కేంద్రమంత్రి బండి సంజయ్ తనయుడు భగీరథ్పై నమోదైన పోక్సో కేసు వ్యవహారం తెలంగాణ రాజకీయాల్లో ప్రకంపనలు సృష్టిస్తోంది. ఈ కేసుపై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అత్యంత కఠినంగా స్పందించారు. విచారణలో జాప్యంపై డీజీపీ సీవీ ఆనంద్ను స్వయంగా పిలిపించి వివరణ కోరారు. ఈ నెల 8వ తేదీనే ఫిర్యాదు అందినప్పటికీ నిందితులపై చర్యలు తీసుకోవడంలో ఎందుకు ఆలస్యం జరిగిందని ముఖ్యమంత్రి తీవ్ర అసహనం వ్యక్తం చేశారు. బాధితులకు న్యాయం చేయడంలో నిర్లక్ష్యం వహిస్తే సహించేది లేదని హెచ్చరించారు.
డీజీపీ సీవీ ఆనంద్ దీనిపై వివరణ ఇస్తూ ప్రధాని మోదీ పర్యటన భద్రతా ఏర్పాట్లలో పోలీసు యంత్రాంగం నిమగ్నమై ఉండటం వల్లే ప్రక్రియ కాస్త ఆలస్యమైందని తెలిపారు. కేసు పూర్వాపరాలను ఆయన ముఖ్యమంత్రికి నివేదించారు. వివరాలు తెలుసుకున్న రేవంత్ రెడ్డి తక్షణమే ఈ ఉదంతంపై సమగ్ర విచారణ జరపాలని ఆదేశించారు. ఇందుకోసం ప్రత్యేక పోలీసు బృందాలను (Special Teams) రంగంలోకి దింపాలని స్పష్టం చేశారు. రాజకీయ ఒత్తిళ్లకు తావు లేకుండా పారదర్శకంగా సాక్ష్యాలను సేకరించి నివేదిక సమర్పించాలని డీజీపీకి సూచించారు.
తన 17 ఏళ్ల కుమార్తెను భగీరథ్ వేధిస్తున్నారంటూ ఓ తల్లి ఇచ్చిన ఫిర్యాదుతో పేట్బషీరాబాద్ పోలీసులు కేసు నమోదు చేశారు. ఈ క్రమంలో నిందితుడిపై సెక్షన్ 11 రెడ్ విత్ 12 పోక్సో చట్టంతో పాటు బీఎన్ఎస్ 74, 75 సెక్షన్లను ప్రయోగించారు. మరోవైపు ఈ వివాదం సరికొత్త మలుపు తిరిగింది. సదరు బాలిక తల్లిదండ్రులు తనను డబ్బుల కోసం బెదిరిస్తున్నారంటూ భగీరథ్ కరీంనగర్ పోలీసులను ఆశ్రయించారు. ఈ ప్రతి ఫిర్యాదు ఆధారంగా ముగ్గురిపై కరీంనగర్ టూటౌన్ పోలీసులు కేసు నమోదు చేశారు.
ఈ అంశంపై రాష్ట్ర బాలల హక్కుల పరిరక్షణ కమిషన్ చైర్పర్సన్ సీతాదయాకర్ రెడ్డి ఆరా తీశారు. సైబరాబాద్ సీపీ నుంచి పూర్తి స్థాయి నివేదిక తెప్పించుకున్నారు. దీనిపై లోతైన విచారణ జరిపేందుకు కమిషన్ ఒక ప్రత్యేక బెంచ్ను ఏర్పాటు చేసింది. ముఖ్యమంత్రి ప్రత్యక్షంగా జోక్యం చేసుకోవడంతో పోలీసు యంత్రాంగం అప్రమత్తమైంది. రాబోయే 24 గంటల్లో ప్రత్యేక బృందాలు బాధితులు అలాగే సాక్షుల నుంచి వాంగ్మూలం సేకరించే అవకాశం కనిపిస్తోంది. శాంతిభద్రతల పరిరక్షణలో రాజీ పడబోమని ప్రభుత్వం ప్రకటించడంతో ఈ కేసు విచారణ ఇప్పుడు రాష్ట్రవ్యాప్తంగా ఉత్కంఠ రేపుతోంది.
ALSO READ: మే 20 నుండి ఊరూరా ‘తెలంగాణ రక్షణ సేన’ జెండా పండుగ.. ప్రజా చైతన్యానికి నాంది!