CM Revanth Reddy: తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి బీఆర్ఎస్ అగ్రనేతలపై తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. ఆదివారం మీడియాతో నిర్వహించిన చిట్చాట్లో ఆయన మాజీ సీఎం కేసీఆర్, కేటీఆర్, హరీశ్ రావులపై సంచలన వ్యాఖ్యలు చేశారు. కేసీఆర్, ఆయన కొడుకు కేటీఆర్ ఇద్దరూ ‘ఆర్థిక ఉగ్రవాదులు’ (Financial Terrorists) అని తీవ్రంగా ధ్వజమెత్తారు. పదేళ్ల కాలంలో రూ.8.11 లక్షల కోట్లు అప్పు చేసి రాష్ట్ర ఆర్థిక వ్యవస్థను పూర్తిగా చిన్నాభిన్నం చేశారని, ఒకరకంగా చెప్పాలంటే వ్యవస్థను రేప్ చేశారని ఆగ్రహం వ్యక్తం చేశారు.
అవినీతిపై విచారణ విషయంలో కేంద్రం తీరును సీఎం ప్రశ్నించారు. కాళేశ్వరం ప్రాజెక్టు అవకతవకలపై సీబీఐ (CBI) నుంచి క్లియరెన్స్ ఎందుకు రావడం లేదని నిలదీశారు. అలాగే.. ఈ-కార్ రేస్ కేసులో ఐఏఎస్ అధికారి అర్వింద్ కుమార్ను విచారించేందుకు డిపార్ట్మెంట్ ఆఫ్ పర్సనల్ అండ్ ట్రైనింగ్ (DoPT) నుంచి అనుమతి ఎందుకు రావడం లేదని ప్రశ్నించారు. సీబీఐ విచారణలపై కేసీఆర్కు ఏదో స్పష్టత వచ్చినట్లుందని అందుకే ఇన్నాళ్లు మౌనంగా ఉండి ఇప్పుడు ఫామ్హౌస్ నుంచి బయటకు వచ్చారని రేవంత్ అనుమానం వ్యక్తం చేశారు. పాలమూరు-రంగారెడ్డి ప్రాజెక్టు ముందుకు కదలకపోవడానికి బీఆర్ఎస్ నేతలే కారణమని ఆరోపించారు.
బీఆర్ఎస్ నేతల వ్యక్తిగత తీరుపై సీఎం ఘాటుగా స్పందించారు. కేటీఆర్కు ఇంకా అహంకారం తగ్గలేదని.. హరీశ్ రావు కడుపు నిండా మూసీ నదిలో ఉన్నంత విషం, అక్కసు ఉన్నాయని విమర్శించారు. ఈ క్రమంలోనే అత్యంత సంచలన వ్యాఖ్య చేశారు. ‘అసలు కేసీఆర్ చస్తే లబ్ధి పొందేది ఎవరు? కేసీఆర్ చావును కోరుకుంటుంది హరీశ్ రావే’ అని రేవంత్ రెడ్డి వ్యాఖ్యానించడం రాజకీయ వర్గాల్లో కలకలం రేపుతోంది.