CM Revanth Reddy: తెలంగాణ విద్యా రంగంలో విప్లవాత్మక మార్పులు తీసుకువచ్చే దిశగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కీలక ప్రకటనలు చేశారు. మాదాపూర్లో జరిగిన ఒక ప్రైవేట్ ఆసుపత్రి ప్రారంభోత్సవంలో ఆయన మాట్లాడుతూ ప్రభుత్వ పాఠశాలల బలోపేతానికి ప్రభుత్వం కట్టుబడి ఉందని స్పష్టం చేశారు. ముఖ్యంగా నిరుపేద విద్యార్థులకు నాణ్యమైన విద్యను చేరువ చేయడమే లక్ష్యంగా కొత్త విద్యా విధానాన్ని తీసుకురాబోతున్నట్లు వెల్లడించారు.
వచ్చే విద్యా సంవత్సరం నుంచి రాష్ట్రవ్యాప్తంగా ‘నర్సరీ నుండి 12వ తరగతి’ (Nursery to 12th) వరకు ఒకే ప్రాంగణంలో విద్యనందించే సమగ్ర విధానాన్ని అమలు చేయనున్నట్లు సీఎం తెలిపారు. దీనివల్ల విద్యార్థులు ప్రాథమిక స్థాయి నుండి ఇంటర్మీడియట్ వరకు ఒకే చోట విద్యను అభ్యసించే అవకాశం కలుగుతుంది. కార్పొరేట్ పాఠశాలలకు దీటుగా ప్రతి నియోజకవర్గంలో మోడల్ స్కూల్స్ తరహాలో ‘తెలంగాణ పబ్లిక్ స్కూల్స్’ ఏర్పాటు చేస్తామని భరోసా ఇచ్చారు. ఈ స్కూళ్లలో విద్యార్థులకు ఉదయం నాణ్యమైన టిఫిన్, మధ్యాహ్న భోజనం ప్రభుత్వం తరపున ఉచితంగా అందిస్తామని పేర్కొన్నారు.
రవాణా సౌకర్యం విషయంలో కూడా ముఖ్యమంత్రి విద్యార్థులకు తీపి కబురు అందించారు. ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థుల కోసం వచ్చే విద్యా సంవత్సరం నుంచి ఉచితంగా లేదా 50 శాతం రాయితీతో బస్సు రవాణా సౌకర్యం కల్పిస్తామన్నారు. దీనివల్ల సుదూర ప్రాంతాల నుంచి వచ్చే విద్యార్థులకు ప్రయాణ భారం తగ్గుతుందని ఆశిస్తున్నారు. ప్రైవేట్ ఆసుపత్రులు కూడా తమ లాభాల్లో కొంత భాగాన్ని పేదల వైద్యం కోసం కేటాయించాలని ఆయన ఈ సందర్భంగా సూచించారు. విద్యా, వైద్య రంగాల్లో తెలంగాణను దేశానికే ఆదర్శంగా నిలపడమే తమ ప్రభుత్వ ధ్యేయమని రేవంత్ రెడ్డి పునరుద్ఘాటించారు.
Read Also: Kavitha Vs KTR: వెలుగుమట్ల ఇష్యూలో కవిత హైలెట్…కేటీఆర్ సోషల్ మీడియాకే పరిమితమా?