తెలంగాణ శాసనసభ రూపురేఖలను సమూలంగా మార్చేందుకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి శ్రీకారం చుట్టారు. అసెంబ్లీ ప్రాంగణాన్ని దేశ రాజధానిలోని పార్లమెంటు తరహాలో తీర్చిదిద్దాలని అధికారులను ఆదేశించారు. చారిత్రక భవనాల విశిష్టత దెబ్బతినకుండానే అత్యాధునిక హంగులు అద్దాలని స్పష్టం చేశారు. ఈ మేరకు నిర్వహించిన ఉన్నత స్థాయి సమీక్షలో పలు కీలక నిర్ణయాలు తీసుకున్నారు.
శాసనసభ గౌరవం పెంపొందించేలా ప్రాంగణాన్ని తీర్చిదిద్దాలని రేవంత్ రెడ్డి సూచించారు. సభ్యుల ప్రైవసీకి అత్యంత ప్రాధాన్యత ఇవ్వాలని చెప్పారు. ప్రజాప్రతినిధుల కోసం పబ్లిక్ గార్డెన్లో ప్రత్యేకంగా ఒక క్లబ్ ఏర్పాటు చేయాలని ప్రతిపాదించారు. సభ్యుల ఆరోగ్య పరిరక్షణకు వీలుగా వాకింగ్ ట్రాక్ సహా క్రీడల కోసం ప్రత్యేక ఏర్పాట్లు ఉండాలని ఆదేశించారు. వచ్చే అసెంబ్లీ సమావేశాల నాటికి సెంట్రల్ హాల్ పనులు పూర్తి కావాలని గడువు విధించారు. చారిత్రక వారసత్వ భవనాలకు ఎలాంటి నష్టం కలగకుండా పనులు చేపట్టాలని కోరారు. అసెంబ్లీ ప్రాంగణంలో భద్రతను మరింత పటిష్టం చేయాలని అధికారులను ఆదేశించారు.
అసెంబ్లీ సమీక్ష అనంతరం జరిగిన చిట్ చాట్ లో ముఖ్యమంత్రి రాజకీయాలపై సంచలన వ్యాఖ్యలు చేశారు. ఒక లక్ష్యం నెరవేరిన తర్వాత ఏ వ్యవస్థ అయినా కాలక్రమేణా కనుమరుగు అవుతుందని చెప్పారు. బిఆర్ఎస్ పార్టీ ఉద్దేశం నెరవేరిందని ఇప్పుడు దానికి మనుగడ లేదని విమర్శించారు. చనిపోయిన శవానికి వైద్యం చేస్తే ఎంత వృధా అవుతుందో బిఆర్ఎస్ పరిస్థితి కూడా అలాగే ఉందని ఎద్దేవా చేశారు. బిఆర్ఎస్ పార్టీ కేవలం గతం మాత్రమేనని దానికి భవిష్యత్తు లేదని తేల్చి చెప్పారు.
రాష్ట్రం కావాలనే బలమైన కోరికతో గతంలో ప్రజలు కేసీఆర్ ఆగడాలను చూసి చూడనట్లు వదిలేశారని రేవంత్ రెడ్డి గుర్తు చేశారు. అధికారాన్ని అడ్డం పెట్టుకుని బిఆర్ఎస్ అరాచకాలు సాగించిందని మండిపడ్డారు. కేసీఆర్ కుటుంబ అవసరం రాష్ట్రానికి లేదని 2024 ఎన్నికల్లో ప్రజలు గుండు సున్నా ఇచ్చి నిరూపించారని వ్యాఖ్యానించారు. కేసీఆర్ కుటుంబానికి తెలంగాణ ప్రజలకు మధ్య బంధం పూర్తిగా తెగిపోయిందని స్పష్టం చేశారు. కేవలం తమ కుటుంబ రాజకీయ ఉనికి కోసమే వారు ప్రయత్నాలు చేస్తున్నారని విమర్శించారు. తెలంగాణ సమాజం బిఆర్ఎస్ పార్టీని శాశ్వతంగా పక్కన పెట్టిందని ముఖ్యమంత్రి ధీమా వ్యక్తం చేశారు.
ALSO READ: Kejriwal: ఢిల్లీ లిక్కర్ కేసు కొత్త మలుపు.. ఆ న్యాయమూర్తి ముందు హాజరుకాను, కేజ్రీవాల్ సంచలన నిర్ణయం