KTR letter to Bandi Sanjay(Political news in telangana): కేంద్ర మంత్రి బండి సంజయ్కు మాజీ మంత్రి, సిరిసిల్ల ఎమ్మెల్యే కేటీఆర్ ఓ బహిరంగ లేఖ రాశారు. సిరిసిల్లలో పవర్ లూమ్ క్లస్టర్ ఏర్పాటు చేయడానికి ప్రయత్నించాలని, ఈ సారైనా ఇందుకు కేంద్ర ప్రభుత్వం బడ్జెట్ కేటాయించేలా చూడాలని కోరారు. కేంద్ర మంత్రిగా ఉన్న బండి సంజయ్ ఈ అవకాశాన్ని వినియోగించుకుని సానుకూలంగా వ్యవహరించాలని తెలిపారు. గత పదేళ్లుగా ప్రతి బడ్జెట్లో కేంద్ర ప్రభుత్వం తెలంగాణకు మొండి చేయి చూపిందని కేటీఆర్ విమర్శించారు.
అనేక సార్లు పవర్ లూమ్ క్లస్టర్ కోసం కేంద్ర ప్రభుత్వానికి లేఖలు రాశామని, స్వయంగా కేంద్ర మంత్రులను కలిసి చాలా సార్లు విజ్ఞప్తులు కూడా చేశామని కేటీఆర్ ఈ సందర్భంగా గుర్తు చేశారు. కానీ, కేంద్ర ప్రభుత్వం మాత్రం అటువైపుగా నిర్ణయాలు తీసుకోలేదని వాపోయారు. ఈ సారి అయినా సిరిసిల్లకు మెగా పవర్ లూమ్ క్లస్టర్ను తెప్పించాలని బండి సంజయ్కు విజ్ఞప్తి చేశారు. కేంద్ర బడ్జెట్లో సిరిసిల్లకు మెగా పవర్ లూమ్ క్లస్టర్ తీసుకురావాలని కోరారు.
సిరిసిల్లలో మెగా పవర్ లూమ్ క్లస్టర్ ఏర్పాటు చేస్తే ఇక్కడి నేతన్నల కష్టాలు కొంతలో కొంతైనా తీరుతాయని కేటీఆర్ అభిప్రాయపడ్డారు. క్లస్టర్ ఏర్పాటుకు అవసరమైన నైపుణ్యం కలిగిన కార్మికులు, వనరులు ఈ ప్రాంతంలో పుష్కలంగా ఉన్నాయని కేటీఆర్ వివరించారు. నేతన్నలను ఆదుకోవడంలో కాంగ్రెస్ ఫెయిల్ అయిందని, కాంగ్రెస్ పాలకుల వైఫల్యం వల్లే చేనేత రంగం సంక్షోభంలో పడిందన్నారు. ఈ సారైన కేంద్ర బడ్జెట్లో సిరిసిల్లకు గుడ్ న్యూస్ వచ్చేలా చూడాలని కేటీఆర్ సూచించారు.
కేంద్ర ప్రభుత్వం ఈ నెల 23వ తేదీన బడ్జెట్ను పార్లమెంటులో ప్రవేశపెట్టనుంది. కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ఈ బడ్జెట్ ప్రవేశపెట్టనున్నారు. ఇప్పటికే బడ్జెట్కు సంబంధించిన కసరత్తు ఫుల్ స్వింగ్లో ఉన్నది. ఈ నేపథ్యంలో సిరిసిల్లలో మెగా పవర్ లూమ్ క్లస్టర్ కోసం నిధులు కేటాయించేలా కేంద్ర ప్రభుత్వాన్ని ఒప్పించాలని కేంద్ర మంత్రి బండి సంజయ్కు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, సిరిసిల్ల ఎమ్మెల్యే కేటీఆర్ విజ్ఞప్తి చేశారు.