Jubilee Hills Fight: స్వేచ్ఛ బ్యూరో: పీకలదాకా తాగిన మత్తులో కొందరు వీరంగం సృష్టించారు. రెండు గ్రూపులుగా విడిపోయి మద్యం సీసాలు.. కుర్చీలతో కొట్టుకున్నారు. దీంట్లో పలువురికి గాయాలయ్యాయి. ఈ సంఘటన జూబ్లీహిల్స్ లోని కారా కారా పబ్బులో ఆదివారం తెల్లవారుఝామున జరిగింది. వివరాలు ఇలా ఉన్నాయి.
కారా కారా పబ్బులో తెల్లవారుఝాము 2 గంటల సమయంలో రెండు వేర్వేరు బృందాల మధ్య ఏదో ఒక చిన్న విషయంలో ప్రారంభమైన వాగ్వాదం క్షణాల్లో తీవ్ర రూపం దాల్చింది. మద్యం మత్తులో ఉన్న దాదాపు 150 మంది యువకులు పబ్ లోనే ఒకరిపై ఒకరు దాడి చేసుకుని సీసాలతో పాటు కుర్చీలతో కొట్టుకున్నారు. పబ్బులోని ప్రధాన అద్దాల తలుపులతో పాటు కిటికీలు ఖరీదైన ఫర్నిచర్ కూడా ధ్వంసం చేశారు. జరిగిన గొడవతో పబ్బులో ఉన్న మిగతా కస్టమర్లతో పాటు మహిళలు బయటకు పరుగులు తీశారు. జరిగిన ఘర్షణలో కాంగ్రెస్ పార్టీకి చెందిన ఓ రాజ్యసభ సభ్యుని కుమారుడు ఉన్నట్టు సమాచారం.
Also Read: ఢిల్లీలో భారీ వర్షాలు.. కూలిన మూడంతస్తుల భవనం
అతడి వర్గానికి.. మరో గ్రూపునకు మధ్య పాత కక్షలు గొడవకు కారణమా? అన్న అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. విషయం తెలియగానే జూబ్లీహిల్స్ పోలీసులు పబ్బుకు చేరుకున్నారు. పోలీసులను చూసిన పలువురు యువకులు అక్కడి నుంచి పరారయ్యారు. పోలీసులు పరిస్థితిని అదుపులోకి తీసుకువచ్చారు. పబ్బులోని సీసీ కెమెరాల ఫుటేజ్ ను పోలీసులు స్వాధీనం చేసుకొని ఈ దాడికి పాల్పడిన వారిని గుర్తిస్తున్నారు. తెల్లవారుఝాము 2గంటల వరకు పబ్ నడిపినందుకు నిర్వాహకులపై కేసు నమోదు చేశారు.
Also read; స్టైలిష్ లుక్, పవర్ ఫుల్ సౌండ్..ఏంటీ తక్కువ ధరలో ఇన్ని ఫీచర్లా ?