CM Revanth Reddy: తెలుగు వ్యక్తికి జాతీయ స్థాయిలో సరైన అవకాశం వచ్చిందన్నారు సీఎం రేవంత్రెడ్డి. తెలుగువారి గౌరవం పెరిగేలా అందరూ ఒక తాటిపైకి వచ్చి ఇండియా కూటమి అభ్యర్థి సుదర్శన్ రెడ్డికి అండగా నిలబడాలన్నారు. ఆయన గెలిస్తే తెలుగు వారి ప్రతిష్ట అమాంతంగా పెరుగుతుందన్నారు.
ఇండియా కూటమి ఉపరాష్ట్రపతి అభ్యర్థి జస్టిస్ సుదర్శన్ రెడ్డి పరిచయ కార్యక్రమం హైదరాబాద్లో జరిగింది. తాజ్ కృష్ణలో జరిగిన కార్యక్రమానికి సీఎం రేవంత్ రెడ్డి హాజరయ్యారు. ఆయనను మిగతా పార్టీ నేతలకు పరిచయం చేశారు. ఈ సందర్భంగా మాట్లాడిన ముఖ్యమంత్రి.. ఇండియా కూటమి ఉపరాష్ట్రపతి అభ్యర్థిగా సుదర్శన్ రెడ్డిని అభినందించడానికి ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేశామన్నారు.
తెలుగు వారందరూ ఒక తాటిపైకి వచ్చి సుదర్శన్ రెడ్డికి అండగా నిలబడాలని నిర్ణయించామన్నారు. తెలుగు రాష్ట్రాల్లోని పార్టీల అధ్యక్షులు చంద్రబాబునాయుడు, పవన్ కళ్యాణ్, వైఎస్ జగన్ , చంద్రశేఖర్ రావు, ఓవైసీతో పాటు రెండు రాష్ట్రాలకు చెందిన 42 మంది ఎంపీలు, 18 మంది రాజ్యసభలు ఆత్మ ప్రభోదానుసారం ఓటు వేయాలని వ్యక్తిగతంగా విజ్ఝప్తి చేశారు.
జాతీయ స్థాయిలో తెలుగు భాష రెండో స్థానంలో ఉన్నప్పుడు తెలుగువారు ఆ స్థాయిలో ఉండాలన్నారు. రాజ్యసభ ఛైర్మన్ సీటులో గౌరవమైన వ్యక్తులు,అంబేద్కర్ విధానాలపై సంపూర్ణ విశ్వాసం ఉన్నవారు కూర్చుంటే పూర్తి న్యాయం జరుగుతుందన్నారు.
ALSO READ: కాళేశ్వరం కేసుపై సీబీఐ విచారణ.. నోరు విప్పిన ఈటెల
నీలం సంజీవరెడ్డి , వివిగిరి, పీవీ నరసింహరావు, జైపాల్ రెడ్డి ,వెంకయ్యనాయుడు, ఎన్టీ రామారావు వంటి తెలుగు నేతలు గతంలో జాతీయ స్థాయిలో కీలక పాత్ర పోషించారని వివరించారు. ప్రస్తుతం తెలుగు నాయకులు జాతీయ రాజకీయాల్లో అంత కీలకంగా లేరన్నారు. ఇండియా కూటమి ఆలోచనను జస్టిస్ సుదర్శన్ రెడ్డి గౌరవించి ఎన్నికల బరిలోకి దిగారని తెలిపారు.
సుదర్శన్ రెడ్డి పోటీ వల్ల ఎన్డీఏ కూటమికి గట్టి పోటీ ఎదురయ్యిందన్నారు. రాజ్యాంగాన్ని మార్చాలని, రిజర్వేషన్లు రద్దు చేయాలని ఎన్డీఎ కూటమి ప్లాన్ చేస్తోందన్నారు. వాటిని కాపాడుకోవడానికి ఇండియా కూటమి ఎన్నికల్లో దిగిందని గుర్తు చేశారు. ఉప రాష్ట్రపతి రాజీనామా చేయడం ఆశ్చర్యకరమని, ఆయన రాజీనామాను దేశ ప్రజలు గమనించారని తెలిపారు.
జస్టిస్ సుదర్శన్ రెడ్డికి సుదీర్ష అనుభవం ఉందని, ఆయన వివిధ హోదాల్లో రాజ్యంగ స్పూర్తితో పని చేశారని తెలిపారు. ఆయన ఏ పార్టీకి సంబంధించిన వ్యక్తి కాదని, రాజ్యాంగాన్ని రక్షించే పార్టీలో ఆయన మొదటి సభ్యత్వం తీసుకున్నారని వివరించారు. రాజ్యాంగాన్ని రక్షించడమే ఆయన పార్టీ అని, ఎజెండా, జెండా లేకుండా ఆయనకు అంతా మద్దతు ఇవ్వాలన్నారు.
రాజ్యాంగాన్ని రక్షిస్తే దేశాన్ని రక్షించినట్లే, లేకుంటే దేశానికి నష్టం జరుగుతుందన్నారు. జస్టిస్ సుదర్శన్ రెడ్డిని ఓ జాతీయ నాయకుడు నక్సలైట్ అని అంటున్నారని, నక్సలిజం ఒక విధానం మాత్రమేనన్నారు. నక్సలిజం ఫిలాసఫీ నచ్చవచ్చు లేదా నచ్చకపోవచ్చని, మనకు నచ్చని ఫిలాసఫీతో వాదించి గెలవాలని, కానీ అంతం చేస్తానంటే కుదరదన్నారు. 18 ఏళ్లకు ఓటు హక్కు కల్పించిన మాజీ ప్రధాని రాజీవ్గాంధీ ఆలోచన ఒక వైపు.. ఓట్ చోర్ ఆలోచనతో మరో పార్టీ ఇంకో వైపు దేశంలో ఉన్నాయన్నారు సీఎం రేవంత్ రెడ్డి.