CM Revanth: భద్రాద్రి కొత్తగూడెం లో ఏర్పాటు చేసిన డాక్టర్ మన్మోహన్ సింగ్ ఎర్త్ సైన్సెస్ యూనివర్సిటీ కి సీఎం రేవంత్ రెడ్డి శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి మాట్లాడుతూ.. తెలంగాణ ఉద్యమం ప్రారంభమైన చోటే.. తెలంగాణ ఇచ్చిన మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ పేరు పెట్టుకున్నాం అని తెలిపారు. ప్రజాపాలన రెండేళ్లు పూర్తి చేసుకుంటున్న వేళ ఈ కార్యక్రమం నిర్వహించడం చాలా ఆనందం ఇచ్చిందన్నారు.
తెలంగాణ కలను ఆకాంక్షను నెరవేర్చింది ఆనాటి ప్రధాని మన్మోహన్ సింగ్ అని ఆయన గుర్తు చేసుకున్నారు. అలాంటి వ్యక్తి పేరు పెట్టడం గొప్ప విషయం అని పేర్కొన్నారు. మన్మోహన్ సింగ్ పేరు ఎక్కడా పెట్టకముందే యూనివర్సిటీకి ఆయన పేరును తెలంగాణ ప్రభుత్వం పెట్టింది అని చెప్పారు. మొట్టమొదట తెలంగాణ ఉద్యమానికి పునాదులు పడిందే భద్రాద్రి కొత్తగూడెం లో అని రేవంత్ రెడ్డి నొక్కి చెప్పారు.
ఖమ్మం అభివృద్ధే మా ప్రభుత్వ లక్ష్యం..
ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఖమ్మం జిల్లా కాంగ్రెస్ పార్టీకి కంచుకోట అని అభివర్ణించారు. ఖమ్మం జిల్లాలో సీతారామ సహా ఇతర సాగునీటి ప్రాజెక్టులను పూర్తి చేయాలన్నదే తెలంగాణ ప్రభుత్వ లక్ష్యం అని స్పష్టం చేశారు. గత ప్రభుత్వ హయాంలో జిల్లాలోని ప్రాజెక్టులకు తీవ్ర అన్యాయం జరిగిందని విమర్శించారు. ప్రభుత్వం ఏ కార్యక్రమం చేపట్టినా ఖమ్మం జిల్లా నుంచే ప్రారంభించాం అని తెలిపారు. భద్రాద్రి రామయ్య సాక్షిగా ఖమ్మం జిల్లాను అభివృద్ది దారిలో పూర్తి స్థాయిలో నడిపించే బాధ్యత తనదే అని సీఎం హామీ ఇచ్చారు.
సర్పంచ్ ఎన్నికల్లో అభివృద్ధికే ఓటేయండి..
మంచి ప్రభుత్వం ఉంటే ప్రభుత్వానికి అన్ని విధాలుగా అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలు అందుతాయని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పేర్కొన్నారు. సర్పంచ్ ఎన్నికల్లో అభివృద్ధికి ఓటు వేయాలని ఆయన ప్రజలను కోరారు. ఈ కార్యక్రమంలో డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క మంత్రులు తుమ్మల నాగేశ్వర రావు పొంగులేటి శ్రీనివాసరెడ్డి వాకిటి శ్రీహరి ఖమ్మం ఉమ్మడి జిల్లా ఎంఎల్ ఏ లు ఎంఎల్సీ లు ఉన్నతాధికారులు పాల్గొన్నారు.