Indigo Airlines: ఇటీవల కాలంలో విమానాలకు బాంబు బెదిరింపు మెయిల్స్, కాల్స్ ఎక్కువగా వస్తున్నాయి. కొంతమంది కావాలనే ఫేక్ మెయిల్ చేస్తున్నారు. దీంతో ప్రయాణికులు తీవ్ర భయాందోళనకు గురవుతున్నారు. తాజాగా ఇండిగో ఎయిర్ లైన్ ఫ్లైట్ కు కూడా బాంబు బెదరింపు మెయిల్ వచ్చింది. సౌదీ అరేబియాలోని మదీనా నుంచి హైదరాబాద్కు వస్తున్న ఇండిగో ఎయిర్లైన్స్ విమానం 6E058కు బాంబు బెదిరింపు రావడంతో గురువారం రోజున అహ్మదాబాద్లోని సర్దార్ వల్లభాయ్ పటేల్ అంతర్జాతీయ విమానాశ్రయంలో (SVPIA) అత్యవసరంగా ల్యాండ్ అయింది. ఈ ఘటనతో విమానంలో ఉన్న ప్రయాణికులు, సిబ్బంది తీవ్ర భయాందోళనలకు గురయ్యారు. ఈ విమానంలో మొత్తం 180 మంది ప్రయాణికులు, ఆరుగురు సిబ్బంది ఉన్నారు.
విమానంలో బాంబు ఉన్నట్లు కంట్రోల్ రూమ్కు అజ్ఞాత కాల్ లేదా ఈమెయిల్ ద్వారా బెదిరింపు అందింది. వెంటనే అప్రమత్తమైన ఎయిర్పోర్ట్ అధికారులు, ఎయిర్లైన్ సిబ్బంది అప్రమత్తత ప్రకటించారు. ప్రయాణీకుల భద్రతను దృష్టిలో ఉంచుకుని.. ఈ విమానాన్ని హైదరాబాద్కు చేరుకోకముందే అహ్మదాబాద్లో దారి మళ్లించారు. సురక్షితంగా అత్యవసర ల్యాండింగ్ చేశారు. ల్యాండింగ్ అయిన వెంటనే.. విమానాన్ని ఐసోలేషన్ బేలోకి తరలించారు.
అత్యవసర ల్యాండింగ్ అనంతరం, విమానంలో తనిఖీలు నిర్వహించడానికి భద్రతా బలగాలు రంగంలోకి దిగాయి. బాంబు డిస్పోజల్ స్క్వాడ్ (BDS), డాగ్ స్క్వాడ్, స్థానిక పోలీసులు కలసి విమానాన్ని క్షుణ్ణంగా తనిఖీ చేశారు. గంటల తరబడి సాగిన విస్తృత తనిఖీల్లో విమానంలో ఎలాంటి అనుమానాస్పద వస్తువులు లేదా పేలుడు పదార్థాలు లభ్యం కాలేదని భద్రతాధికారులు స్పష్టం చేశారు. విమానాన్ని హైదరాబాద్కు పంపడానికి ఏర్పాట్లు చేస్తున్నారు. పోలీసులు ఈ బెదిరింపుకు పాల్పడిన వారిని గుర్తించేందుకు, చట్టపరమైన చర్యలు తీసుకునేందుకు దర్యాప్తు ప్రారంభించారు. దీనిపై మరింత సమాచారం తెలియాల్సి ఉంది.
ALSO READ: Hidma Encounter: హిడ్మా ఎన్ కౌంటర్ భూటకపు హత్య.. పట్టించింది ఆ ద్రోహులే.. మావోయిస్టుల సంచలన లేఖ