KP Vivekananda: రాష్ట్రంలో రెండేళ్ల కాంగ్రెస్ ప్రభుత్వ పాలనా వైఫల్యాలపై రాబోయే అసెంబ్లీ సమావేశాల్లో బీఆర్ఎస్ గట్టిగా పోరాడుతుందని అసెంబ్లీ విప్ కె.పి. వివేకానంద స్పష్టం చేశారు. మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. అసెంబ్లీలో అనుసరించబోయే వ్యూహాలపై కీలక వ్యాఖ్యలు చేశారు.
కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన ఆరు గ్యారంటీలు, 420 హామీల అమలులో విఫలమైందని, సభలో దాటవేత ధోరణిని అవలంబిస్తే సహించేది లేదని హెచ్చరించారు. రైతులకు ఇస్తామన్న బోనస్ బోగస్గా మారిందని, యూరియా కొరత, రైతుల ఆత్మహత్యలపై ప్రభుత్వాన్ని నిలదీస్తామన్నారు. పాలమూరు-రంగారెడ్డి ఎత్తిపోతల పథకం పట్ల ప్రభుత్వం చూపిస్తున్న నిర్లక్ష్యాన్ని ఎండగడతామని తెలిపారు.
మెస్సీ ఫుట్బాల్ మ్యాచ్ కోసం సింగరేణి నిధులను దుర్వినియోగం చేయడాన్ని అసెంబ్లీ వేదికగా ప్రశ్నిస్తామన్నారు. ఎవరినీ సంప్రదించకుండా జీహెచ్ఎంసీలో 22 మున్సిపాలిటీలను విలీనం చేస్తూ తెచ్చిన ఆర్డినెన్స్ అశాస్త్రీయమని, దీనిపై ప్రభుత్వాన్ని నిలదీస్తామని చెప్పారు. గురుకులాల అస్తవ్యస్త నిర్వహణ, విద్యార్థుల మరణాలు, ఆటో డ్రైవర్ల ఆత్మహత్యల అంశాలపై ప్రభుత్వం మెడలు వంచుతామని వివేకానంద పేర్కొన్నారు.
కేసీఆర్ ప్రెస్ మీట్ చూసి సీఎం రేవంత్ రెడ్డి సహా కాంగ్రెస్ నేతలు గజగజ వణికిపోతున్నారని, అందుకే పిచ్చి కూతలు కూస్తున్నారని ఎద్దేవా చేశారు. పదేళ్ల కేసీఆర్ పాలనపై చర్చకు తాము సిద్ధంగా ఉన్నామని సవాల్ విసిరారు. ఫిరాయింపు ఎమ్మెల్యేల వైఖరిని ఎండగడతామన్నారు. ప్రజా సమస్యలన్నీ చర్చించేదాకా అసెంబ్లీ సమావేశాలు నిర్వహించాలని, తూతూమంత్రంగా ఒకటి రెండు రోజులు నడిపిస్తామంటే ఒప్పుకునేది లేదని వివేకానంద తేల్చిచెప్పారు.
Read Also: Jagga Reddy: ప్రజల కోసం పని చేయండి మోదీ , అమిత్ షాలపై జగ్గారెడ్డి ఫైర్