ఆన్లైన్ బెట్టింగ్, గేమింగ్ ప్లాట్ఫారమ్ల వల్ల తలెత్తుతున్న సామాజిక, ఆర్థిక ముప్పులను అరికట్టేందుకు కేంద్ర ప్రభుత్వం తన చర్యలను ముమ్మరం చేసింది. తాజాగా మరో 242 ఆన్లైన్ బెట్టింగ్ వెబ్సైట్లను బ్లాక్ చేస్తూ కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. దేశ భద్రతకు విఘాతం కలిగించడంతో పాటు.. సామాన్యులను అప్పుల ఊబిలోకి నెట్టేస్తున్న ఇలాంటి వెబ్సైట్లపై ప్రభుత్వం ఉక్కుపాదం మోపుతోంది.
గత కొన్నేళ్లుగా సాగుతున్న ఈ ప్రక్షాళన ప్రక్రియలో భాగంగా.. కేంద్ర ప్రభుత్వం ఇప్పటివరకు దేశవ్యాప్తంగా సుమారు 8,000 కు పైగా వెబ్సైట్లను, మొబైల్ యాప్లను నిలిపివేసింది. వీటిలో ప్రధానంగా విదేశీ మూలాలు ఉన్న సంస్థలు, మనీలాండరింగ్ కార్యకలాపాలకు పాల్పడుతున్న ప్లాట్ఫారమ్లే ఎక్కువగా ఉన్నాయని అధికారులు గుర్తించారు. ప్రధానంగా ఐపీఎల్ వంటి క్రికెట్ టోర్నమెంట్ల సమయంలో ఈ బెట్టింగ్ సైట్ల ఆగడాలు ఎక్కువగా ఉండటంతో.. నిఘా వర్గాలు వీటిపై ప్రత్యేక దృష్టి సారించాయి.
కేంద్ర హోం మంత్రిత్వ శాఖ అందించిన నివేదికల ఆధారంగా.. ఐటీ చట్టంలోని సెక్షన్ 69ఏ కింద ఈ వెబ్సైట్లను బ్లాక్ చేస్తున్నారు. డిజిటల్ ప్రకటనల ద్వారా యువతను ఆకర్షించి, వేల కోట్ల రూపాయలను విదేశాలకు తరలిస్తున్నారని దర్యాప్తు సంస్థలు నిర్ధారించాయి. ఈ చర్యల ద్వారా ఆన్లైన్ మోసాల నుండి పౌరులను రక్షించడంతో పాటు, అక్రమ ఆర్థిక లావాదేవీలను అరికట్టడమే లక్ష్యంగా ప్రభుత్వం పనిచేస్తోంది. ప్రజలు ఇటువంటి మోసపూరిత వెబ్సైట్లకు దూరంగా ఉండాలని ప్రభుత్వం హెచ్చరిస్తోంది.