Rythu Bharosa second installment: తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం రైతులకు శుభవార్త చెప్పింది. రేపు సాయంత్రం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి రైతు భరోసా రెండో విడత నిధులను విడుదల చేయనున్నట్లు రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు ప్రకటించారు. జయశంకర్ భూపాలపల్లి జిల్లాలోని నస్తూరుపల్లి వద్ద ఏర్పాటు చేసిన బహిరంగ సభా వేదిక నుండి సీఎం ఈ నిధులను నేరుగా రైతుల ఖాతాల్లోకి జమ చేస్తారని, అనంతరం అక్కడ జరిగే సభలో రైతులను ఉద్దేశించి ప్రసంగిస్తారని మంత్రి వెల్లడించారు.
ఈ రెండో విడతలో భాగంగా రాష్ట్రవ్యాప్తంగా ఉన్న 45,11,947 మంది రైతులకు దాదాపు 2063 కోట్ల రూపాయల భరోసా నిధులు అందనున్నాయి. ఇప్పటికే మార్చి 23న మొదటి విడతలో ప్రభుత్వం 3590 కోట్లు విడుదల చేసిన విషయం తెలిసిందే. రేపటి నిధుల విడుదలతో కలిపి మొత్తం 5653 కోట్లు రైతుల ఖాతాల్లోకి వెళ్లబోతున్నాయని మంత్రి తుమ్మల వివరించారు. ప్రజా పాలన ప్రగతి ప్రణాళికలో భాగంగా అటవీ ప్రాంతంలో ఈ రైతు సమావేశాన్ని ప్రత్యేకంగా ఏర్పాటు చేశామని ఆయన పేర్కొన్నారు.
గత ప్రభుత్వ పాలనపై విమర్శలు చేస్తూ, గత పదేళ్ల విధ్వంసక మరియు అవినీతి పాలన వల్లే ప్రజలు బీఆర్ఎస్ పార్టీని బహిష్కరించి ప్రజా రాజ్యాన్ని తెచ్చుకున్నారని మంత్రి వ్యాఖ్యానించారు. ప్రజాక్షేత్రంలో ఓడిపోయిన ప్రతిపక్షాలు ప్రభుత్వం చేసే మంచి పనులను ప్రోత్సహించడం లేదని ఆయన మండిపడ్డారు. భగవంతుడిచ్చిన శక్తి మేరకు రాష్ట్రంపై ఉన్న అప్పులను తీరుస్తూనే, సంక్షేమ పథకాలను నిరంతరాయంగా కొనసాగిస్తామని మంత్రి తుమ్మల ధీమా వ్యక్తం చేశారు.
Read Also: బీఆర్ఎస్, కాంగ్రెస్ పార్టీలకు కవిత రిటర్న్ గిఫ్ట్.. పార్టీలోకి మాజీ ఎమ్మెల్యేల క్యూ..?