Jubilee Hills bypoll: జూబ్లీహిల్స్ ఉపఎన్నికల ఓట్ల లెక్కింపులో ఆసక్తికర పరిణామం చోటుచేసుకుంది. బీజేపీ అభ్యర్థి లంకల దీపక్ రెడ్డి ఐదు రౌండ్ల లెక్కింపు పూర్తయిన వెంటనే కౌంటింగ్ సెంటర్ నుంచి వెళ్లిపోయారు. తొలి రౌండ్ల నుంచే ప్రత్యర్థి పార్టీ అభ్యర్థి గణనీయమైన ఆధిక్యాన్ని కనబరచడంతో.. దీపక్ రెడ్డి నిరాశకు గురైనట్లు తెలుస్తోంది. ఐదో రౌండ్లోనూ వెనుకంజలో ఉండటంతో, మిగిలిన రౌండ్ల ఫలితాలు చూడకుండానే ఆయన కేంద్రం నుంచి నిష్క్రమించారు. ఈ పరిణామం కౌంటింగ్ కేంద్రంలో చర్చనీయాంశమైంది. తుది ఫలితాల ప్రకటన ఇంకా పూర్తికావాల్సి ఉంది.
అయితే..జూబ్లీహిల్స్ బైపోల్ ఓట్ల లెక్కింపు తుది దశకు చేరుకుంటున్న వేళ.. బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రాంచందర్ రావు సంచలన వ్యాఖ్యలు చేశారు. కౌంటింగ్ ప్రారంభం అయినప్పటి నుంచి కాంగ్రెస్, బీఆర్ఎస్ అభ్యర్థులు హోరాహోరీగా ఆధిక్యంలో దూసుకుపోతుండగా.. బీజేపీ అభ్యర్థి పూర్తిగా వెనుకంజలో పడ్డారు. ఈ నేపథ్యంలో.. తమ పార్టీ అభ్యర్థి గెలుస్తారని తాము ముందే ఊహించలేదని రాంచందర్ రావు హాట్ కామెంట్స్ చేశారు. కేవలం నియోజకవర్గంలో పార్టీ ఉనికిని.. ప్రజాస్వామ్య ప్రాతినిధ్యాన్ని చాటుకోవడానికే ఈ ఎన్నికల్లో పోటీ చేశామని ఆయన స్పష్టం చేశారు.
ఎన్నికల బరిలో వెనుకబడిన బీజేపీ..
ఓట్ల లెక్కింపు ప్రక్రియలో బీజేపీ ఆశించిన స్థాయిలో ఓట్లను సాధించలేకపోయింది. తొలి రౌండ్లో కొంతవరకు 2,167 ఓట్లు దక్కించుకున్నప్పటికీ, తదుపరి రౌండ్లలో ఆ పార్టీ ప్రదర్శన పూర్తిగా వెనుకబడిపోయింది. కాంగ్రెస్, బీఆర్ఎస్ అభ్యర్థులు నువ్వానేనా అన్నట్లుగా పోటీ పడుతుండగా, బీజేపీ తరఫు అభ్యర్థి మాత్రం కౌంటింగ్లో చెప్పుకోదగిన ప్రభావం చూపలేకపోయారు.
కౌంటింగ్ కేంద్రం వద్ద కంటతికి కనిపించని నాయకులు..
బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడి వ్యాఖ్యలు పార్టీ వర్గాల్లో చర్చనీయాంశమయ్యాయి. తమ పార్టీ గెలుపొందదని ముందే తెలుసంటూ ఆయన చేసిన ప్రకటన.. ఉపఎన్నికల పట్ల పార్టీ వైఖరిని తెలియజేస్తోంది. ఈ వ్యాఖ్యలకు తగ్గట్టుగానే, ఓట్ల లెక్కింపు కేంద్రం వద్ద బీజేపీకి చెందిన ముఖ్య నాయకులు గానీ.. కార్యకర్తలు గానీ పెద్దగా కనిపించకపోవడం గమనార్హం. ఇతర పార్టీల నాయకులు, ఏజెంట్లు కౌంటింగ్ సరళిని నిశితంగా పరిశీలిస్తున్న తరుణంలో, బీజేపీ వర్గాలు కౌంటింగ్ కేంద్రం వద్ద మౌనం పాటించడం.. ఈ ఎన్నికపై ఆ పార్టీ ఎంతవరకు దృష్టి పెట్టిందనే విషయాన్ని స్పష్టం చేస్తోంది. బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడి వ్యాఖ్యలు, కౌంటింగ్ కేంద్రం వద్ద పార్టీ నాయకుల లేమిని చూస్తే.. ఈ ఉపఎన్నికను బీజేపీ కేవలం నామమాత్రపు పోటీగానే పరిగణించినట్లు తెలుస్తోంది.
ALSO READ: Jubilee Hills by-election: టెన్షన్ టెన్షన్.. నరాలు తెగే ఉత్కంఠ.. జూబ్లీ రణరంగంలో కింగ్ ఎవరు..?