తెలంగాణ రాష్ట్ర బడ్జెట్ సమావేశాల నేపథ్యంలో జరిగిన కాంగ్రెస్ లెజిస్లేటివ్ పార్టీ (సీఎల్పీ) సమావేశంలో సీఎం రేవంత్ రెడ్డి ఎమ్మెల్యేలకు కీలక మార్గదర్శకాలు జారీ చేశారు. ప్రజా ప్రభుత్వంలో మూడో బడ్జెట్ను ప్రవేశపెట్టబోతున్న తరుణంలో ప్రభుత్వ ప్రాధాన్యతలు భవిష్యత్ ప్రణాళికలపై ఆయన స్పష్టతనిచ్చారు. గవర్నర్ ప్రసంగం తమ ప్రభుత్వానికి ఒక రోడ్ మ్యాప్ లాంటిదని పేర్కొన్న ముఖ్యమంత్రి గత ప్రభుత్వ వైఫల్యాల గురించి చర్చించే సమయం ముగిసిందని స్పష్టం చేశారు. ఇకపై ప్రజలకు ఏం చేయబోతున్నాం అనే అంశంపైనే పూర్తి దృష్టి సారించాలని మంత్రులు ఎమ్మెల్యేలను ఆదేశించారు.
సభా సమయం వృధా కాకుండా చర్చలను అర్థవంతంగా నడిపించాలని రేవంత్ రెడ్డి సూచించారు. సభలో మాట్లాడే అంశాల విషయంలో విప్లు, ఎమ్మెల్యేల మధ్య సమన్వయం ఉండాలని కోరారు. గతంలో ప్రతిపక్ష నేతలకు మైక్ ఇవ్వకుండా సభ నుండి సస్పెండ్ చేసిన సంస్కృతిని గుర్తు చేస్తూ ప్రస్తుత ప్రభుత్వం ప్రజాస్వామ్యబద్ధంగా వ్యవహరిస్తుందని చెప్పారు. ఎమ్మెల్యేలు అసెంబ్లీ సమావేశాలకు తప్పనిసరిగా హాజరు కావాలని.. ముఖ్యంగా మహిళా శాసనసభ్యులు చర్చల్లో చురుగ్గా పాల్గొనాలని ఆయన పిలుపునిచ్చారు.
రాజకీయాల్లో వ్యవస్థను గౌరవించినప్పుడే నాయకులకు మనుగడ ఉంటుందని రేవంత్ రెడ్డి వ్యాఖ్యానించారు. వ్యక్తిగత విమర్శలు వ్యవస్థను దెబ్బతీస్తాయని హెచ్చరిస్తూ పార్టీ ప్రభుత్వం నిర్ణయించిన విధానాలకు అనుగుణంగానే అందరూ మాట్లాడాలని సూచించారు. ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలు ఇతర రాష్ట్రాల్లో పర్యటించి అక్కడి ప్రభుత్వ విధానాలను అధ్యయనం చేయాలని దిశానిర్దేశం చేశారు. అసెంబ్లీ కమిటీలను త్వరలోనే పూర్తిస్థాయిలో ఏర్పాటు చేసుకుందామని భరోసా ఇచ్చారు.
రాబోయే ఎన్నికలకు ఇప్పుడు వేసుకునే రోడ్ మ్యాప్ ఎజెండాగా మారుతుందని ముఖ్యమంత్రి పేర్కొన్నారు. 99 రోజుల ప్రజాపాలన సాధించిన ప్రగతిని క్షేత్రస్థాయిలోకి బలంగా తీసుకెళ్లాల్సిన బాధ్యత కార్యకర్తలు నాయకులపై ఉందన్నారు. వేసవి కాలం దృష్ట్యా రాష్ట్రంలో తాగునీటి సమస్య తలెత్తకుండా అప్రమత్తంగా ఉండాలని అధికారులను సమన్వయం చేసుకోవాలని కోరారు. ప్రజల అవసరాలే పరమావధిగా పని చేస్తూ ప్రజా ప్రభుత్వంపై నమ్మకాన్ని మరింత పెంచాలని ఆయన ముగించారు.