుకు పార్టీ సిద్ధమవుతోంది. ప్రస్తుతం పార్టీలో ఆయా బాధ్యతల్లో ఉన్న వారిని తక్షణమే పదవుల నుంచి కొంత టైం పీరియడ్ వరకు తొలగించడంతో పాటు భవిష్యత్ లోనూ పదవుల కేటాయింపులో పక్కన పెట్టే అవకాశముందని చెబుతున్నారు. పార్టీ క్రమశిక్షణను ఉల్లంఘించి, ఎన్నికల ఫండ్ను వ్యక్తిగత అవసరాలకు లేదా తప్పుడు లెక్కలకు వాడుకున్న వారిపై ఈ చర్యలు రాజకీయ వర్గాల్లో హాట్ టాపిక్గా మారాయి. మరి ఫైనల్ రిపోర్ట్ వచ్చిన తర్వాత రాష్ట్ర నాయకత్వం బాధ్యులపై యాక్షన్ తీసుకుంటుందా? లేక వార్నింగ్ ఇచ్చి చేతులు దులుపుకుంటుందా? అనేది చూడాలి.
Also Read: సామాన్యుల బ్రాండ్.. వర్ల్పూల్ టాప్ సింగిల్ డోర్ ఫ్రిడ్జ్లు.. సమ్మర్కు బెస్ట్ ఛాయిస్ భయ్యా!