Political news: కొన్ని కొన్ని సార్లు కాలం విసిరే సవాళ్లు ఎలా ఉంటాయంటే.. ఏదో చేసేద్దామని ఉన్నా.. ఏమీ చేయలేని పరిస్థితులుంటాయ్. హైదరాబాద్ స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నికల విషయంలోనూ.. బీఆర్ఎస్కు అలాంటి పరిస్థితే ఎదురైంది. పోటీ చేసేందుకు అవసరమైనంత బలం లేదు. ఉన్న అవకాశమల్లా ఓటింగ్లో పాల్గొనడమే. కానీ.. ఒక పార్టీతో సింక్ లేదు.. మరో పార్టీతో లింక్ లేదు. ఇంతటి కన్ఫ్యూజన్లోనూ.. బీఆర్ఎస్ ఫుల్ క్లారితో ఓ డెసిషన్ తీసుకుంది. అదేంటో.. మీరే చూడండి.
ఎక్స్అఫీషియో సభ్యులతో కలిపి మొత్తం 112 మంది ఓటర్లు
మొన్నటిదాకా హైదరాబాద్ స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఎంఐఎం అభ్యర్థి ఏకగ్రీవం అయిపోతారనుకున్నారు. అక్కడ వాళ్లకున్న బలం అలాంటిది. కానీ.. ఎప్పుడైతే బీజేపీ తమ అభ్యర్థిని బరిలోకి దించిందో.. అప్పుడు ఎన్నిక అనివార్యమైంది. ఈ ఎన్నికల్లో.. ఎక్స్అఫీషియో సభ్యులతో కలిపి మొత్తంగా 112 మంది ఓటర్లు ఉన్నారు. పార్టీల వారీగా చూసుకుంటే.. ఎంఐఎంకి ఓ ఎంపీ, ఓ ఎమ్మెల్సీ, ఏడుగురు ఎమ్మెల్యేలు ఎక్స్ అఫీషియో సభ్యులు ఉన్నారు. వారితో పాటు 40 మంది కార్పొరేటర్లు ఉన్నారు.
ఎమ్మెల్సీ ఎన్నికల్లో గెలవాలంటే 57 ఓట్లు కావాలి!
దాంతో.. ఎంఐఎం బలం 49కి చేరింది. ఎన్నిక ఏకగ్రీవం కాకుండా బరిలో దిగిన బీజేపీకి.. నలుగురు ఎంపీలు, ఓ ఎమ్మెల్యే, ఓ ఎమ్మెల్సీ ఎక్స్అఫీషియో సభ్యులుగా ఉన్నారు. అలాగే.. బీజేపీలో గెలిచి పార్టీ మారిన కొందరు కార్పొరేటర్లని మినహాయిస్తే.. మరో 19 మంది కార్పొరేటర్లతో కలిపి 25 మంది ఓటర్లు ఉన్నారు. కానీ.. స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నికల్లో గెలవాలంటే 57 ఓట్లు దక్కించుకోవాలి. కాబట్టి.. ఎంఐఎం అయినా, బీజేపీ అయినా.. ఇతర పార్టీల ఓటర్లపై ఆధారపడటం తప్ప మరో అవకాశం లేదు.
కాంగ్రెస్ పార్టీకి ఏడుగురు ఎక్స్అఫీషియో సభ్యులు
ఎంఐఎంకు మిత్రపక్షంగా కొనసాగుతున్న అధికార కాంగ్రెస్ పార్టీలో.. ఇతర పార్టీల నుంచి వచ్చి చేరిన వారితో కలిపి.. ఏడుగురు ఎక్స్అఫీషియో సభ్యులు, మరో ఏడుగురు కార్పొరేటర్లతో కలిపి.. మొత్తం 14 మంది ఓటర్లు ఉన్నారు. పోటీలో లేని బీఆర్ఎస్ దగ్గర పార్టీ ఫిరాయించిన వారు మినహా 9 మంది ఎక్స్అఫీషియో సభ్యులు, 15 మంది కార్పొరేటర్లతో కలిపి.. 24 మంది ఓటర్లు ఉన్నారు. అందువల్ల.. పార్టీలకు అతీతంగా అన్ని పార్టీల ఓటర్లను కలిసి వారి ఓట్లను దక్కించుకుంటామనే ధీమాలో ఉంది బీజేపీ. ఇక్కడే.. బీఆర్ఎస్ ఊహించని విధంగా షాక్ ఇచ్చింది. స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నికల పోలింగ్లో పాల్గొనొద్దని.. తమ కార్పొరేటర్లు, ఎక్స్అఫీషియో సభ్యులను ఆదేశిస్తూ విప్ జారీ చేస్తామని ప్రకటించింది.
బీఆర్ఎస్ తీసుకున్న నిర్ణయంతో బీజేపీకి పెద్ద దెబ్బ
బీఆర్ఎస్తో పాటు కాంగ్రెస్ పార్టీలోఉన్న కార్పొరేటర్లను ఏదో రకంగా తమవైపు తిప్పుకోవాలనుకున్న బీజేపీ లెక్కలకు.. బీఆర్ఎస్ తీసుకున్న నిర్ణయం పెద్ద దెబ్బేననే చర్చ జరుగుతోంది. మరోవైపు.. బీఆర్ఎస్ కూడా ఎంతో చాకచక్యంగా ఈ పోలింగ్ నుంచి తప్పుకుందనే విశ్లేషణలు వినిపిస్తున్నాయ్. ఎందుకంటే.. ఇప్పుడు ఎంఐఎంతో మిత్రుత్వం లేదు. బీజేపీతో తమకు అసలే పడదని.. బీఆర్ఎస్ నేతలు చెబుతుంటారు. ఇలాంటి పరిస్థితుల్లో.. బీఆర్ఎస్ నేతలు పోలింగ్లో పాల్గొంటే.. అటు ఎంఐఎం గెలిచినా, ఇటు బీజేపీ గెలిచినా.. బద్నాం అయ్యేది మాత్రం బీఆర్ఎస్సేననే టాక్ గట్టిగా వినిపిస్తోంది.
Also Read: ముగిసిన సీఎం రేవంత్ జపాన్ పర్యటన.. వారం రోజుల్లో సాధించింది ఇదే..
మజ్లిస్ గెలిస్తే.. కారు స్టీరింగ్ ఎంఐఎం చేతిలోనే ఉందనే విమర్శలు
మజ్లిస్ పార్టీ గెలిస్తే.. ఇంకా కారు స్టీరింగ్ ఎంఐఎం చేతిలోనే ఉందని బీజేపీ ఆరోపిస్తుంది. అదే.. బీజేపీ గెలిస్తే.. కారు, కమలం ఒకటేనని కాంగ్రెస్ వాయించేస్తుంది. అందువల్ల.. ఎటూ కాకుండా పోలింగ్కు దూరంగా ఉంటే.. రాజకీయంగా ఎలాంటి బాధ ఉండదనే ఆలోచనతోనే.. బీఆర్ఎస్ ఈ నిర్ణయం తీసుకుందనే చర్చ రాజకీయ వర్గాల్లో సాగుతోంది. ఏదేమైనా.. బీఆర్ఎస్ తీసుకున్న నిర్ణయం ఎంఐఎంని సునాయాసంగా గట్టెక్కేలా చేసిందంటున్నారు విశ్లేషకులు.