Caste Boycott: స్వేచ్ఛ బ్యూరో: సిద్దిపేట జిల్లా హుస్నాబాద్ మండలం నాగారం గ్రామంలో కుల బహిష్కరణ ఆరోపణలు స్థానికంగా చర్చనీయాంశంగా మారాయి. గ్రామానికి చెందిన ఆకుల బాలయ్య కుటుంబం తమను కుల బహిష్కరణకు గురిచేశారని ఆరోపిస్తూ న్యాయం చేయాలని అధికారులను కోరుతుండగా, మరోవైపు అదే గ్రామానికి చెందిన కొమురయ్య, రాజయ్య తదితర ముదిరాజ్ కులస్తులు ఈ ఆరోపణలను పూర్తిగా ఖండిస్తున్నారు. ఆకుల బాలయ్య మాట్లాడుతూ గత ఏడు సంవత్సరాలుగా చేపల చెరువు వ్యవహారంలో గ్రామంలోని కొందరితో విభేదాలు కొనసాగుతున్నాయని తెలిపారు. గతంలో నమోదైన కేసులను లోక్ అదాలత్ ద్వారా పరిష్కరించుకున్నప్పటికీ, తమ కుటుంబాన్ని సామాజిక కార్యక్రమాలకు దూరంగా ఉంచుతున్నారని ఆరోపించారు.
గ్రామంలో పెళ్లిళ్లు, శుభకార్యాలు, అంత్యక్రియలకు తమ కుటుంబ సభ్యులు రావద్దని హెచ్చరిస్తున్నారని, దీంతో తాము సామాజికంగా ఒంటరితనానికి గురవుతున్నామని ఆవేదన వ్యక్తం చేశారు. తమ కుటుంబానికి ప్రాణహాని ఉందని పోలీసులను ఆశ్రయించినప్పటికీ పూర్తి న్యాయం జరగలేదని విలేకరుల ముందు వాపోయారు. అయితే ఈ ఆరోపణలను నాగారం గ్రామానికి చెందిన కొమురయ్య, రాజయ్య తదితరులు ఖండించారు. అసలు సమస్య కుల బహిష్కరణ కాదని, నాగారం–ఉమ్మాపూర్ గ్రామాల మధ్య గండి చెరువు మత్స్యకార హక్కుల వివాదమే కారణమని పేర్కొన్నారు. సుమారు 30 సంవత్సరాల క్రితం నాగారం, ఉమ్మాపూర్ గ్రామస్తులు అంతా కలిసే ఉండే వారమని, అనంతరం రెండు గ్రామాలుగా విడిపోయిన తర్వాత చెరువులో చేపల వేట హక్కుల విషయంలో విభేదాలు తలెత్తాయని వివరించారు.
Also read: ఇదెక్కడి విచిత్రం సామి! 20 ఏళ్ల తర్వాత వచ్చిన ప్రభుత్వ ఉద్యోగం.. ట్విస్ట్ ఏంటంటే?
మత్స్యకార సంఘంలో రెండు గ్రామాలకు చెందిన కొందరికి మాత్రమే సభ్యత్వం ఉండగా, బాలయ్య ఉమ్మాపూర్ గ్రామానికి చెందిన సభ్యులకు మద్దతు ఇస్తున్నారని, ఆ కారణంగా వివాదాలు మరింత పెరిగాయని ఆరోపించారు. తమ పై కుల బహిష్కరణ చేశామంటూ తప్పుడు ఆరోపణలు చేస్తూ పోలీస్ స్టేషన్ చుట్టూ తిప్పిస్తున్నారని వాపోయారు. రాజయ్య మాట్లాడుతూ, గత మూడు దశాబ్దాలుగా రెండు గ్రామాల ముదిరాజ్ కులస్తులు కలిసి మెలిసి ఉన్నారని, ఆలయ నిర్మాణం వంటి కార్యక్రమాలను కూడా కలిసి నిర్వహించామని చెప్పారు. గ్రామ పెద్దల సమక్షంలో సమస్యను పరిష్కరించేందుకు తాము సిద్ధంగా ఉన్నప్పటికీ, బాలయ్య సహకరించడం లేదని ఆరోపించారు. ఇరు వర్గాలు ఒకరిపై ఒకరు ఆరోపణలు చేసుకుంటున్న నేపథ్యంలో, అధికారులు గ్రామంలో సమగ్ర విచారణ నిర్వహించి వాస్తవాలను వెలికితీయాలని గ్రామస్తులు కోరుతున్నారు. కుల బహిష్కరణ ఆరోపణలు నిజమా..? లేక చెరువు హక్కుల వివాదం వల్ల ఏర్పడిన విభేదాలేనా..? అనే అంశాలపై అధికారుల విచారణ అనంతరం స్పష్టత వచ్చే అవకాశం ఉంది.
Also Read: పెద్దపల్లికి గుడ్న్యూస్.. త్వరలోనే అందుబాటులోకి సరికొత్త బస్ డిపో!