Huzurabad Politics: స్వేచ్చ బ్యూరో: హుజూరాబాద్ నియోజకవర్గంలో భారతీయ జనతా పార్టీ, భారత్ రాష్ట్ర సమితి నాయకులు ప్రజల మధ్య విద్వేషాలు రగిలిస్తూ ‘చిల్లర రాజకీయం’ చేస్తున్నారని కాంగ్రెస్ పార్టీ నియోజకవర్గ ఇంచార్జి వోడితల ప్రణవ్ బాబు ధ్వజమెత్తారు. హుజూరాబాద్లోని పార్టీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. స్థానిక ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి, కేంద్ర మంత్రి బండి సంజయ్ వైఖరిపై ఆయన నిప్పులు చెరిగారు.
బీజేపీ, బీఆర్ఎస్ పార్టీలు పగలు తిట్టుకుంటూ, రాత్రికి ఒక్కటవుతున్నాయని ప్రణవ్ బాబు ఆరోపించారు. వీరిద్దరి మధ్య లోపాయికారీ ఒప్పందం ఉందని, “నేను నిన్ను తిడతాను.. నువ్వు నన్ను తిట్టు.. ప్రజలను మోసం చేద్దాం” అనే చందంగా వీరి డ్రామాలు సాగుతున్నాయని ఎద్దేవా చేశారు. కరీంనగర్ బంద్ పిలుపు కేవలం వ్యక్తిగత బలప్రదర్శన కోసమే తప్ప ప్రజల కోసం కాదని మండిపడ్డారు. పీఎంజే షాపు ఘటనలో నిందితులను పట్టుకునేందుకు పోలీసులు శ్రమిస్తుంటే, దానిని కూడా రాజకీయంగా వాడుకోవడం సిగ్గుచేటని విమర్శించారు.
ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డికి సోషల్ మీడియాలో రీల్స్ చేయడమే తప్ప, ప్రజల సమస్యలు పట్టవని ప్రణవ్ బాబు ఎద్దేవా చేశారు. వావిలాల సమీపంలో అగ్నిప్రమాదం జరిగి రైతులు నష్టపోతే పరామర్శించే తీరిక లేని ఎమ్మెల్యే, తన రాజకీయ ఉనికి కోసం కరీంనగర్ వెళ్లి డ్రామాలు ఆడుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. తెలంగాణలో ‘హుజూరాబాద్ ఎమ్మెల్యే’ అంటేనే జనం ఛీదరించుకునే స్థాయికి దిగజారారని విమర్శించారు. కేవలం పోలీస్ కాన్వాయ్ ముందు, వెనకాల తిరగాలనే ‘సోకు’ కోసమే కౌశిక్ రెడ్డి హైడ్రామాలు చేస్తున్నారని చురకలంటించారు.
Also read: దెయ్యాల కోసం వెళ్తే వణికించే శవం… డిటెక్టివ్కి నిద్ర లేకుండా చేసిన ఆ భయంకరమైన రాత్రి
బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అధికార దాహం తీరక, తీవ్ర ఫ్రస్ట్రేషన్లో ముఖ్యమంత్రిపై ఇష్టానుసారంగా మాట్లాడుతున్నారని ప్రణవ్ బాబు అన్నారు. పదేళ్లలో బీఆర్ఎస్ చేయలేని రుణమాఫీని, కాంగ్రెస్ ప్రభుత్వం ఏకకాలంలో రూ. 22 వేల కోట్లతో పూర్తి చేసిందని గుర్తుచేశారు. “వరి వేస్తే ఉరి” అన్న గత పాలకుల మాటలకు భిన్నంగా, నేడు సన్న వడ్లకు రూ. 500 బోనస్ ఇస్తూ రైతులను కాంగ్రెస్ ఆదుకుంటోందని స్పష్టం చేశారు.
హుజూరాబాద్, జమ్మికుంట ప్రాంతాల్లోని అర్హులైన నిరుపేదలందరికీ త్వరలోనే ఇందిరమ్మ ఇళ్లు, డబుల్ బెడ్ రూమ్ పట్టాలను పంపిణీ చేస్తామని ప్రణవ్ బాబు హామీ ఇచ్చారు. గత ప్రభుత్వం తీసుకొచ్చిన ‘వేస్ట్ ఎనర్జీ ప్లాంట్’ సాంకేతికంగా సాధ్యం కాదని, ప్రజల ఇబ్బందులను గమనించి మంత్రుల దృష్టికి తీసుకెళ్లామని వివరించారు. ఈ కార్యక్రమంలో హుజూరాబాద్ మున్సిపల్ చైర్ పర్సన్ రోంటాల సుహాసిని, కౌన్సిలర్లు, మండల, పట్టణ అధ్యక్షులు, అనుబంధ సంఘాల నాయకులు మరియు కార్యకర్తలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.
Also read: హుస్నాబాద్ విద్యుత్ శాఖ కార్యాలయంలో మార్ఫింగ్ వీడియోలు కలకలం