Hyderabad: తెలంగాణలో ఈ ఏడాది యథావిధిగా ఇంటర్మీడియట్ ప్రవేశాలు చేపట్టాలని సీఎం రేవంత్ రెడ్డి అధికారులను ఆదేశించారు. ప్రవేశాలకు సమయం తక్కువగా ఉండడమే ఇందుకు కారణంగా తెలుస్తోంది. ఇంటర్మీడియట్ను పాఠశాల విద్యలో విలీనం చేసే ప్రక్రియకు పలు సాంకేతిక సమస్యలు మొదలయ్యాయి. ఈ నేపథ్యంలో విద్యార్థుల ప్రయోజనాలకు భంగం వాటిల్లకుండా వెంటనే ప్రవేశాల ప్రక్రియను చేపట్టాలని సూచించారు.
తెలంగాణలో ఈ ఏడాది యథావిధిగా ఇంటర్ అడ్మిషన్లు
ఇంటర్మీడియట్ను రద్దు చేసి సీబీఎస్ఈలో మాదిరే 11, 12 తరగతులు నిర్వహించాలని ఎడ్యుకేషన్ కమిషన్ సూచన చేసింది. దీనికారణంగా డ్రాపౌవుట్స్ సంఖ్య గణనీయంగా తగ్గుతుందని రాష్ట్ర ప్రభుత్వానికి సూచించింది. సీబీఎస్ఈతో పాటు మెజారిటీ రాష్ట్రాలు ఇంటర్ విధానాన్ని అనుసరిస్తున్నాయని పేర్కొంది.
తెలంగాణలో ఇంటర్మీడియట్ విద్య వేరుగా ఉందని, ప్రభుత్వ పాఠశాలల్లో పదో తరగతి వరకు చదివిన విద్యార్థులు, ఆ తర్వాత ఇంటర్మీడియట్కు కళాశాలల్లో చేరలేదు. చాలామంది పదో తరగతితో విద్యను నిలిపి వేస్తున్నారని పేర్కొంది. ఈ నేపథ్యంలో ఇంటర్మీడియట్ను వేరుగా కాకుండా 11, 12 తరగతులుగా కొనసాగించాలని ముఖ్యమంత్రి గతంలో అధికారులకు సూచించారు.
సీఎం రేవంత్ సమీక్ష, విద్యార్థుల తల్లిదండ్రులకు నో టెన్షన్
ఇదే అంశాన్ని తెలంగాణ ఎడ్యుకేషన్ కమిషన్ తన నివేదికలో ప్రస్తావించింది. ఈ నేపథ్యంలో ఇంటర్ ప్రవేశాలు నిలిపివేస్తూ అధికారులు ప్రకటన విడుదల చేశారు. దీంతో విద్యార్థులు, వారి తల్లిదండ్రుల నుంచి ఆందోళన వ్యక్తమైంది.
ఈ నేపథ్యంలో సీఎం రేవంత్ రెడ్డి, ఎంపీ వేం నరేందర్ రెడ్డి, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి రామకృష్ణారావు, సీఎం ప్రిన్సిపల్ సెక్రటరీ శేషాద్రి, సీఎం స్పెషల్ సెక్రటరీ అజిత్ రెడ్డి, సీఎం సెక్రటరీ మాణిక్ రాజ్, విద్యా శాఖ కమిషనర్ యోగితా రాణాలతో చర్చించారు.
ALSO READ: హైలైట్ కోసమే కౌశిక్ రెడ్డి ఆరాటం: వోడితల ప్రణవ్ బాబు
ఈ క్రమంలో విలీనంతో ముడిపడిన పలు సాంకేతిక సమస్యలను క్షుణ్నంగా అధ్యయనం చేయాల్సి ఉన్నందున ఈ ప్రక్రియను తాత్కాలికంగా వాయిదా వేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. పాఠశాల విద్యలో ఇంటర్మీడియట్ విలీనం ప్రక్రియకు సంబంధించి భాగస్వాములతో విస్తృతంగా సంప్రదింపులు నిర్వహించాలని అధికారులను ఆదేశించారు ముఖ్యమంత్రి.
ఈ వ్యవహారంపై తెలంగాణ ఎడ్యుకేషన్ పాలసీపై నియమించిన కమిటీ అధ్యయనం చేసి తన నివేదిక సమర్పించాలని సూచించారు సీఎం. ఆ తర్వాత శాసనసభలో చర్చించి తుది నిర్ణయం తీసుకుందామని స్పష్టంచేశారు. ఈ లెక్కన ఈ ఏడాది యథావిధిగా ఇంటర్ అడ్మిషన్లు జరుగుతాయి.