Drugs Racket: హైదరాబాద్ శివార్లలో మళ్లీ మత్తు మందుల గుట్టు రట్టయింది. కెమికల్ ల్యాబ్ ముసుగులో ఏకంగా కోట్ల రూపాయల విలువైన డ్రగ్స్ తయారు చేస్తున్న ఒక పెద్ద ముఠా వ్యవహారాన్ని నార్కోటిక్ బ్యూరో అధికారులు చాకచక్యంగా బయటపెట్టారు.
ఫార్మా ల్యాబ్ పేరిట మత్తు సామ్రాజ్యం
మౌలాలి పరిధిలోని MS ల్యాబ్లో నిబంధనలకు విరుద్ధంగా డ్రగ్స్ తయారు చేస్తున్నారనే పక్కా సమాచారంతో అధికారులు అకస్మాత్తుగా దాడి చేశారు. ఈ తనిఖీల్లో ల్యాబ్ యజమాని మాణిక్య రెడ్డితో పాటు మరొకరిని అధికారులు అక్కడికక్కడే అదుపులోకి తీసుకున్నారు.
సైంటిస్టులతో హ్యాండ్ ఇన్ హ్యాండ్
మాణిక్య రెడ్డి కేవలం సాధారణ వ్యాపారి కాదు.. నాలెడ్జ్ ఉన్న కెమికల్ సైంటిస్టులను రంగంలోకి దింపి పక్కా ప్లాన్తో ఈ ల్యాబ్ను నడిపిస్తున్నట్లు తేలింది. వీరి వద్ద నుంచి రూ. 17 కోట్లకు పైగా విలువైన డ్రగ్స్తో పాటు, తయారీకి ఉపయోగించే 60 కిలోల ముడిసరుకును అధికారులు స్వాధీనం చేసుకున్నారు.
ఉత్తరాదికి సరఫరా..
ఈ ల్యాబ్లో ప్రధానంగా అల్పజోలం అలాగే మెఫెడ్రోన్ అనే నిషేధిత మత్తు పదార్థాలను ఉత్పత్తి చేస్తున్నారు. ఇక్కడ తయారైన సరుకును రహస్య మార్గాల ద్వారా మహారాష్ట్రతో పాటు ఇతర ఉత్తరాది రాష్ట్రాలకు తరలిస్తూ సొమ్ము చేసుకుంటున్నట్లు విచారణలో వెల్లడైంది. ప్రస్తుతం పోలీసులు నిందితులను విచారిస్తూ.. ఈ ముఠా వెనుక ఉన్న మరికొందరి కోసం గాలిస్తున్నారు.
Also Read:పెమ్మసాని ఫొటో మార్ఫింగ్ కేసులో బిగ్ ట్విస్ట్.. అంబటికి హైకోర్టు సమన్లు!