KTR: ఫోన్ ట్యాపింగ్ కేసు పేరుతో మాజీ ఎంపీ జోగినపల్లి సంతోష్ కుమార్ సిట్ నోటీసులు జారీ చేయడంపై బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ స్పందించారు. సిట్ విచారణ ఒక అట్టర్ ప్లాప్ టీవీ సీరియల్ను తలపిస్తోందని విమర్శించారు. అసలైన బాధ్యులైన అధికారులను వదిలేసి, కేసుతో సంబంధం లేని ప్రతిపక్ష నాయకులకు వరుసగా విచారణకు పిలవడం రాజకీయ కక్షసాధింపు అన్నారు. ఇదంతా కేవలం అటెన్షన్ డైవర్షన్ లో భాగమేనని కేటీఆర్ విమర్శించారు. ముఖ్యంగా మున్సిపల్ ఎన్నికల ముందు ప్రజల సమస్యల నుంచి దృష్టి మరల్చడం కోసమే ఫోన్ ట్యాపింగ్ కేసు, విచారణ డ్రామాలను కాంగ్రెస్ ప్రభుత్వం చేస్తున్నదన్నారు.
రాష్ట్రంలో జరుగుతున్న భారీ అవినీతి, కుంభకోణాల నుంచి ప్రజల దృష్టిని మళ్లించడానికే రేవంత్ రెడ్డి ప్రభుత్వం సిట్ విచారణను ఒక ఆయుధంగా వాడుకుంటుందని కేటీఆర్ మండిపడ్డారు. ముఖ్యంగా నైని బొగ్గు గనుల కుంభకోణం బయటపడటకు రావడంతో ప్రభుత్వం పీకల్లోతు కష్టాల్లో ఉందన్నారు. ఈ స్కామ్ ను పక్కదారి పట్టించేందుకే నోటీసుల డ్రామా అని విమర్శించారు. గతంలో హరీష్ రావు, తనను కూడా ఇదే కేసు పేరుతో విచారించినా ఏమీ సాధించలేకపోయారన్నారు. ఇప్పుడు సంతోష్ కుమార్ ను లక్ష్యంగా చేసుకున్నారని మండిపడ్డారు.
Also Read : లీకుల సర్కార్ – డైవర్షన్ పాలిటిక్స్.. అసమర్థతను కప్పిపుచ్చుకోవడానికే నోటీసులు.. కేటీఆర్ సంచలన ఆరోపణలు
రేపు రాజ్ భవన్ కు వెళ్లి గవర్నర్ ను బొగ్గు కుంభకోణంపై వినతిపత్రం ఇస్తామని బీఆర్ఎస్ ప్రకటించిన వెంటనే సంతోష్ కుమార్ కు నోటీసులు రావడం యాదృచ్ఛికం కాదన్నారు. ఇది ముందస్తు ప్రణాళికతో చేసిన అటెన్షన్ డైవర్షన్ అని కేటీఆర్ అన్నారు. సంతోష్ కుమార్ కు బీఆర్ఎస్ అండగా ఉంటుందని, న్యాయస్థానాల్లో ఈ అక్రమ కేసులను ఎదుర్కొంటామని కేటీఆర్ తెలిపారు.