తెలంగాణలో పార్టీ ఫిరాయింపుల వ్యవహారం మరోసారి రాజకీయ దుమారం రేపుతోంది. బీఆర్ఎస్ నుంచి కాంగ్రెస్లోకి చేరిన ఎమ్మెల్యేలు కాలె యాదయ్య, పోచారం శ్రీనివాస్ రెడ్డిలపై అనర్హత వేటు వేయడంలో స్పీకర్ వ్యవస్థ అనుసరిస్తున్న తీరుపై బీఆర్ఎస్ మాజీ మంత్రి కేటీఆర్ సంచలన ట్వీట్ చేశారు. రాహుల్ గాంధీ, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిలు కలిసి రాజ్యాంగాన్ని పరిహాసం చేస్తున్నారని, అడుగడుగునా ప్రజాస్వామ్య విలువలను తూట్లు పొడుస్తున్నారని ఆయన మండిపడ్డారు.
భ్రష్టు పట్టిన స్పీకర్ వ్యవస్థ
ఫిరాయింపు ఎమ్మెల్యేలపై తక్షణమే వేటు వేయాల్సిన స్పీకర్ వ్యవస్థను రాజకీయ ఒత్తిళ్లతో కాంగ్రెస్ పార్టీ భ్రష్టు పట్టించిందని బీఆర్ఎస్ విమర్శిస్తోంది. గతంలో ఐదుగురు ఎమ్మెల్యేల విషయంలోనూ ఇదే తరహాలో అప్రజాస్వామికంగా వ్యవహరించిన కాంగ్రెస్, తాజాగా మరోసారి తన దిగజారుడుతనాన్ని చాటుకుందని కేటీఆర్ ట్వీట్ చేశారు. కళ్లముందే పార్టీ మారినట్లు కోటి సాక్ష్యాలు కనిపిస్తున్నా, ఆధారాలు లేవని బుకాయించడం అత్యున్నతమైన శాసనసభను అవమానించడమేనని అని పేర్కొన్నారు.
న్యాయస్థానాలంటే గౌరవం లేదు
కాంగ్రెస్ పార్టీకి రాజ్యాంగంపైనే కాదు.. కనీసం అత్యున్నత న్యాయస్థానాల ఆదేశాల పట్ల కూడా గౌరవం లేదని తాజా పరిణామాలు స్పష్టం చేస్తున్నాయని అన్నారు. అధికార బలంతో వ్యవస్థలను మేనేజ్ చేయవచ్చనే అహంకారంతో ఆ పార్టీ వ్యవహరిస్తోందని.. రాజ్యాంగ రక్షణ గురించి మాట్లాడే రాహుల్ గాంధీ తన సొంత రాష్ట్ర ప్రభుత్వ చర్యలపై ఎందుకు మౌనంగా ఉన్నారని కేటీఆర్ ప్రశ్నించారు. ప్రజాస్వామ్యంలో ప్రజలే సుప్రీం అని మరిచిపోయి ప్రవర్తిస్తున్న కాంగ్రెస్కు రాబోయే రోజుల్లో గుణపాఠం తప్పదని అన్నారు
ఉపఎన్నికల భయంతోనే వణుకు
పంచాయతీ ఎన్నికల్లో ప్రజలు కాంగ్రెస్కు కర్రుగాల్చి వాత పెట్టడంతో, ఫిరాయింపు ఎమ్మెల్యేల నియోజకవర్గాల్లో ఉపఎన్నికలకు వెళ్లేందుకు ప్రభుత్వం భయపడుతోందని తాజా పరిణామాలు నిరూపిస్తున్నాయని అన్నారు. ఓటమి భయంతోనే అనర్హత వేటు పడకుండా కాలయాపన చేస్తోందని, కానీ ప్రజాకోర్టులో ఆ ఎమ్మెల్యేలు ఎప్పుడో మాజీలు అయిపోయారని కేటీఆర్ ఎద్దేవా చేశారు. గోడ దూకిన ఎమ్మెల్యేలను కాపాడేందుకు కాంగ్రెస్ ఎన్ని ప్రయత్నాలు చేసినా అవి విఫలమవ్వడం ఖాయమని స్పష్టం చేశారు
పోరాటం ఆగదు..
ప్రజాతీర్పును అవమానించి, జంప్ జిలానీలకు కండువాలు కప్పిన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి, పార్టీ మారిన ఎమ్మెల్యేలకు బుద్ధి చెప్పే వరకు బీఆర్ఎస్ పోరాటం విశ్రమించదని పార్టీ శ్రేణులు స్పష్టం చేశాయి. ప్రతి గడపకూ వెళ్లి కాంగ్రెస్ చేస్తున్న రాజ్యాంగ వ్యతిరేక పాలనను ఎండగడతామని, ప్రజాస్వామ్యాన్ని కాపాడుకోవడమే తమ అంతిమ లక్ష్యమని కేటీఆర్ ట్వీట్ చేశారు.
పార్టీ ఫిరాయించిన ఎమ్మెల్యేలను నిస్సిగ్గుగా వెనకేసుకుని వస్తున్న రాహుల్ – రేవంత్ రాజ్యాంగాన్ని పరిహాసం చేస్తూ అడుగడుగునా తూట్లు పొడుస్తున్నారు.
ఫిరాయింపు ఎమ్మెల్యేలు కాలె యాదయ్య, పోచారం శ్రీనివాస్ రెడ్డిపై వేటు వేయాల్సిన స్పీకర్ వ్యవస్థను రాజకీయ ఒత్తిళ్లతో భ్రష్టు పట్టించిన…
— KTR (@KTRBRS) January 15, 2026
ALSO READ: YSRCP: సంక్రాంతి ముసుగులో ‘కేసినో’ దందా.. కోడిపందేల బరిలో ఘర్షణలపై వైసీపీ ఫైర్!