జుబ్లీహిల్స్ లోని ముఖ్యమంత్రి నివాసంలో ఒక అద్భుతమైన సన్నివేశం చోటుచేసుకుంది. ట్యాంక్ బండ్ పై వందలాది మంది ప్రాణాలను కాపాడి రియల్ హీరోగా గుర్తింపు తెచ్చుకున్న శివ దీన స్థితిని తెలుసుకున్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తక్షణమే స్పందించారు. ప్రాణాలకు తెగించి ఇతరులను కాపాడే శివ ప్రస్తుతం ఉపాధి లేక కుటుంబ పోషణకు ఇబ్బంది పడుతున్నారనే వార్త సీఎం దృష్టికి వెళ్లింది. సామాన్యుల కష్టాలను తీర్చడమే లక్ష్యంగా పెట్టుకున్న ప్రభుత్వం శివను పిలిపించి మాట్లాడింది.
ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి స్వయంగా శివ కుటుంబ సభ్యులతో ముచ్చటించారు. వారి కష్టాలను అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా శివ కుటుంబానికి రూ. 5 లక్షల ఆర్థిక సాయాన్ని ప్రకటించడమే కాకుండా.. తక్షణమే చెక్కును అందజేశారు. శివ సేవలను గుర్తించిన ప్రభుత్వం అతని కుమారుడు వేణుమాధవ్ కు హోంగార్డుగా ఉద్యోగం కల్పించింది. ఇందుకు సంబంధించిన నియామక పత్రాన్ని ముఖ్యమంత్రి స్వయంగా యువకుడికి అందజేసి అభినందించారు.
శివ నివసించడానికి సరైన ఇల్లు లేదని తెలుసుకున్న రేవంత్ రెడ్డి అధికారులకు కీలక ఆదేశాలు జారీ చేశారు. శివ కుటుంబానికి ఒక డబుల్ బెడ్రూం ఇల్లు మంజూరు చేయాలని స్పష్టం చేశారు. కేవలం ఆర్థిక సాయంతోనే ఆగిపోకుండా భవిష్యత్తులో శివ గౌరవప్రదంగా జీవించేలా మార్గం సుగమం చేశారు. తన నైపుణ్యాన్ని సమాజ సేవకు వాడుతున్న శివ.. తనకు ఉపాధి కోసం ట్యాంక్ బండ్ సమీపంలో ఒక స్విమ్మింగ్ పూల్ నిర్మించి ఇవ్వాలని సీఎంను కోరారు.
దీనిపై సానుకూలంగా స్పందించిన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి స్విమ్మింగ్ పూల్ నిర్మాణానికి అవసరమైన చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. శివ ద్వారా మరికొంత మంది యువకులకు ఈత నేర్పించి వారిని కూడా ప్రాణరక్షకులుగా తీర్చిదిద్దే అవకాశం ఉంటుందని సీఎం అభిప్రాయపడ్డారు. ప్రభుత్వం అందించిన ఈ భారీ ఊరట పట్ల శివ కుటుంబ సభ్యులు హర్షాతిరేకాలు వ్యక్తం చేశారు.
తమ కష్టాలను గుర్తించి ఆదుకున్న ముఖ్యమంత్రికి శివ కృతజ్ఞతలు తెలిపారు. ఇన్నేళ్ల సేవకు ఇన్నాళ్లకు తగిన గుర్తింపు లభించిందని భావోద్వేగానికి లోనయ్యారు. ఒక సామాన్యుడి ఆవేదనను ఆలకించి అండగా నిలిచిన ముఖ్యమంత్రి తీరును పలువురు ప్రశంసిస్తున్నారు. ఆపదలో ఉన్నవారిని కాపాడే గుణం ఉన్న శివకు ఈ సాయం ఎంతో అవసరమని జనం చర్చించుకుంటున్నారు.
ప్రభుత్వ నిర్ణయం వల్ల శివ కుటుంబానికి శాశ్వత నివాసంతో పాటు స్థిరమైన ఉపాధి మార్గం దొరికింది. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తీసుకున్న ఈ నిర్ణయం ప్రజా ప్రభుత్వం పేదలకు ఏ విధంగా తోడ్పడుతుందో నిరూపించింది. అధికారులు సైతం సీఎం ఆదేశాలతో వెంటనే రంగంలోకి దిగి తదుపరి ప్రక్రియను వేగవంతం చేశారు.
ALSO READ: స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్ సంచలన ప్రకటన.. 1000 కొట్లతో అభివృద్ది..?