Gaddam Prasad Kumar: తమదైన ముద్ర పడేందుకు కృషి
–తాగు, సాగు నీరు సాధించేంతవరకు వెనక్కి తగ్గను
–ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లోనే వికారాబాద్కు శాటిలైట్ ప్రాజెక్టు
–వికారాబాద్ మున్సిఫల్ బడ్జేట్లో పాల్గోన్న గడ్డం ప్రసాద్ కుమార్
రంగారెడ్డి బ్యూరో, స్వేచ్చ: ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో నేను మంత్రి గా ఉన్నప్పుడు, అప్పటి కేంద్ర మంత్రి స్వర్గీయ సూదిని జైపాల్ రెడ్డితో మాట్లాడి రూ.2,300 కోట్లతో వికారాబాద్ పట్టణానికి శాటిలైట్ ప్రాజెక్టు మంజూరు చేయించానని అసెంబ్లీ స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్ తెలిపారు. దేశంలో మొత్తం ఏడు శాటిలైట్ ప్రాజెక్టులు మంజూరు అయితే అందులో వికారాబాద్ ఒకటి అని అన్నారు. అయితే దురదృష్టవశాత్తు ప్రభుత్వాలు మారడంతో ఆ నిధులలో మెజారిటీ రాలేదని గుర్తు చేశారు. వికారాబాద్ మున్సిపాలిటీ బడ్జేట్ సమావేశానికి ముఖ్యతిథిగా అసెంబ్లీ స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్ మంగళవారం హాజరై ప్రసంగించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ… సీఎం రేవంత్ రెడ్డి నియోజకవర్గంలోని కొడంగల్ మున్సిపాలిటీకి దీటుగా వికారాబాద్ పట్టణాన్ని అభివృద్ధి చేస్తానని తెలిపారు. మున్సిపాలిటీ లో విలీనమైన గ్రామాలలో అవసరమైన ఇందిరమ్మ ఇళ్ళను మంజూరు చేయిస్తానని తెలిపారు. పట్టణం పరిధిలో అవసరమైన మూడు రైల్వే ఓవర్ బ్రిడ్జిలను మంజూరు చేయించడానికి రైల్వే శాఖతో ప్రయత్నాలు చేస్తున్నామని అన్నారు.
ట్రాఫిక్ ఇబ్బందులు ఉన్న జంక్షన్లను అభివృద్ధి చేయిస్తానని తెలిపారు. మాజీ ముఖ్యమంత్రి స్వర్గీయ మర్రి చెన్నారెడ్డి నిర్మించిన శివసాగర్ చెరువును పూర్తిగా ఆధునికీకరణ చేయిస్తానని అన్నారు. హైదరాబాద్ ఎన్టీఆర్ పార్కు తరహాలో ఇక్కడ కూడా పార్కును ఏర్పాటు చేద్దామని అన్నారు. నిధులు తెచ్చి ఇచ్చే బాధ్యత నాది, సక్రమంగా అవసరమైన చోట మాత్రమే ఖర్చు చేయండి అని పాలకవర్గ సభ్యులకు వివరించారు. వైఎస్ రాజశేఖరరెడ్డి మన వికారాబాద్ ప్రాంతానికి సాగునీరు తీసుకు రావడానికి ప్రాణహిత- చేవెళ్ల, పాలమూరు రంగారెడ్డి పథకాలను తీసుకురావాలని ప్రయత్నం చేశామని తెలిపారు. గత ప్రభుత్వం ఈ పథకాన్ని నిర్లక్ష్యం చేసి మన ప్రాంతానికి అన్యాయం చేసిందన్నారు. పాలమూరు- రంగారెడ్డి ఎత్తిపోతల పథకాన్ని మన ప్రాంతానికి తీసుకురావాలని మళ్ళీ ప్రయత్నాలు చేస్తున్నానని తెలిపారు. సాగు, తాగు నీరు మన ప్రాంతానికి అందించేందుకు కచ్చితంగా పనిచేస్తానని తెలిపారు. టీయూఎఫ్ఐడీసీ ద్వారా రూ.60కోట్లు నిధులు మంజూరు అయ్యాయని తెలిపారు. హచ్ఎండీఏ నిధుల ద్వారా రూ.270 కోట్లు త్వరలోనే మంజూరు చేస్తారని తెలిపారు. అనంతగిరిని వెయ్యి కోట్ల రూపాయలతో అభివృద్ధి చేయడానికి రాష్ట్ర ప్రభుత్వం మెగా సంస్థతో ఒప్పందం కుదిరిందని అన్నారు.
