Telangana Parents Maintenance Bill: తెలంగాణ శాసనసభ వేదికగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వృద్ధ తల్లిదండ్రుల సంరక్షణ కోసం ప్రతిపాదించిన కొత్త బిల్లుపై ప్రసంగించారు. పురాణాలలో మాతృ పితృ భక్తికి మారుపేరుగా నిలిచిన శ్రవణ కుమారుడి గాథను ముఖ్యమంత్రి గుర్తు చేశారు. దృష్టిలేని తల్లిదండ్రులను కావిడిలో మోస్తూ పుణ్యక్షేత్రాలు చూపించిన శ్రవణుడు మనందరికీ ఆదర్శమని పేర్కొన్నారు. తల్లిదండ్రులను ప్రేమించడంలో శ్రవణుడిని ఆదర్శంగా తీసుకుంటే ఎటువంటి చట్టాలు, నిబంధనలు అవసరం లేదని అభిప్రాయపడ్డారు. అయితే నేటి కాలంలో పేగు బంధాల కంటే ఆస్తులకే ప్రాధాన్యత పెరిగిపోవడం దురదృష్టకరమన్నారు.
ప్రఖ్యాత ‘రేమండ్స్’ బ్రాండ్ మాజీ అధినేత విజయ్ పథ్ సింఘానియా (87) మరణంపై ముఖ్యమంత్రి స్పందిస్తూ, ఒక పారిశ్రామికవేత్తగా వెయ్యి కోట్ల సామ్రాజ్యాన్ని నిర్మించిన ఆయన, చివరి రోజుల్లో అనామికుడిగా తనువు చాలించడం అత్యంత విషాదకరమని అన్నారు. తన ఆస్తి మొత్తాన్ని గిఫ్ట్ డీడ్ ద్వారా కుమారుడు గౌతమ్ సింఘానియాకు అప్పగించిన తర్వాత, కన్న తండ్రిని ఇంటి నుండి బయటకు పంపేయడం, కారు, డ్రైవర్ సౌకర్యాలను కూడా తొలగించడం ఆధునిక సమాజపు క్రూరత్వానికి అద్దం పడుతోందని ఆవేదన వ్యక్తం చేశారు. పిల్లలకు సర్వస్వం ఇచ్చేసి నేను పెద్ద తప్పు చేశానని ఆయన తన ఆత్మకథలో రాసుకోవడం ప్రతి తల్లిదండ్రులకూ ఒక హెచ్చరిక అని పేర్కొన్నారు.
దేశంలో పిల్లల హక్కుల కోసం (POCSO, RTE), మహిళల భద్రత కోసం (నిర్భయ, వరకట్న నిషేధ చట్టం) అనేక చట్టాలు ఉన్నప్పటికీ, వృద్ధ తల్లిదండ్రుల సంరక్షణలో ఇంకా నిర్లక్ష్యం కొనసాగుతోందని రేవంత్ రెడ్డి గుర్తు చేశారు. తల్లిదండ్రులను చూసుకోని పిల్లల్లో భయం కలిగించేందుకే ఈ కొత్త చట్టాన్ని తీసుకువస్తున్నట్లు తెలిపారు. కేవలం ఒకరిద్దరు పిల్లలకే పరిమితమవుతున్న నేటి చిన్న కుటుంబాల్లో, తల్లిదండ్రుల సంరక్షణ గాలికి వదిలేయడం వల్ల వారు అనాథలుగా మారుతున్నారు. తల్లిదండ్రులను చూసుకోలేని వారిని సమాజం బహిష్కరించాలని, ఇది కేవలం చట్టం మాత్రమే కాదు, ఒక సామాజిక బాధ్యత అని పిలుపునిచ్చారు.
“అడ్డాల నాడే బిడ్డలు తప్ప గడ్డాల నాడు కాదు.” అనే సామెత నిజం కాకూడదని, బతికున్నప్పుడు గుప్పెడు మెతుకులు పెట్టని బిడ్డలు చనిపోయాక ఆస్తుల కోసం కొట్లాడుకోవడం కన్నా ఘోరం మరొకటి లేదని వ్యాఖ్యానించారు. ఏ తల్లిదండ్రులు అనాథలుగా ఉండకూడదన్నదే ఈ బిల్లు ప్రధాన ఉద్దేశమని స్పష్టం చేశారు. ఆధునిక సమాజంలో మానవ సంబంధాలు సంపద, భౌతిక సుఖాల కోసం ఎలా దిగజారిపోతున్నాయో వివరిస్తూ, చారిత్రక, సమకాలీన ఉదాహరణలతో సభను ఆలోచింపజేశారు.
Read Also: ఉద్యోగులకు కల్వకుంట్ల కవిత బహిరంగ క్షమాపణ.. న్యాయం చేయలేకపోయామంటూ పశ్చాత్తాపం