Harish Rao: సీఎం రేవంత్ ప్రభుత్వం ఏర్పాటు చేసిన తెలంగాణ విద్యా కమిషన్ ఇచ్చిన నివేదికపై మాజీ మంత్రి హరీశ్ రావు ఎక్స్ వేదికగా తీవ్ర విమర్శలు చేశారు. అసలు విద్యావేత్తలే లేని కమిటీని వేసి.. వారితో నివేదిక ఇప్పించడమేంటని సీఎం రేవంత్ రెడ్డిని ప్రశ్నించారు. ‘రేవంత్ రెడ్డి గారూ.. మీ విద్యా కమిషన్లో అసలైన విద్యావేత్తలు ఎక్కడ?’ అంటూ సెటైర్లు వేశారు. తెలంగాణ విద్యా కమిషన్ లో విద్యార్థులకు పాఠాలు చెప్పిన అనుభవం ఎవరికైనా ఉందా? అంటూ ప్రశ్నించారు.
జర్నలిజం, మాస్ కమ్యూనికేషన్ బ్యాక్ గ్రౌండ్ ఉన్న ఇద్దరు ప్రొఫెసర్లు మినహా పీహెచ్ డీ చేసిన వాళ్లు ఎవరూ విద్యా కమిషన్ లో లేరని హరీశ్ రావు ఆరోపించారు. కమిటీ ఛైర్మన్ గా రిటైర్డ్ ఐఏఎస్ అధికారిని నియమించడంపైనా ఆగ్రహం వ్యక్తం చేశారు. పరిపాలనలో అనుభవం ఉంటే సరిపోతుందా? అని ప్రశ్నించారు. పిల్లల సైకాలజీ, పాఠాలు చెప్పే పద్దతులపై వారికి అవగాహన ఉంటుందా? అని నిలదీశారు.
తెలంగాణ విద్యా భవిష్యత్తును మార్చేంత అర్హత, నైపుణ్యం ఈ కమిటీకి ఉందని మీరు నిజంగానే భావిస్తున్నారా అంటూ సీఎం రేవంత్ రెడ్డిని సూటిగా ప్రశ్నించారు. ‘సిలబస్ ఎలా ఉండాలి? బోధనా పద్ధతులు ఎలా ఉండాలి? అనేది గ్రౌండ్ లెవెల్లో పాఠాలు చెబుతున్న సబ్జెక్ట్ ఎక్స్పర్ట్స్ కు తెలుస్తుంది కానీ.. అసలు ఆ సంబంధమే లేని అధికారులకు వేరే రంగాల వారికి ఎలా తెలుస్తుంది?’ అంటూ సూటి ప్రశ్నలు సంధించారు.
విద్యావ్యవస్థ మీద కనీస అవగాహన లేని వారితో ప్రయోగాలు చేయడమంటే.. విద్యార్థుల భవిష్యత్తుతో చెలగాటమాడినట్లేనని హరీశ్ రావు పేర్కొన్నారు. సీఎం రేవంత్ విద్యా వ్యవస్థను ఏ విధంగా గాలికి వదిలేశారో చెప్పేందుకు ఇదే చక్కటి ఉదాహరణ అని పేర్కొన్నారు.
Also Read: Telangana BJP Chief: చంకలు గుద్దుకోవద్దు.. ముందుంది ముసళ్ల పండుగ.. కవితకు టీబీజేపీ చీఫ్ వార్నింగ్!
విద్యార్థులు, వారి తల్లిదండ్రులు, టీచర్లు.. కొత్త విద్యా విధానంలో పారదర్శకత కోరుకుంటున్నారని హరీశ్ రావు అన్నారు. విద్యతో సంబంధం లేని వారికి కమిటీ బాధ్యతలు ఇచ్చి కాలయాపన చేయడం సరికాదన్నారు. మీరు వేసిన కమిటీనే ఇంత గొప్పగా ఉంటే.. వారు ఇచ్చిన నివేదిక ఇంకెంత గొప్పగా ఉంటుందోనని ఎద్దేవా చేశారు. విద్యా వ్యవస్థను భ్రష్టుపట్టించేలా ఉన్న సీఎం రేవంత్ నిర్ణయాలను తీవ్రంగా ఖండిస్తున్నట్లు హరీశ్ రావు చెప్పుకొచ్చారు.
Also Read: Kolkata Earthquake: దేశంలో భూకంపం.. కోల్కతాలో భారీ ప్రకంపనలు.. పరుగులు పెట్టిన జనం