Telangana : తెలంగాణలోని జూనియర్ పంచాయతీ కార్యదర్శులకు ప్రభుత్వం గుడ్ న్యూస్ చెప్పింది. వారి సర్వీసును క్రమబద్ధీకరించాలని సీఎం కేసీఆర్ నిర్ణయించారు. విధివిధానాలను ఖరారు చేయాలని పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖల ముఖ్య కార్యదర్శి సందీప్ కుమార్ సుల్తానియాను ఆదేశించారు.
2019లో 9,350 మంది జేపీఎస్లను ప్రభుత్వం జిల్లా స్థాయి ఎంపిక కమిటీల ద్వారా రాతపరీక్ష నిర్వహించి ఎంపిక చేసింది. ప్రతిభ ఆధారంగా నియామకాలు చేపట్టింది. వారికి మూడేళ్ల శిక్షణ కాలాన్ని నిర్ణయించింది. అయితే ఆ తర్వాత మరో ఏడాది పెంచింది. గత నెల 28తో ఆ గడువు ముగిసింది. దీంతో తమ ఉద్యోగాలను క్రమబద్ధీకరించాలని జేపీఎస్ లు డిమాండ్ చేశారు. ప్రభుత్వం నిర్ణయం తీసుకోకపోవడంతో సమ్మెబాట పట్టారు. న్యాయం చేస్తామని ప్రభుత్వం ఇచ్చిన హామీతో.. 16 రోజుల ఆందోళన తర్వాత విధుల్లో చేరారు.
జేపీఎస్ ల అంశంపై తాజాగా సమీక్ష నిర్వహించిన సీఎం కేసీఆర్ క్రమబద్ధీకరణ ప్రక్రియకు ఆమోదం తెలిపారు. జేపీఎస్ల క్రమబద్ధీకరణకు పనితీరును ప్రామాణికంగా తీసుకుంటామన్నారు. పనితీరుపై మదింపు కోసం జిల్లా స్థాయిలో కలెక్టర్ల ఆధ్వర్యంలో కమిటీలు వేయాలని ఆదేశించారు. ఈ కమిటీలో స్థానిక సంస్థల అదనపు కలెక్టర్, జిల్లా అటవీ అధికారి, జిల్లా ఎస్పీ/డీసీపీ సభ్యులుగా ఉంటారు. రాష్ట్ర కార్యదర్శి లేదా శాఖాధిపతి పరిశీలకుడిగా వ్యవహరిస్తారు. జేపీఎస్ల పనితీరుపై జిల్లాస్థాయి కమిటీ ముఖ్య కార్యదర్శి అధ్యక్షతన గల రాష్ట్రస్థాయి కమిటీకి నివేదిక అందిస్తుంది. ఈ కమిటీ ఉద్యోగులు క్రమబద్ధీకరణపై తుది సిఫార్సులతో సీఎస్కు నివేదిక పంపుతుంది.
మరోవైపు కొన్ని గ్రామపంచాయతీల్లో తాత్కాలిక ప్రాతిపదికన జూనియర్ పంచాయతీ కార్యదర్శులను కలెక్టర్లు నియమించారు. ఈ స్థానాల్లో కూడా కొత్త జేపీఎస్లను భర్తీ చేయాలని కేసీఆర్ ఆదేశించారు. క్రమబద్ధీకరణ పూర్తయిన తర్వాత ఈ ప్రక్రియను చేపట్టాలని సూచించారు.