Revanth Reddy: తెలంగాణ రాష్ట్రంలోని సాగునీటి ప్రాజెక్టులను రాబోయే రెండేళ్ల కాలంలో పూర్తి చేయడమే ప్రభుత్వ లక్ష్యమని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి స్పష్టం చేశారు. ములుగు జిల్లా పర్యటనలో భాగంగా నిర్వహించిన ప్రాజెక్టుల సమీక్షా సమావేశంలో ఆయన సాగునీటి రంగంపై కీలక నిర్ణయాలు ప్రకటించారు. దేవాదుల ప్రాజెక్టుతో పాటు ఇతర పెండింగ్ ప్రాజెక్టుల భూసేకరణ కోసం జూన్ 2వ తేదీ లోపల 600 కోట్ల రూపాయల నిధులను మంజూరు చేస్తామని హామీ ఇచ్చారు. భూసేకరణ ప్రక్రియలో జాప్యం కారణంగా ప్రాజెక్టుల పనులు ఎక్కడా ఆగిపోకూడదని అధికారులను ఆదేశించారు. పరిహారం చెల్లింపుల కోసం గ్రీన్ ఛానల్ ద్వారా నిధులు విడుదల చేస్తామని.. అన్ని ప్రాజెక్టుల భూసేకరణ కోసం ప్రత్యేకంగా ‘కార్పస్ ఫండ్’ ఏర్పాటు చేస్తామని వెల్లడించారు.
నీటి పారుదల ప్రాజెక్టుల అంచనాలపై మార్చి నెలలో ప్రత్యేకంగా మంత్రివర్గ సమావేశాన్ని ఏర్పాటు చేసి అన్ని అంచనాలకు ఆమోదం తెలుపుతామని ముఖ్యమంత్రి పేర్కొన్నారు. దేవాదుల ప్రాజెక్టు పంప్ రిపేర్ పనులను నెల రోజుల్లోగా పూర్తి చేయాలని కఠిన ఆదేశాలు జారీ చేశారు. అసెంబ్లీ సమావేశాల సమయంలో ఎమ్మెల్యేలు.. అధికారులతో కమిటీ హాల్లో దేవాదుల ప్రాజెక్టుపై ప్రత్యేక సమావేశం నిర్వహిస్తామని చెప్పారు. రామప్ప చెరువు నుండి జంపన్న వాగుకు నీరు అందించే ప్రణాళికపై సమగ్ర నివేదిక ఇవ్వాలని అధికారులను కోరారు. ప్రాజెక్టులు పూర్తి చేద్దామంటే గత ప్రభుత్వ వైఫల్యాల వల్ల నిధుల కొరత ఏర్పడిందని.. అయినప్పటికీ నిధుల విడుదల విషయంలో వెనకడుగు వేయబోమని స్పష్టం చేశారు.
ప్రతిపక్షాల విమర్శలపై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఘాటుగా స్పందించారు. చంద్రబాబుకు సహకరిస్తున్నామంటూ చేస్తున్న చౌకబారు విమర్శలను మానుకోవాలని హితవు పలికారు. పొరుగు రాష్ట్రాలతో చర్చలు జరిపి తెలంగాణ నీటి హక్కులను కాపాడుకుంటామని ధీమా వ్యక్తం చేశారు. అసెంబ్లీ బడ్జెట్ సమావేశాల్లో గోదావరి నది జలాలపై లోతుగా చర్చిద్దామని.. ప్రాజెక్టులు.. నీళ్లపై ఏ చర్చకైనా ప్రభుత్వం సిద్ధంగా ఉందని ప్రకటించారు. ప్రతిపక్షాలు తమ తప్పిదాలను కప్పిపుచ్చుకోవడానికి విమర్శలు చేయడం మానుకొని విలువైన సూచనలు ఇస్తే స్వీకరిస్తామని తెలిపారు. ప్రజలు ఓటు వేయకపోవడం వారి తప్పు అన్నట్లుగా ప్రతిపక్ష నేతలు వ్యవహరిస్తున్నారని మండిపడ్డారు.
కాళేశ్వరం ప్రాజెక్టుపై ముఖ్యమంత్రి కీలక వ్యాఖ్యలు చేశారు. కాళేశ్వరం మహా అద్భుతం అని ప్రచారం చేసుకున్నారని.. కానీ తమ ప్రభుత్వం వచ్చినప్పటి నుండి అక్కడ ఒక్క చుక్క నీరు కూడా ఎత్తిపోయలేదని గుర్తు చేశారు. అయినప్పటికీ దేశంలోనే తెలంగాణ అత్యధిక వరి ఉత్పత్తిని సాధించిందని పేర్కొన్నారు. గత ప్రభుత్వ అనాలోచిత నిర్ణయాల వల్ల దేవాదుల ప్రాజెక్టు అంచనాలు 6 వేల కోట్ల నుండి 18,500 కోట్లకు పెరిగాయని ఆవేదన వ్యక్తం చేశారు. కాళేశ్వరం ప్రాజెక్టులో జరిగిన తప్పులను సరిదిద్ది దానిని వదిలేయకుండా ప్రజల ప్రయోజనాల కోసం ఉపయోగంలోకి తెస్తామని రేవంత్ రెడ్డి హామీ ఇచ్చారు.