CM Revanth: దేశానికి స్వాతంత్ర్యం అందించిన మహాత్మాగాంధీని హత్య చేసిన పార్టీ బీజేపీ అని సీఎం రేవంత్ రెడ్డి తీవ్రంగా విమర్శలు చేశారు. గాంధీభవన్లో కొనసాగుతున్న పీసీసీ (తెలంగాణ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ) సమావేశానికి సీఎం రేవంత్ రెడ్డి, ఏఐసీసీ కార్యదర్శి మీనాక్షి నటరాజన్ హాజరయ్యారు. ఈ సమావేశం పాత జిల్లా కాంగ్రెస్ కమిటీ అధ్యక్షులకు వీడ్కోలు పలకడం, కొత్తగా నియమితులైన డీసీసీ అధ్యక్షులకు దిశానిర్దేశం చేయడం ప్రధాన అజెండాగా నిర్వహించారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కొత్త డీసీసీలతో ముఖాముఖిగా మాట్లాడారు.
సీఎం రేవంత్ రెడ్డి గాంధీ కుటుంబం దేశం కోసం చేసిన త్యాగాలను స్మరించుకున్నారు. నెహ్రూ కుటుంబం శ్రీమంతులైనప్పటికీ, వారి ఆస్తులను దేశం కోసం పణంగా పెట్టారని అన్నారు. ఆ కుటుంబం దేశం కోసం ప్రాణాలు ఇచ్చారని.. ఆస్తులు ధారపోశారని తెలిపారు. మోతీలాల్ నెహ్రూ, జవహర్లాల్ నెహ్రూ స్వాతంత్ర్యం తీసుకొచ్చారని పేర్కొన్నారు. మహాత్మాగాంధీని హత్య చేసిన పార్టీ బీజేపీ అని ఆయన తీవ్రంగా విమర్శించారు.
నేషనల్ హెరాల్డ్ పత్రిక స్వాతంత్ర్యం రావడంలో ప్రముఖ పాత్ర పోషించిందని సీఎం రేవంత్ గుర్తుచేశారు. ఉద్యోగులను ఆదుకోవడానికే కాంగ్రెస్ ఈ పని చేసిందని.. లక్షలాది రూపాయలు అందించారని చెప్పారు. పత్రికను పునరుద్ధరించాలనేది కాంగ్రెస్ ఆలోచన అన.. ఇందులో ప్రభుత్వ నిధులు ఏ ఒక్క రూపాయి కూడా లేవని స్పష్టం చేశారు. ఆస్తులు నెహ్రూవే, పత్రిక ఆయనదే అని సీఎం చెప్పుకొచ్చారు. కేవలం మానసికంగా ఇబ్బంది పెట్టేందుకే బీజేపీ ఈ కేసులు పెట్టిందని ఆరోపించారు. రాహుల్ గాంధీ బయటపెడుతున్న ఓట్ చోరీ భండారాన్ని (ఓట్ల దొంగతనం) దృష్టి మరల్చడానికే ఈ కేసులను వాడుకుంటున్నారని ఆరోపించారు. గాంధీ కుటుంబానికి కాంగ్రెస్ పార్టీ అండగా ఉంటుందని.. కేసులు పెడితే భయపడే పరిస్థితులు లేవని చెప్పారు. బీజేపీ కక్షపూరిత చర్యలకు పాల్పడుతోందని విమర్శించారు.
సంక్షేమ కార్యక్రమాల అమలు గురించి సీఎం రేవంత్ రెడ్డి మాట్లాడారు. గతంలో బతుకమ్మ చీరలు ఇస్తే మహిళలు తిట్టారని, కానీ తమ ప్రభుత్వం అమలు చేస్తున్న ఇందిరమ్మ చీరలు 90 శాతం మందికి అందాయని తెలిపారు. ప్రతి ఒక్క మహిళకు చీర చేరే విధంగా చూడాలని డీసీసీలకు సూచించారు. కాంగ్రెస్ రెండేళ్ల పాలనలో వచ్చిన మార్పును ప్రజలు గుర్తించాలని కోరారు. రాష్ట్రాన్ని సంక్షోభం, అప్పులతో కేసీఆర్ అప్పగించారని.. కానీ తమ ప్రభుత్వం రాష్ట్రాన్ని సంక్షేమం వైపు నడిపిస్తోందని తెలిపారు. 2034 నాటికి తెలంగాణను వన్ ట్రిలియన్ డాలర్ల ఎకానమీగా మార్చడమే తమ లక్ష్యమని పేర్కొన్నారు. కాంగ్రెస్ ప్రజాపాలన రెండేళ్లు పూర్తి చేసుకోబోతున్నట్లు తెలిపారు. డిసెంబర్ 7న ఉస్మానియా యూనివర్సిటీకి వెళ్తున్నానని.. ఈ నెల 9న విజన్ డాక్యుమెంట్ను ఆవిష్కరిస్తున్నామని సీఎం రేవంత్ రెడ్డి వెల్లడించారు.
ALSO READ: AP Govt: 16,666 ఎకరాల భూసమీకరణకు ఏపీ సర్కార్ ఉత్తర్వులు.. ఇదిగో గ్రామాల జాబితా