జగిత్యాల జిల్లాలో రైతు సమస్యలపై పోరాటం ఒక్కసారిగా వేడెక్కింది. మాజీ మంత్రి జీవన్ రెడ్డి నాయకత్వంలో మొక్కజొన్న రైతులు భారీ ఎత్తున ఆందోళన చేపట్టారు. ప్రభుత్వం తక్షణమే మార్క్ ఫెడ్ ద్వారా మొక్కజొన్న కొనుగోలు కేంద్రాలను ప్రారంభించాలని డిమాండ్ చేస్తూ ఈ నిరసన కార్యక్రమం సాగింది.
తొలుత తన నివాసం నుండి జీవన్ రెడ్డి రైతులతో కలిసి స్వయంగా మోటార్ సైకిల్పై బైక్ ర్యాలీగా బయలుదేరారు. వందలాది మంది రైతులు ఈ ర్యాలీలో పాల్గొని ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. కలెక్టరేట్ చేరుకున్న రైతులు ఒక్కసారిగా గేట్లు తోసుకుంటూ లోపలికి దూసుకెళ్లారు. దీంతో అక్కడ తీవ్ర ఉద్రిక్తత చోటు చేసుకుంది. పోలీసులు వారిని అడ్డుకునే ప్రయత్నం చేసినా రైతులు వెనక్కి తగ్గకుండా ధర్నాను కొనసాగించారు.
ఈ సందర్భంగా జీవన్ రెడ్డి మాట్లాడుతూ.. వరి సాగుకు బదులుగా ఆరుతడి పంటలను ప్రోత్సహించాల్సిన బాధ్యత ప్రభుత్వంపై ఉందన్నారు. మొక్కజొన్న పంట సాగు చేయడం వల్ల రైతులకు అధిక లాభాలు వచ్చే అవకాశం ఉంది. ప్రస్తుత పరిస్థితుల్లో వరి కంటే మొక్కజొన్నే రైతులకు మేలు చేస్తుందని ఆయన అభిప్రాయపడ్డారు. రైతులు ప్రభుత్వం చెప్పిన విధంగా పంట మార్పిడి చేస్తూ మొక్కజొన్న సాగు చేస్తే.. ఇప్పుడు కొనుగోలు కేంద్రాల విషయంలో ప్రభుత్వం మొండివైఖరి ప్రదర్శించడం సరికాదన్నారు.
గిట్టుబాటు ధర కల్పించడంతో పాటు మార్క్ ఫెడ్ ద్వారా ప్రతి గింజను సేకరించాలని ఆయన డిమాండ్ చేశారు. పంట నష్టపోకుండా ఉండేందుకు తక్షణమే కేంద్రాలను ఏర్పాటు చేయాలన్నారు. జగిత్యాల ప్రాంతంలో కోతుల బెడద తీవ్రంగా ఉందని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. కోతుల సంతతిని అరికట్టడానికి ప్రభుత్వం ప్రత్యేకంగా కుటుంబ నియంత్రణ కార్యక్రమాలు చేపట్టాలని సూచించారు. అనంతరం అదనపు కలెక్టర్ ను కలిసి రైతుల డిమాండ్లతో కూడిన వినతిపత్రాన్ని అందజేశారు. సమస్య పరిష్కారం కాకపోతే ఆందోళన ఉధృతం చేస్తామని హెచ్చరించారు.