CM Revanth Reddy: ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా అభివృద్ధిపై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కీలక ప్రకటనలు చేశారు. నిర్మల్లో నిర్వహించిన ‘ప్రజా పాలన-ప్రగతి బాట’ బహిరంగ సభలో పాల్గొన్న ఆయన, ఈ ప్రాంత విద్యా, రవాణా రంగాలను ప్రక్షాళన చేస్తామని హామీ ఇచ్చారు.
ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో యూనివర్సిటీ లేని లోటును తీరుస్తామని, జిల్లాకు విమానాశ్రయం (Airport) తీసుకొస్తామని సీఎం ప్రకటించారు. ఇందుకోసం బాసర ట్రిపుల్ ఐటీ (RGUKT) ఆవరణలోనే కొత్త యూనివర్సిటీ ఏర్పాటుకు చర్యలు తీసుకోవాలని విద్యాశాఖ మంత్రి జూపల్లి కృష్ణారావును ఆదేశించారు.
పీసీసీ అధ్యక్షుడిగా బాధ్యతలు స్వీకరించిన తర్వాత మొదటిసారి నిర్మల్కు వచ్చిన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, ఇక్కడి ప్రజల మద్దతు వల్లే తాను సీఎం అయ్యానని కృతజ్ఞతలు తెలిపారు. ఆదిలాబాద్ జిల్లా పోరాటాలకు, పౌరుషానికి నిలయమని, ‘జల్, జంగల్, జమీన్’ నినాదంతో కుమురం భీం ఇక్కడే పోరాడారని ఆయన కొనియాడారు. ఈ జిల్లాలో ఆశించిన స్థాయిలో అభివృద్ధి జరగలేదని ఆవేదన వ్యక్తం చేస్తూ, బాసర ట్రిపుల్ ఐటీలోనే యూనివర్సిటీని ఏర్పాటు చేస్తామని, ఇందుకు ప్రజాప్రతినిధులందరూ సహకరించాలని కోరారు. అలాగే ఆదిలాబాద్ను పారిశ్రామికంగా అభివృద్ధి చేస్తామని, జిల్లాకు ఎయిర్పోర్టును తీసుకొస్తామని హామీ ఇచ్చారు. విమానాశ్రయం కోసం 10 వేల ఎకరాల భూమిని సేకరించాలని, దాని ప్రారంభోత్సవానికి ప్రధాని మోదీని ఆహ్వానిద్దామని చెప్పారు. తుమ్మిడిహట్టి వద్ద ప్రాజెక్టు కట్టి తీరాలని, జిల్లాకు సాగునీరు అందిస్తామని స్పష్టం చేశారు.
రాష్ట్ర ప్రయోజనాల కోసం ప్రతి మూడు నెలలకు ఒకసారి ప్రధాని మోదీని కలుస్తున్నానని, ఆయనకు ఇవ్వాల్సిన గౌరవం ఇస్తూనే రావాల్సిన ప్రాజెక్టులను అడుగుతున్నామని వివరించారు. ప్రధానిని పదే పదే కలుస్తున్నానని విమర్శించే వారికి స్పందిస్తూ.. రాష్ట్రానికి నిధులు, ప్రాజెక్టులు ప్రధాని కాక ఇంకెవరు ఇస్తారని ప్రశ్నించారు. గత ప్రభుత్వం పదేళ్ల పాటు కేంద్రంతో చర్చలు జరపకపోవడం వల్లే తెలంగాణకు నష్టం జరిగిందన్నారు. తనకు వ్యక్తిగత అజెండాలు లేవని, కేవలం రాష్ట్ర అభివృద్ధి కోసమే మోదీ, అమిత్ షా సహా ఎవరినైనా కలుస్తానని తెల్చి చెప్పారు. ఎన్నికల సమయంలోనే రాజకీయాలు ఉండాలని, ఆ తర్వాత అందరి లక్ష్యం అభివృద్ధి మాత్రమే కావాలని హితవు పలికారు. రాష్ట్ర బీజేపీ నేతలు కూడా ప్రధానిని కలిసి తెలంగాణకు నిధులు, ప్రాజెక్టులు తీసుకురావాలని సూచించారు.
నిర్మల్ పట్టణంలో జరిగిన ఈ సభకు భారీ ఎత్తున ప్రజలు, కాంగ్రెస్ శ్రేణులు తరలివచ్చారు. మంత్రులు ఉత్తమ్ కుమార్ రెడ్డి, జూపల్లి కృష్ణారావు, ప్రభుత్వ సలహాదారు సుదర్శన్ రెడ్డి తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.