Konda Surekha: జూబ్లీహిల్స్ ఉపఎన్నిక ఫలితాలపై రాష్ట్ర ప్రభుత్వం, ముఖ్యంగా కాంగ్రెస్ శ్రేణుల్లో ఆనందం వెల్లివిరుస్తోంది. ఈ సందర్భంగా బిగ్ టీవీకి ప్రత్యేకంగా స్పందించిన మంత్రి కొండా సురేఖ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ఉపఎన్నికలో కాంగ్రెస్ అభ్యర్థి నవీన్ యాదవ్ విజయం సాధించడంతో, పార్టీ శ్రేణుల్లో నూతన ఉత్సాహం నెలకొంది. ఈ గెలుపు ఆకస్మికం కాదని, ప్రచార దశ నుంచే స్పష్టంగా కనిపించిందని ఆమె అన్నారు.
మంత్రి కొండా సురేఖ మాట్లాడుతూ, ఉపఎన్నిక ప్రచారంలో మేము ప్రజల్లోకి వెళ్లిన ప్రతిచోటా నవీన్ యాదవ్ పట్ల స్పష్టమైన మద్దతు కనిపించింది. రెండు సార్లు ఓడినా, ప్రజల్లో ఉంటూ మంచిపేరు తెచ్చుకున్నాడు అని చెప్పారు. ఏ ఇంటికి వెళ్ళినా నవీన్ యాదవ్ గెలుస్తాడని చెప్పారు.
ఈ ఉపఎన్నికలో కాంగ్రెస్ చేపట్టిన బీసీ నినాదం ప్రజల్లో మంచి ప్రభావం చూపిందని సురేఖ స్పష్టం చేశారు. బీసీ సమూహాల ఏకతాభావం, వారి రాజకీయ ప్రాతినిధ్యం పెరగాలనే ఆకాంక్ష.. ఈ ఎన్నికలో స్పష్టంగా కనబడిందని ఆమె పేర్కొన్నారు. పార్టీ తీసుకున్న నిర్ణయాలు, బీసీలకు ఇచ్చిన ప్రాధాన్యతే ప్రజల్లో సానుకూలతను పెంచిందని అన్నారు.
బీఆర్ఎస్ ఈ ఎన్నికలో పేలవ ఫలితాలను ఎదుర్కొనడం పై మంత్రి సురేఖ తీవ్రంగా స్పందించారు. బీఆర్ఎస్ పని ఇప్పుడు పూర్తిగా ఖతం అయినట్టే. సోషల్ మీడియాలో పెయిడ్ ఆర్టిస్ట్లతో నెగటివ్ ప్రచారం చేసి మరింత దెబ్బతిన్నారు అని ఆమె మండిపడ్డారు.
జూబ్లీ హిల్స్ ప్రజలకు, ఎంఐఎం శ్రేణులకు కృతజ్ఞతలు తెలిపారు. గెలుపు తర్వాత నవీన్ యాదవ్ ప్రజల మనిషి లాగే ఉండాలి. ఎమ్మెల్యేను అనే అహంకారం వస్తె భవిష్యత్తు ఆగమవుతుంది. నవీన్ యాదవ్ ప్రజల సేవలో ఉంటూ మరెన్నో విజయాలు సాధించాలి అని కొండా సురేఖ తెలిపారు.
Also Read: టెన్షన్ టెన్షన్.. నరాలు తెగే ఉత్కంఠ.. జూబ్లీ రణరంగంలో కింగ్ ఎవరు..?
బీఆర్ఎస్ నుంచి కొందరు నేతలు కాంగ్రెస్లో చేరతారన్న వార్తలపై స్పందిస్తూ.. అలాంటి నిర్ణయాలు మా పార్టీ అధిష్ఠానం చూసుకుంటుందని తెలిపారు.