Bomb Threat: హైదరాబాద్లోని నాంపల్లి కోర్టు సముదాయాన్ని బాంబు బెదిరింపులు మరోసారి కలవరపెట్టాయి. గుర్తుతెలియని వ్యక్తుల నుంచి వచ్చిన ఈమెయిల్ ఉదంతంతో న్యాయవాదులు, కక్షిదారులు ఒక్కసారిగా ఆందోళనకు గురయ్యారు. గడిచిన వారం రోజుల్లోనే ఇలాంటి బెదిరింపు రావడం ఇది మూడోసారి కావడం గమనార్హం. ఈసారి ఏకంగా నాంపల్లి క్రిమినల్ కోర్టు సూపరింటెండెంట్కు మెయిల్ రావడంతో పోలీసులు వెంటనే రంగంలోకి దిగారు.
సమాచారం అందుకున్న వెంటనే నగర పోలీసులు, బాంబు డిస్పోజల్ టీమ్స్, డాగ్ స్క్వాడ్తో కోర్టు ప్రాంగణం మొత్తాన్ని జల్లెడ పట్టారు. ప్రతి గదిని, పార్కింగ్ ఏరియాను క్షుణ్ణంగా తనిఖీ చేశారు. అయితే, గంటల తరబడి సాగిన ఈ సోదాల్లో ఎటువంటి పేలుడు పదార్థాలు లభ్యం కాకపోవడంతో అందరూ ఊపిరి పీల్చుకున్నారు. చివరకు ఇది కేవలం ఆకతాయిలు చేసిన “ఫేక్ మెయిల్” అని అధికారులు ప్రాథమికంగా నిర్ధారించారు.
గత వారం కూడా సరిగ్గా ఇదే తరహాలో నాంపల్లిలోని సీబీఐ కోర్టును పేల్చేస్తామంటూ బెదిరింపులు వచ్చిన సంగతి తెలిసిందే. వరుసగా కోర్టులనే లక్ష్యంగా చేసుకుని ఈమెయిల్స్ వస్తుండటంతో పోలీసులు ఈ విషయాన్ని అత్యంత ప్రతిష్టాత్మకంగా తీసుకున్నారు. న్యాయ వ్యవస్థ కార్యకలాపాలకు ఆటంకం కలిగిస్తూ, ప్రజల్లో భయాందోళనలు సృష్టిస్తున్న ఇలాంటి మెయిల్స్ వెనుక ఉన్న ఉద్దేశంపై లోతైన విచారణ జరుపుతున్నారు.
ఈ అగంతకులను పట్టుకునేందుకు సైబర్ క్రైమ్ విభాగంతో పాటు ప్రత్యేక టెక్నికల్ టీమ్స్ రంగంలోకి దిగాయి. మెయిల్ పంపిన ఐపీ అడ్రస్ ఆధారంగా నిందితులను గుర్తించే ప్రయత్నం చేస్తున్నారు. విదేశీ సర్వర్ల ద్వారా లేదా వీపీఎన్ (VPN) ఉపయోగించి ఈ మెయిల్స్ పంపినట్లు అనుమానిస్తున్నారు. సాంకేతిక ఆధారాలను విశ్లేషించి, త్వరలోనే బాధ్యులను కటకటాల్లోకి నెడతామని ఉన్నతాధికారులు ధీమా వ్యక్తం చేస్తున్నారు.
Also Read: సీఎం రేవంత్ సవాల్కు హరీశ్ సై.. ఈసారైనా సభలోనే ఉంటారా?
ప్రస్తుతం నాంపల్లి కోర్టు వద్ద భద్రతను మరింత కట్టుదిట్టం చేశారు. అక్కడి వచ్చిన ప్రతి ఒక్కరినీ క్షుణ్ణంగా పరిశీలించిన తర్వాతే లోపలికి అనుమతిస్తున్నారు. కోర్టు విధులకు ఆటంకం కలగకుండా ముందస్తు జాగ్రత్తలు తీసుకుంటున్నామని, ప్రజలు ఆందోళన చెందాల్సిన అవసరం లేదని పోలీసులు భరోసా కల్పించారు. పదే పదే ఇలాంటి తప్పుడు సమాచారంతో వ్యవస్థలను తప్పుదోవ పట్టించే వారిపై కఠిన చట్టాల కింద కేసులు నమోదు చేయనున్నట్లు హెచ్చరించారు.