Also Read: నిరుద్యోగులకు సువర్ణవకాశం.. డిగ్రీ అర్హతతో 1000 ఉద్యోగాలకు నోటిఫికేషన్ రిలీజ్
ఈ ప్రాజెక్టు పూర్తయితే మన ప్రాంతంలోని మూడు వేల మంది యువకులకు ఉద్యోగ అవకాశాలు లభిస్తాయని తెలిపారు. నేను ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో మంత్రిగా ఉన్నప్పుడు పట్టణ పరిధిలోని నారాయణపూర్ లో వంద ఎకరాలలో టెక్స్ట్ టైల్స్ పార్కు అభివృద్ధి చేసి నాలుగు వేల మంది మహిళలకు ఉపాధి కల్పించాలని ప్రయత్నం చేశామని అన్నారు. గత ప్రభుత్వం పదేళ్ళు పట్టించుకోలేదు, మళ్ళీ ఇప్పుడు ఏర్పాటు చేయడానికి ప్రయత్నాలు ప్రారంభించామన్నారు. పట్టణ అభివృద్ధి, ప్రజలకు అవసరమైన మౌళిక వసతులు కల్పించడానికి రాష్ట్ర ప్రభుత్వంతో మాట్లాడి అవసరమైన నిధులను మంజూరు చేయిస్తానని తెలిపారు. ఎన్నికల సమయంలో మాత్రమే రాజకీయాలు, మిగిలిన సమయంలో అందరూ మనవాళ్ళే, అధికార పక్షం, ప్రతిపక్షం అనే తేడా లేకుండా అందరినీ కలుపుకుని అన్ని ప్రాంతాలను సమానంగా అభివృద్ధి చేయాలన్నారు.
ప్రజాప్రతినిధులు, అధికారులు కలిసి కట్టుగా పనిచేసి నిధులను సక్రమంగా, సమర్ధవంతంగా ఖర్చు చేసి వికారాబాద్ మున్సిపాలిటీని రాష్ట్రంలోనే ఆదర్శవంతంగా తీర్చిదిద్దాలి, నా వంతుగా మీకు పూర్తి సహకారం ఉంటుందన్నారు. నేను అందరు రాజకీయ నాయకుల లాంటి వ్యక్తిని కాదు, నాకు ఆదాయం, ఆస్థులపై ఆశ లేదు అన్నారు. వికారాబాద్ ప్రాంతం అభివృద్ధి నా లక్ష్యం, మర్రి చెన్నారెడ్డి లాగా ఈ ప్రాంతం అభివృద్ధి పై నా ముద్ర ఉండాలని నా కోరిక అని వివరించారు. చిన్న వయసులోనే చైర్మన్ అయిన నా కూతురు గడ్డం అనన్య పై మీ అందరి ఆశీర్వాదం ఉండాలన్నారు. వార్డు సభ్యులందరి సమస్యను నోట్ చేసుకున్నాను.. చైర్ పర్సన్ గడ్డం అనన్య వికారాబాద్ మున్సిపాలిటీ పరిధిలోని ప్రతి వార్డు సమస్యలను వ్యక్తిగతంగా తీసుకోని పరిష్కారిస్తానని చైర్ పర్సన్ గడ్డం అనన్య అన్నారు.
వార్డుల సభ్యులు చెప్పిన సమస్యలను అన్నింటినీ నేను వ్యక్తిగతంగా నోట్ చేసుకున్నానని తెలిపారు. ప్రతి వార్డులో పర్యటించి కామన్ ప్రాబ్లమ్స్ ను గుర్తించి ప్రాధాన్యత క్రమంలో పూర్తి చేద్దామన్నారు. మీ వార్డులలో పనిచేస్తున్న మున్సిపల్ సిబ్బంది గురించి అవగాహన కలిగి ఉండాలి అన్నారు. తద్వారా ఇబ్బందులు తలెత్తిన సమయంలో వెంటనే సంబంధిత ఉద్యోగిని అప్రోచ్ కావడానికి వీలవుతుందన్నారు. గౌరవ స్పీకర్ ప్రత్యేకంగా శ్రద్ధ తీసుకుని అధికంగా నిధులను తీసుకుని రావాలని విజ్ఞప్తి చేస్తున్నానని అన్నారు. ఈ సమావేశంలో పాల్గొన్న వైస్ చైర్మన్ అర్ధ సుధాకర్ రెడ్డి, జిల్లా అడిషనల్ కలెక్టర్ ఉమా శంకర్, కమీషనర్ విక్రం సింహా రెడ్డి, వార్డుల సభ్యులు, అధికారులు, తదితరులు పాల్గోన్నారు.
Also Read: పోలీసుల మందే బైక్ స్టంట్లు.. సోషల్ మీడియాలో ఫోజులు కానీ చివరికి..?