Bandi Sanjay: స్వేచ్ఛ బ్యూరో: కేంద్రమంత్రి బండి సంజయ్ను తన పదవి నుంచి ప్రధానమంత్రి నరేంద్ర మోడీ తక్షణమే బర్తరఫ్ చేయాలని బీఆర్ఎస్ మహిళా నేతలు డిమాండ్ చేశారు. హైదరాబాద్లోని చారిత్రాత్మక చార్మినార్ వద్ద ఉన్న భాగ్యలక్ష్మి అమ్మవారి ఆలయంలో బీఆర్ఎస్ మహిళా నాయకులు ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. బండి సంజయ్ ప్రతి చిన్న విషయానికి భాగ్యలక్ష్మి అమ్మవారి ఆలయానికి వచ్చి, ప్రమాణాలు చేస్తూ ఇతరులకు సవాళ్లు విసురుతుంటారని, అందుకే తాము కూడా ఇప్పుడు అదే అమ్మవారి సాక్షిగా ఈ డిమాండ్ చేస్తున్నామని పేర్కొన్నారు.
బండి సంజయ్ కుమారుడు బండి భగీరథ్పై నమోదైన పోక్సో (POCSO) కేసును బీఆర్ఎస్ నేతలు ఈ సందర్భంగా ప్రస్తావించారు. బండి సంజయ్ కేంద్రమంత్రిగా కొనసాగుతుండటం వల్లే ఆయన కుమారుడిపై ఉన్న పోక్సో కేసు విచారణ సరిగ్గా సాగడం లేదని, కేసును నీరుగార్చేందుకు ప్రయత్నాలు జరుగుతున్నాయని వారు తీవ్రంగా ఆరోపించారు. ఈ కేసు విచారణ పూర్తిగా నిష్పక్షపాతంగా, న్యాయబద్ధంగా జరగాలంటే బండి సంజయ్ను మంత్రి పదవి నుంచి తప్పించడం ఒక్కటే మార్గమని, ప్రధాని మోడీ ఈ విషయంలో వెంటనే స్పందించి చర్యలు తీసుకోవాలని కోరారు.
ఈ నిరసన కార్యక్రమం, పూజల్లో ఆలేరు మాజీ ఎమ్మెల్యే గొంగిడి సునీతతో పాటు బీఆర్ఎస్ ముఖ్య మహిళా నాయకులు తుల ఉమ, షకీలారెడ్డి తదితరులు పాల్గొన్నారు. చట్టం ముందు అందరూ సమానమేనని నిరూపించాల్సిన బాధ్యత కేంద్ర ప్రభుత్వంపై ఉందన్నారు.
Also Read: బేగంబజార్ పోలీసుల వలలో మోస్ట్ వాంటెడ్ దొంగ.. భారీగా నగదు, నగలు రికవరీ