Indian Railways: భారతీయ రైల్వే వ్యవస్థ ప్రపంచంలోనే నాలుగో అతిపెద్ద రైల్వే నెట్ వర్క్ గా గుర్తింపు తెచ్చుకుంది. దేశ వ్యాప్తంగా రోజూ 13 వేలకు పైగా రైళ్లు ప్రయాణీకులను తమ గమ్యస్థానాలకు చేర్చుతుంటాయి. అన్ని రాష్ట్రాల్లో కలిపి 7,300 పైగా రైల్వే స్టేషన్లు ఉన్నాయి. వాటిలో కొన్ని అత్యధిక రద్దీని కలిగి ఉన్న స్టేషన్లు ఉన్నాయి. ఇక్కడి నుంచి రోజూ లక్షలాది మంది ప్రయాణీకులు రాకపోకలు కొనసాగిస్తున్నారు. ఇంతకీ దేశంలో అత్యధిక రద్దీని కలిగి ఉన్న 5 రైల్వే స్టేషన్లు ఏవో ఇప్పుడు తెలుసుకుందాం..
⦿ చెన్నై సెంట్రల్ రైల్వే స్టేషన్: దేశంలోని అతిపెద్ద రైల్వే స్టేషన్లలో ఇది ఒకటి. ఇక్కడి నుంచి రోజూ సుమారు 3,50,000 మంది ప్రయాణీకులు రాకపోకలు కొనసాగిస్తారు. 1873లో నిర్మాణం జరుపుకున్న ఈ రైల్వే స్టేషన్ లో.. ప్రస్తుతం 22 ఫ్లాట్ ఫారమ్ లు ఉన్నాయి. దేశంలోని అన్ని ప్రధాన నగరాలకు ఇక్కడి నుంచి రైల్వే సర్వీసులు కొనసాగుతున్నాయి.
⦿ న్యూఢిల్లీ రైల్వే స్టేషన్: దేశంలోని పెద్ద రైల్వే స్టేషన్లలో ఇది కూడా ఒకటి. ఇక్కడి నుంచి రోజుకు సుమారు 5,00,000 మంది ప్రయాణీకులు జర్నీ చేస్తారు. 1956లో నిర్మించిన ఈ రైల్వే స్టేషన్ లో ప్రస్తుతం 16 రైల్వే ఫ్లాట్ ఫారమ్ లు ఉన్నాయి. దేశ రాజధానిలో ఉన్న ఈ రైల్వే స్టేషన్ నుంచి దేశంలోని అన్ని ప్రధాన నగరాలకు రైల్వే సర్వీసులు ఉన్నాయి. ఇది ప్రపంచంలోనే అతిపెద్ద రూట్ రిలే ఇంటర్ లాకింగ్ సిస్టమ్ కలిగి ఉన్న రైల్వే స్టేషన్ గా గుర్తింపు తెచ్చుకుంది. ఈ రైల్వే స్టేషన్ ఢిల్లీ మెట్రోకు లింక్ చేసి ఉంటుంది.
⦿ ఛత్రపతి శివాజీ రైల్వే స్టేషన్: ఇది ముంబైలో ఉంటుంది. ఈ రైల్వేస్టేషన్ లో మొత్తం 18 ఫ్లాట్ ఫారమ్స్ ఉంటాయి. 1887లో ఈ రైల్వే స్టేషన్ ను నిర్మించారు. ఇక్కడి నుంచి రోజు సుమారు 7,00,000 మంది ప్రయాణీకులు రాకపోకలు కొనసాగిస్తారు. ఇక్కడి నుంచి కూడా దేశ వ్యాప్తంగా రైల్వే సర్వీసులు నడుస్తున్నాయి. ముంబై మెట్రోకు అనుసంధానించబడి తన సేవలను కొనసాగిస్తున్నది. 2004లో దీనిని యునెస్కో ప్రపంచ వారసతవ ప్రదేశంగా గుర్తించింది.
⦿ హౌరా జంక్షన్ రైల్వే స్టేషన్: దేశంలో అధిక సంఖ్యలో ప్రయాణీకులు రాకపోకలు కొనసాగించే రైల్వే స్టేషన్లలో రెండో స్థానాన్ని దక్కించుకుంది. పశ్చిమ బెంగాల్ లోని హౌరాలో ఉన్న ఈ స్టేషన్ నుంచి రోజుకూ సుమారు 10 లక్షలకు పైగా మంది ప్రయాణీకులు జర్నీ చేస్తారు. 1854లో ఈ రైల్వే స్టేషన్ ను నిర్మించారు. ఇక్కడి నుంచి దేశంలోని అన్ని ప్రధాన నగరాలకు రైల్వే సర్వీసులు ఉన్నాయి.
⦿ సీల్దా రైల్వే స్టేషన్: ఇది కూడా పశ్చిమ బెంగాల్ లోనే ఉంది. ఇక్కడ ఏకంగా 21 ఫ్లాట్ ఫారమ్ లు ఉన్నాయి. కోల్ కతాలోని ప్రధాన రైల్వే టెర్మినల్ ఇదే. ఇక్కడి నుంచి దేశంలోని అన్ని ప్రదేశాలకు రూల్వే కనెక్టివిటీ ఉంది. ఈ స్టేషన్ నుంచి రోజూ 12 లక్షల మందికి పైగా రాకపోకలు కొనసాగిస్తారు.