BRS Party: పదేళ్ల పాలనపై కాంగ్రెస్ ప్రభుత్వం చేసిన ఆరోపణలను తిప్పికొట్టేందుకు సిద్ధమైంది బీఆర్ఎస్ పార్టీ. అధికార పార్టీకి గట్టిగా కౌంటర్ ఇవ్వాలని డిసైడ్ అయ్యింది. ఈ నేపథ్యంలో పార్టీ ఆఫీసులో పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇచ్చేందుకు సిద్ధమయ్యారు మాజీ మంత్రి హరీష్రావు. గడిచిన రెండేళ్లు ప్రభుత్వం వ్యవహారాలను బయటపెట్టేందుకు రెడీ అయ్యింది.
అధికార పార్టీకి ధీటుగా.. ఇక బీఆర్ఎస్ కౌంటర్
కృష్ణా-గోదావరి జలాల అంశంపై శనివారం తెలంగాణ అసెంబ్లీలో సుధీర్ఘంగా ప్రస్తావించింది అధికార కాంగ్రెస్ పార్టీ. మంత్రి ఉత్తమ్కుమార్ రెడ్డి మొదలుపెట్టిన నుంచి ముగిసేవరకు బీఆర్ఎస్ హైకమాండ్ అంతా తిలకించింది. ఈ క్రమంలో అధికార పార్టీకి ధీటుగా బదులు ఇవ్వాలని డిసైడ్ అయ్యింది.
శనివారం సాయంత్ర పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇవ్వాలని బీఆర్ఎస్ భావించింది. అయితే రాత్రి వరకు సీఎం రేవంత్ రెడ్డి సభలో మాట్లాడడంతో ఆ కార్యక్రమాన్ని ఆదివారం నాటికి వాయిదా వేసింది. దీనిపై మాజీ సీఎం కేసీఆర్ మాట్లాడే అవకాశముందని ఆ పార్టీ నేతలు చెబుతున్నారు. ఆయనతోపాటు హరీష్రావు కూడా మాట్లాడే అవకాశమున్నట్లు తెలుస్తోంది.
సభలో సీఎం రేవంత్ వ్యాఖ్యలపై హరీష్రావు ధ్వజం
శనివారం అసెంబ్లీ వేదికగా సీఎం రేవంత్ రెడ్డి చేసిన వ్యాఖ్యలపై బిఆర్ఎస్ ఎల్పీ ఉప నాయకులు హరీష్రావు మండిపడ్డారు. అసెంబ్లీలో అబద్దాలకు ఆస్కారం లేదంటూనే అబద్దాలను ముఖ్యమంత్రి పదేపదే చెబుతూ వచ్చారని ఆరోపించారు. అసెంబ్లీలో సీఎం రేవంత్రెడ్డి అత్యంత జుగుత్సాకరమైన, అసభ్యకరమైన భాష ఉపయోగించారని మీడియాకు విడుదల చేసిన లేఖలో రాసుకొచ్చారు.
ప్రజాస్వామ్యానికి దేవాలయం అయిన అసెంబ్లీలో ‘భడివె’ వంటి బూతు పదాన్ని ఉపయోగించడాన్ని భేషరతుగా క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. ఈ రకమైన భాషను సభ్య సమాజం క్షమించదన్నారు. అసెంబ్లీలో ఆయన ఆ విధంగా మాట్లాడటం రాజకీయ నీచత్వానికి పరాకాష్టగా వర్ణించారు.
ముఖ్యమంత్రి ఈ విధంగా మాట్లాడుతుంటే స్పీకర్ సైలెంట్గా ఉండడం అత్యంత దురదృష్టకరమన్నారు. బీఆర్ఎస్ చేసిన న్యాయ పోరాటం ఫలితంగా రాయలసీమ లిఫ్టు ఇరిగేషన్పై ఎన్జీటీ స్టే ఇచ్చిందన్నారు. అది తన ఘనతగా కాంగ్రెస్ ప్రభుత్వం ప్రచారం చేసుకోవడం సిగ్గుచేటుగా పేర్కొన్నారు.
ALSO READ: బనకచర్ల, నల్లమల సాగర్ లింక్ ప్రాజెక్టులపై తెలంగాణ అసెంబ్లీ ఏకగ్రీవ తీర్మానం
పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టు కోసం 2009 సాధారణ ఎన్నికల సమయంలో సీఎంవో నోట్ ఇచ్చిందన్నారు. 2014 ఎన్నికల సమయంలో డీపీఆర్ కోసం జీవో జారీ చేసిన చరిత్ర నాటి కాంగ్రెస్ ప్రభుత్వానిదని రాసుకొచ్చారు. పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టుకు 45 టిఎంసీలకు తగ్గించిన మాట నిజమేనని అసెంబ్లీ సాక్షిగా ప్రభుత్వం చెప్పాల్సి వచ్చిందన్నారు.
బీఆర్ఎస్ నిలదీస్తేనే పోలవరం-నల్లమల్లసాగర్ నిర్మాణానికి అనుమతులు ఇవ్వొద్దని తీర్మానం చేశారన్నారు. ప్రభుత్వం చేసిన తీర్మానాలు బీఆర్ఎస్ పోరాట ఫలితాలుగా చెప్పుకొచ్చారు. అపెక్స్ కౌన్సిల్ సమావేశం ఎజెండాలోని అంశాలను సగం సగం చదువుతూ ముఖ్యమంత్రి సభను తప్పుదోవ పట్టించారని ప్రస్తావించారు.
ప్రభుత్వం వేసిన ఎత్తుగడకు తగిన సమాధానం ఆదివారం తెలంగాణ భవన్ పార్టీ వేదికగా వివరిస్తామని పేర్కొన్నారు. ముఖ్యమంత్రి, నీటిపారుదల శాఖ మంత్రి చేసిన ఆరోపణలకు సంబంధించి తగిన ఆధారాలతో సమాధానం ఇస్తామన్నారు హరీష్రావు. మొత్తానికి నీటి ప్రాజెక్టుల వ్యవహారం తెలంగాణ రాజకీయాల్లో హాట్ హాట్గా చర్చ జరుగుతోంది.