South India Bullet Train Plan: 2030 నాటికి దేశంలో తొలి బుల్లెట్ రైలు అందుబాటులోకి తీసుకొచ్చేందుకు కేంద్ర ప్రభుత్వం ప్రయత్నిస్తోంది. అందులో భాగంగానే అహ్మదాబాద్-ముంబై నడుమ తొలి హైస్పీడ్ రైల్వే కారిడార్ నిర్మాణం శరవేగంగా కొనసాగుతోంది. ఇప్పటికే దాదాపు 80 శాతం నిర్మాణం పూర్తయ్యింది. జపాన్ నుంచి కొత్త బుల్లెట్ రైలు సెట్లను తీసుకొచ్చేందుకు కేంద్రం ఒప్పందం చేసుకుంది.
ఓవైపు తొలి బుల్లెట్ రైలు మార్గం నిర్మాణం రెడీ అవుతుండగా, మరోవైపు దేశ వ్యాప్తంగా బుల్లెట్ రైలు మార్గాల నిర్మాణానికి కేంద్రం ప్రతిపాదనలు సిద్ధం చేస్తోంది. ముఖ్యంగా సౌత్ ఇండియాలో హైస్పీడ్ రైల్వే కారిడార్ నిర్మాణానికి కేంద్ర ప్రభుత్వం శ్రీకారం చుడుతోంది. హైదరాబాద్, అమరావతి, చెన్నై, బెంగళూరు, ముంబై వంటి ప్రధాన నగరాలను హై స్పీడ్ బుల్లెట్ ట్రైన్ నెట్ వర్క్ తో కలిపేలా ప్రణాళికలను రూపొందిస్తోంది. ఈ మేరకు రైల్వే మంత్రి అశ్విని వైష్ణవ్ విశాఖపట్నంలో జరిగిన గూగుల్ క్లౌడ్ ఇండియా ఏఐ హబ్ కార్యక్రమంలో కీలక ప్రకటన చేశారు.
ఈ ప్రాజెక్ట్ అమలులోకి వస్తే ప్రస్తుతం గంటల పాటు సాగుతున్న ప్రయాణాలు నిమిషాల వ్యవధిలో పూర్తయ్యే అవకాశం ఉంది. ముఖ్యంగా అమరావతి నుంచి హైదరాబాద్ కు కేవలం 70 నిమిషాల్లో చేరుకోవచ్చని మంత్రి అశ్విని వైష్ణవ్ తెలిపారు. అమరావతి నుంచి చెన్నైకి 112 నిమిషాలు, హైదరాబాద్ నుంచి పూణేకు 1 గంట 55 నిమిషాలు, పూణే నుంచి ముంబైకి 48 నిమిషాల్లో ప్రయాణం పూర్తవుతుందని అంచనా వేస్తున్నారు. చెన్నై-బెంగళూరు మధ్య ప్రయాణ సమయం 73 నిమిషాలకు, హైదరాబాద్-బెంగళూరు మధ్య ప్రయాణం 2 గంటల 8 నిమిషాలకు తగ్గే అవకాశం ఉంది.
కేంద్ర ప్రభుత్వం ఈ బుల్లెట్ ట్రైన్ ప్రాజెక్ట్ ను కేవలం వేగవంతమైన రవాణా కోసం మాత్రమే కాకుండా, దక్షిణ భారతాన్ని పెద్ద ఆర్థిక కారిడార్ గా తీర్చిదిద్దే దిశగా రూపొందిస్తోంది. అహ్మదాబాద్-ముంబై బుల్లెట్ ట్రైన్ ప్రాజెక్ట్ తరహాలోనే, ఇక్కడ కూడా ప్రధాన నగరాల మధ్య వ్యాపార, పరిశ్రమల, పెట్టుబడుల అనుసంధానం పెరిగేలా ప్రణాళిక సిద్ధం చేస్తున్నారు. నగరాల మధ్య వేగవంతమైన కనెక్టివిటీ ఏర్పడితే ఉద్యోగ అవకాశాలు, పరిశ్రమల విస్తరణ, పెట్టుబడుల రాక మరింత పెరుగుతుందని కేంద్రం భావిస్తోంది.
అటు చాలా కాలంగా ఎదురుచూస్తున్న సౌత్ కోస్ట్ రైల్వే జోన్ను జూన్ 1 నుంచి అధికారికంగా అమల్లోకి తీసుకువస్తామని మంత్రి అశ్విని వైఫ్ణవ్ తెలిపారు. రాష్ట్ర విభజన సమయంలో ఇచ్చిన హామీల్లో ఈ ప్రాజెక్టు కూడా ఉంది. ఈ జోన్ ఏర్పాటుతో రైల్వే పరిపాలన మరింత సమర్థవంతంగా మారుతుందని అధికారులు చెబుతున్నారు. అలాగే కోల్కతా-చెన్నై ప్రధాన రైల్వే మార్గాన్ని డబుల్ లైన్ నుంచి నాలుగు లైన్లుగా విస్తరించే పనులు చేపట్టనున్నట్లు వెల్లడించారు. ఈ విస్తరణ పూర్తయితే అదనంగా 500 రైళ్లను నడిపే సామర్థ్యం ఏర్పడుతుందని తెలిపారు. దీంతో సరుకు రవాణా, ప్రయాణికుల సేవలు రెండింటికీ లాభం కలిగే అవకాశం ఉంది.
Read Also: తెలంగాణకు బుల్లెట్ రైలు వచ్చేస్తోంది.. ఎక్కడెక్కడ ఆగుతుందంటే?