Ayub Khan: కరడుగట్టిన రౌడీషీటర్ అయూబ్ ఖాన్ కోసం చార్మినార్ జోన్ పోలీసులు వేటను ముమ్మరం చేశారు. 79క్రిమినల్ కేసుల్లో నిందితునిగా ఉన్న అతన్ని పట్టుకోవటానికి ప్రత్యేక బృందాలను రంగంలోకి దింపారు. అయూబ్ ఖాన్ జాడ తెలిసిన వారు సమాచారం ఇవ్వాలని చార్మినార్ జోన్ డీసీపీ కిరణ్ ఖరే కోరారు. సమాచారం ఇచ్చిన వారి వివరాలను గోప్యంగా పెడతామన్నారు. హత్యలు, హత్యాయత్నాలతోపాటు పదుల సంఖ్యలో క్రిమినల్ కేసుల్లో నిందితునిగా ఉన్న అయూబ్ ఖాన్ పై శాలిబండ పోలీస్ స్టేషన్ లో రౌడీషీట్ నమోదై ఉంది. తాజాగా ఓ బాధితుడు చేసిన ఫిర్యాదుతో అయూబ్ ఖాన్ తోపాటు కుమ్మర్ వాడి నివాసి మహ్మద్ ఫరూఖ్ లపై శాలిబండ పోలీస్ స్టేషన్ లో మరో కేసు రిజిష్టర్ అయ్యింది.
వ్యాపార భాగస్వామ్యం పేరుతో అయూబ్ ఖాన్, మహ్మద్ ఫరూఖ్ కలిసి తనతో 4.70 లక్షల రూపాయలను పెట్టుబడులుగా పెట్టించినట్టు బాధితుడు ఫిర్యాదులో పేర్కొన్నాడు. అయితే, ఒక్క రూపాయి కూడా లాభంగా ఇవ్వలేదన్నారు. పైగా అప్పులయ్యాయని చెప్పి ఆరు తులాల బంగారం కూడా తీసుకుని బ్యాంకులో తాకట్టు పెట్టి డబ్బు తీసుకున్నట్టు పేర్కొన్నారు. గత ఏడాది జనవరిలో తన డబ్బు తిరిగి ఇవ్వాలని అడుగగా చంపేస్తా అంటూ అయూబ్ ఖాన్ బెదిరించాడని తెలిపాడు. ప్రాణభయంతో అప్పట్లో ఫిర్యాదు చేయలేదని పేర్కొన్నాడు. ఈ ఫిర్యాదు మేరకు శాలిబండ పోలీసులు కేసులు నమోదు చేశారు.
కాగా, మరికొన్ని కేసుల్లో వాంటెడ్ గా ఉన్న అయూబ్ ఖాన్ ప్రస్తుతం పరారీలో ఉన్నాడు. ఈ నేపథ్యంలో అయూబ్ ఖాన్ ను పట్టుకోవటానికి ప్రత్యేక బృందాలను రంగంలోకి దింపినట్టు చార్మినార్ జోన్ డీసీపీ కిరణ్ ఖరే తెలిపారు. జోన్ పరిధిలో రౌడీయిజం, బెదిరింపులు, వసూళ్లు, వ్యవస్థీకృత నేరాలను ఏమాత్రం సహించేది లేదని స్పష్టం చేశారు. ఎవరైనా రౌడీషీటర్లు ప్రజలను భయపెడితే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. ఇక, అయూబ్ ఖాన్ ఆచూకీ తెలిసిన వారు, అతని అసాంఘిక కార్యకలాపాల గురించి తెలిసిన వారు శాలిబండ పోలీస్ స్టేషన్ లో సమాచారం ఇవ్వాలని కోరారు. సమాచారం ఇచ్చే వారి వివరాలను అత్యంత గోప్యంగా పెడతామన్నారు.