– కూతురుని చూసి కేసీఆర్ తీవ్ర భావోద్వేగం
– తండ్రి పాదాలకు నమస్కరించిన కవిత
– గురువారం అమెరికా బయలుదేరిన కేటీఆర్
– విదేశీ పర్యటనపై పొలిటికల్ సర్కిళ్లలో కొత్త చర్చ
BRS MLC Kavitha: ఢిల్లీ లిక్కర్ స్కాం కేసులో బుధవారం బెయిల్ మీద విడుదలైన ఎమ్మెల్సీ కవిత గురువారం తండ్రి, మాజీ సీఎం కేసీఆర్ని కలిశారు. హైదరాబాద్ నుంచి ఉదయాన్నే భర్త, కుమారుడితో కలిసి సిద్దిపేట జిల్లా ఎర్రవెల్లిలోని కేసీఆర్ ఫాంహౌజ్కి చేరుకున్నారు. ఆమెకు కేసీఆర్ కుటుంబ సభ్యులు ఆత్మీయ స్వాగతం పలికారు. కవితకు బెయిల్ రావడంపై కేసీఆర్ హర్షం వ్యక్తం చేశారు. కేసీఆర్.. కవితను చూసిన వెంటనే ఆమెను హత్తుకున్నారు. ఈ సందర్భంగా ఇరువురు భావోద్వేగానికి లోనయ్యారు.
కేసీఆర్ భావోద్వేగం…
ఎర్రవెల్లి చేరుకున్న కవితకు కుటుంబ సభ్యులు దిష్టి తీసి స్వాగతం పలికారు. ఐదున్నర నెలల తర్వాత తన బిడ్డ కవితను చూడగానే కేసీఆర్ ఒక నిమిషం పాటు తీవ్ర భావోద్వేగానికి లోనయ్యారు. పిదప ఆమె తన పాదాలకు నమస్కరించగా, ఆమెను ఆప్యాయంగా గుండెలకు హత్తుకుని ఆశీర్వదించారు. 160 రోజుల నిర్బంధం నుంచి తన ముందుకొచ్చిన బిడ్డను చూశాక కేసీఆర్ ముఖంలో మునుపటి ఆనందం కనిపించింది. ఆ సమయంలో ఎర్రవెల్లి ఫామ్హౌజ్లో ఇదంతా చూసిన పార్టీ నేతలు, సిబ్బంది అంతా సంతోషంతో చప్పట్లు కొట్టటంతో ఫామ్హౌస్ ప్రాంగణమంతా ఉత్సాహం నెలకొంది.
ఉత్సాహంలో నేతలు
అసెంబ్లీ ఎన్నికల్లో పరాజయంతో నిర్ఘాంత పోయిన గులాబీ నేతలు, దాని నుంచి కోలుకునే లోగా తెరమీదికి వచ్చిన ఫోన్ ట్యాపింగ్ వ్వవహారం పార్టీని తీవ్రంగా కుదిపేసింది. ఈ క్రమంలోనే కవిత అరెస్టు, లోక్సభ ఎన్నికల్లో స్వయంగా కేసీఆర్ రంగంలోకి దిగి ప్రచారం చేసినా పార్టీ సున్నా సీట్లకు పరిమితం కావటంతో గత ఎనిమిది నెలలుగా పార్టీలో నైరాశ్యం నెలకొంది. ఇక పార్టీ పని అయిపోయిందని అనుకునే సమయంలో కవితకు బెయిల్ రావటం.. కేసీఆర్, బీఆర్ఎస్ పార్టీలో కొత్త ఉత్సాహాన్ని నింపాయి. కవితను అక్రమంగా నిర్బంధించారని చివరికి సత్యమే గెలిచిందని వారు చెప్పుకొచ్చారు.
Also Read: HYDRA: శభాష్ సీఎం.. తన కుటుంబ సభ్యుల ఇంటిని కూడా రేవంత్ కూల్చేయమన్నారు: వీహెచ్
ఎవరూ రావద్దు ప్లీజ్..
కాగా దాదాపు ఐదున్నర నెలల జైలు జీవితం తర్వాత తాను తిరిగొచ్చానని, తండ్రిని కలిసేందుకు తాను ఎర్రవెల్లి ఫామ్హౌస్కి వెళుతున్నానని, దయచేసి నేతలు, కార్యకర్తలు ఎవరూ ఎర్రవల్లి రావద్దని బయలుదేరే ముందు కవిత విజ్ఞప్తి చేశారు. తండ్రిని కలిసి సాయంత్రానికి ఆమె తిరిగి హైదరాబాద్ చేరుకున్నారు. మరో పది రోజుల పాటు ఆమె పూర్తిగా కుటుంబంతో గడపనున్నట్లు సమాచారం. కవిత అరెస్టు అక్రమంటూ ఇన్నాళ్లూ చెబుతూ వచ్చిన తమ వాదన నిజమైందని, ఇకపై కేసీఆర్ కొత్త వ్యూహాలతో ప్రభుత్వం మీద సరికొత్త అస్త్రాలతో దాడి ప్రారంభించనున్నారని నేతలు అభిప్రాయపడుతున్నారు.
విలీనమా లేక పొత్తా?
గురువారం సాయంత్రం కవితతో బాటు హైదరాబాద్ వచ్చిన కేటీఆర్.. కాసేపు కుటుంబ సభ్యులతో గడిపి అటునుంచి నుంచి నేరుగా శంషాబాద్ ఎయిర్పోర్టుకు చేరుకుని యూఎస్ బయలుదేరి వెళ్లారు. తన కుమారుడి చదువుకు సంబంధించే తాను అమెరికా వెళ్తున్నట్లు సూచిస్తూ.. ‘యునైటెడ్ స్టేట్స్ బయలుదేరాను, తండ్రి బాధ్యత పిలుస్తోంది’ అంటూ గురువారం తెల్లవారుజామున 2 గంటలకు కేటీఆర్ ఆయన ట్వీట్ చేశారు. అయితే, ఈ పర్యటన వెనక అసలు మతలబు వేరొకటి ఉందనే చర్చ పొలిటికల్ సర్కిళ్లలో జరుగుతోంది. బీఆర్ఎస్ తిరిగి పుంజుకునేందుకు ఒక జాతీయ పార్టీతో కలిసి పనిచేయాలని కేసీఆర్ ఇప్పటికే నిర్ణయించారని, దాని కార్యాచరణను రహస్యంగా పార్టీ కీలక పార్టీ నేతలతో చర్చించి, వారిని మానసికంగా సిద్ధం చేసేందుకే కేటీఆర్ అమెరికా వెళ్లారనే చర్చ ఒకటి పొలిటికల్ సర్కిళ్లలో సాగుతోంది. అమెరికా నుంచి సెప్టెంబరు 5 నుంచి 7 వరకు మాస్కోలో స్కోల్ కోవో సంస్థ నిర్వహించే ఓ కార్యక్రమంలో కేటీఆర్ పాల్గొనబోతున్నారని, రాష్ట్రం నుంచి పలువురు నేతలు బృందాలుగా ఈ పర్యటనలో కేటీఆర్ను కలవబోతున్నట్లు సమాచారం. ఓ వైపు కవిత బెయిల్కు బీజేపీ ఆశీస్సులున్నాయనే వార్తలు వినిపిస్తున్న వేళ.. కేటీఆర్ విదేశీ పర్యటన ఉత్కంఠగా మారింది.