CM Revanth Reddy: తెలంగాణలో ప్రభుత్వం వర్సెస్ బీరు కంపెనీ మధ్య ధరల యుద్ధం జరుగుతోంది. ఉన్నట్టుండి సరఫరా నిలిపివేయడం కరెక్టు కాదని ప్రభుత్వం అంటుంటే.. నష్టాల వల్లే అలా చేశామన్నది బీరు కంపెనీ యూబీఎల్ కామెంట్. మరి తర్వాతి పరిణామ క్రమాలు ఎలా ఉండబోతున్నాయి. అసలిప్పటి వరకూ జరిగినదేంటి?
తెలంగాణ బేవరేజెస్ కార్పొరేషన్కి కింగ్ ఫిషర్ బీర్ తయారీ కంపెనీ యూబీఎల్కీ మధ్య గొడవ జరుగుతోంది. ఈ నెల 8వ తేదీ నుంచి తమ బీర్ సప్లైని ఆపేసింది యునైటెడ్ బేవరేజెస్. అదేమంటే.. తెలంగాణలో నిర్వహణ నష్టాల వల్లే తామీ చర్య తీస్కుంటున్నట్టు చెబుతోంది యూబీఎల్. గత రెండేళ్ల నుంచి తాము తెలంగాణ బేవరేజెస్ కార్పొరేషన్ని ధరలు పెంచమని కోరుతున్నామనీ.. ఎంత విన్న వించుకున్నా.. TGBCL బేస్ ధరలను పెంచలేదనీ. దీని వల్ల తమకు నష్టాలు పెరిగిపోతున్నాయనీ చెబుతోంది యూబీఎల్.
ఇప్పటికే 900 కోట్ల రూపాయల బకాయిలు పెండింగ్లో ఉన్నాయనీ.. తెలంగాణ బేవరేజెస్కి రాసిన లెటర్ ద్వారా తెలియ చేసింది యునైటెడ్ బేవరేజెస్. యునైటెడ్ బేవరేజస్ సంస్థ తెలంగాణ బేవరేజ్ కార్పొరేషన్కి రాసిన లేఖపై తెలంగాణ ఎక్సైజ్ శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు స్పందించిన సంగతి తెలిసిందే. యునైటెడ్ బేవరేజెస్ సంస్థ బీర్ల ధరలు 33.1 శాతం మేర పెంచాలని కోరుతోందని. ఈ స్థాయిలో మద్యం ధరలు పెంచితే మద్యం ప్రియులపై పెను భారం పడుతుందనీ. బీర్ల రేట్ల పెంపు అనేది హైకోర్ట్ విశ్రాంత జడ్జి నేతృత్వంలోని ధరల నిర్ణయ కమిటీ పరిశీలనలో ఉందనీ.. కమీటీ నివేదిక వచ్చిన తర్వాత పరిశీలించి ధరల పెంపుపై నిర్ణయం తీసుకుంటామనీ అంటోంది తెలంగాణ ప్రభుత్వం.
తాజాగా.. రాష్ట్రంలో కింగ్ఫిషర్ బీర్ల సరఫరా నిలిపివేతపై రేవంత్ సర్కార్ సీరియస్ అయ్యింది. బీర్లు తయారు చేసే కంపెనీలు పెట్టే ఒత్తిడికి లొంగొద్దని ఎక్సైజ్ శాఖ అధికారులకు సీఎం రేవంత్ రెడ్డి స్పష్టం చేశారు. బీర్ల రేటును 33.1% పెంచాలంటూ యునైటెడ్ బ్రేవరేజెస్ కంపెనీ ఇటీవల రాసిన లేఖను, పెంచిన ఒత్తిడిని అధికారులు సీఎం దృష్టికి తీసుకెళ్లారు. అయితే కంపెనీలు తెచ్చే ఒత్తిళ్లకు తలొగ్గేదే లేదని తేల్చి చెప్పారు సీఎం.
Also Read: ఔటర్ లోపలి ప్రాంతంలో.. భూగర్భ విద్యుత్
ధరలు పెంచితే మద్యంప్రియులపై భారం పడుతుందని.. ధరల పెంపుపై హైకోర్ట్ విశ్రాంత జడ్జి నేతృత్వంలోని ధరల నిర్ణయ కమిటీ నివేదిక వచ్చిన తర్వాత పరిశీలిస్తామని చెప్పారు సీఎం. కాంగ్రెస్ అధికారంలోకి ఇచ్చిన నాటికి ఎక్సైజ్ శాఖకు 2,500 కోట్ల రూపాయల బకాయిలు వరకు ఉంటే.. ఇప్పటి వరకు 1130 కోట్ల రూపాయల బకాయిలు చెల్లించినట్టు ప్రభుత్వ వర్గాలు తెలుపుతున్నాయి. గత ప్రభుత్వం పెట్టిన బకాయిలు క్రమక్రమంగా చెల్లిస్తున్నట్టు సీఎం తెలిపారు. ప్రస్తుతం 14 లక్షల కింగ్ ఫిషర్ కేసుల స్టాక్ అందుబాటులో ఉన్నాయని.. తెలంగాణలో త్వరలో కొత్త బ్రాండ్ బీర్లు అందుబాటులోకి తెస్తామని సీఎం స్పష్టం చేశారు.
అయితే తెలంగాణలో యూబీఎల్ కంపెనీలకు సంబంధించి 14 లక్షల కేసుల స్టాక్ అందుబాటులో ఉందని.. ఇతర రాష్ట్రాలతో పోలిస్తే.. మన రాష్ట్రంలోనే మద్యం ధరలు తక్కువగా ఉన్నాయనీ.. ఫ్యూచర్లో కూడా మిగిలిన రాష్ట్రాలతో పోలిస్తే.. తెలంగాణలోనే తక్కువ ధరలుండేలా చూస్తామని రేవంత్ సర్కార్ స్పష్టం చేసింది.