Telangana Gram Panchayat Funds: తెలంగాణలోని గ్రామ పంచాయతీల అభివృద్ధి కోసం కేంద్ర ప్రభుత్వం 15వ ఆర్థిక సంఘం నిధులను విడుదల చేసింది. తాజాగా 15వ ఆర్థిక సంఘం నిధుల కింద కేంద్రం రూ. 387 కోట్లను విడుదల చేస్తూ నిర్ణయం తీసుకుంది. ఇప్పటికే మొదటి విడతగా రూ. 259.36 కోట్లు విడుదల చేయగా, తాజా నిధులతో కలిపి ఇప్పటివరకు మొత్తం రూ. 646.36 కోట్ల నిధులు రాష్ట్రానికి చేరాయి. గ్రామాల్లో మౌలిక సదుపాయాల కల్పన, అభివృద్ధి పనులకు ఈ నిధులు ఎంతో కీలకం కానున్నాయి.
రాష్ట్రంలో గ్రామ పంచాయతీ ఎన్నికలు పూర్తి కావడంతో పాటు, కేంద్రం కోరిన అన్ని సాంకేతిక సమాచారాన్ని రాష్ట్ర పంచాయతీరాజ్, గ్రామీణ అభివృద్ధి శాఖ ఇప్పటికే సమర్పించింది. దీనికి అనుగుణంగానే కేంద్ర ప్రభుత్వం విడతలవారీగా నిధులను విడుదల చేస్తోంది. అయితే, 15వ ఆర్థిక సంఘం నిధులకు సంబంధించి తెలంగాణకు రావాల్సిన మొత్తం నిధులతో పోలిస్తే, ప్రస్తుత విడుదల కేవలం కొంత భాగం మాత్రమేనని రాష్ట్ర ప్రభుత్వం పేర్కొంటోంది.
వాస్తవానికి తెలంగాణకు 15వ ఆర్థిక సంఘం కింద ఇంకా సుమారు రూ. 3,000 కోట్ల నిధులు కేంద్రం వద్ద పెండింగ్లో ఉన్నాయి. తాజా విడుదలను మినహాయిస్తే, ఇంకా దాదాపు రూ. 2,400 కోట్ల నిధులు రాష్ట్రానికి రావాల్సి ఉంది. ఈ భారీ మొత్తం పెండింగ్లో ఉండటం వల్ల గ్రామాల్లో చేపట్టాల్సిన అనేక అభివృద్ధి పనులు నిలిచిపోయే ప్రమాదం ఉందని రాష్ట్ర ప్రభుత్వం ఆందోళన వ్యక్తం చేస్తోంది.
ఈ నేపథ్యంలో, రాష్ట్ర పంచాయతీరాజ్, గ్రామీణ అభివృద్ధి శాఖ మంత్రి సీతక్క కేంద్ర ప్రభుత్వానికి కీలక విజ్ఞప్తి చేశారు. గ్రామాల్లో పారిశుధ్యం, తాగునీరు, ఇతర అత్యవసర పనుల కోసం నిధుల అవసరం ఎంతైనా ఉందని ఆమె పేర్కొన్నారు. కేంద్రం కోరిన అన్ని నిబంధనలను రాష్ట్రం నెరవేర్చినందున, మిగిలిన రూ. 2,400 కోట్ల పెండింగ్ నిధులను కూడా జాప్యం చేయకుండా వెంటనే విడుదల చేయాలని ఆమె కేంద్రానికి విన్నవించారు.