KTR: ఫొన్ ట్యాపింగ్ కేసులో కీలక పరిణామం చోటుచేసుకుంది. జూబ్లీహిల్స్ పోలీస్ స్టేషన్లో బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ సుదీర్ఘ విచారణ ఎదుర్కొన్నారు. ఈ కేసులో కేటీఆర్ను పోలీసులు సుమారు 7 గంటల పాటు ప్రశ్నించారు. విచారణ అనంతరం కేటీఆర్ నేరుగా తెలంగాణ భవన్కు చేరుకుని మీడియాతో మాట్లాడారు.
విచారణ ముగిసిన తర్వాత కేటీఆర్ మీడియా ముందు అధికార కాంగ్రెస్ ప్రభుత్వంపై నిప్పులు చెరిగారు. తన విచారణను కేవలం ప్రజల దృష్టి మళ్లించే కాలక్షేప కథా చిత్రంగా అభివర్ణించారు. విచారణలో భాగంగా తాను అధికారులను సూటిగా ప్రశ్నించానని కేటీఆర్ తెలిపారు.
“గత రెండేళ్లుగా విచారణ పేరిట లీకులు ఇస్తూ, మా పార్టీ నేతల వ్యక్తిత్వ హననం (Character Assassination) చేస్తున్నారు. కొంతమంది హీరోయిన్లను ట్యాప్ చేసి బెదిరించారని అడ్డగోలుగా ప్రచారం చేశారు. ఇది నిజమైతే నా ముందు సాక్ష్యాలు పెట్టండి అని అడిగాను” అని ఆయన చెప్పారు. దీనికి పోలీసుల వద్ద సమాధానం లేదని, మీడియాలో వచ్చే తప్పుడు వార్తలకు తమ కుటుంబాలు పడుతున్న క్షోభకు ఎవరు బాధ్యత వహిస్తారని ఆయన నిలదీశారు.
ప్రస్తుత కాంగ్రెస్ పాలనలోనూ ట్యాపింగ్ జరుగుతోందని కేటీఆర్ ఆరోపించారు. “ఈరోజు రాష్ట్రంలో ప్రతిపక్ష నాయకులు, ఎమ్మెల్యేల ఫోన్లు ట్యాప్ కావడం లేదా?” అని తాను సిట్ అధికారులను అడిగితే వారు నీళ్లు నమిలారని ఎద్దేవా చేశారు. ఒక మంత్రి స్వయంగా తన ఫోన్ ట్యాప్ అవుతోందని జర్నలిస్టులతో చెప్పుకునే దుస్థితి ఈ రాష్ట్రంలో ఉందని ఆయన విమర్శించారు.
బీఆర్ఎస్ నేతలపై విచారణలు జరుపుతున్న ప్రభుత్వం, తమ సొంత నేతల అక్రమాలపై ఎందుకు మౌనంగా ఉందని కేటీఆర్ ప్రశ్నించారు. సింగరేణి టెండర్లలో ముఖ్యమంత్రి, మంత్రుల మధ్య వాటాల పంచాయితీ నడుస్తోందని హరీష్ రావు ఆధారాలతో సహా బయటపెట్టినా ప్రభుత్వం స్పందించడం లేదన్నారు.
రెవెన్యూ మంత్రి కొడుకు గుండాలతో భూ కబ్జాలు చేస్తున్నా, ముఖ్యమంత్రి బావమరిది ‘అమృత్’ టెండర్లలో కింగ్ పిన్గా ఉన్నా ఎందుకు సిట్ వేయడం లేదని నిలదీశారు. హైదరాబాద్ ప్రజల ఆస్తి అయిన రూ. 5 లక్షల కోట్ల పారిశ్రామిక భూములను కొల్లగొట్టే ప్రయత్నం చేస్తున్నారని, దీనిపై విచారణ ఏదని ప్రశ్నించారు.
“మీరు ఎన్ని కేసులు పెట్టినా, ఎన్నిసార్లు పిలిచినా బాధ్యతగల ప్రతిపక్షంగా విచారణకు సహకరిస్తాం. కానీ ప్రజల దృష్టి మళ్లించడానికి మీరు ఆడే ఈ డైవర్షన్ గేమ్లను ఎండగడుతూనే ఉంటాం” అని కేటీఆర్ స్పష్టం చేశారు. తనను విచారించిన అధికారులు అడిగిన ప్రశ్నలనే మళ్లీ మళ్లీ అడుగుతూ సుమారు 300 పేర్లు చదివి సమయం వృథా చేశారని, వారి దగ్గర ఎలాంటి ఆధారాలు లేవని ఆయన ధీమా వ్యక్తం చేశారు.
ఉదయం ప్రారంభమైన ఈ విచారణ సాయంత్రం వరకు కొనసాగింది. పోలీసులు సిద్ధం చేసిన సుమారు 50కి పైగా ప్రశ్నలకు కేటీఆర్ సమాధానమిచ్చినట్లు సమాచారం. ట్యాపింగ్ ఆదేశాలు ఎవరి నుంచి వచ్చాయి? సేకరించిన సమాచారాన్ని ఎవరికి చేరవేశారు? అనే కోణంలో ప్రశ్నలు అడిగినట్లు తెలుస్తోంది.
Read Also: ఫోన్ ట్యాపింగ్ కేసులో ఎవ్వరినీ వదిలేది లేదు.. టీపీసీసీ చీఫ్ ఘాటు వ్యాఖ్యలు!