CM Revanth Reddy : సీఎంగా తాను ఏ రోజూ అహంకారానికి పోలేదన్నారు రేవంత్రెడ్డి. రాష్ట్రానికి రావాల్సిన నిధులు కోసం ప్రధాని మోడీని ఎన్నిసార్లు అయినా కలుస్తానని చెప్పారు. అభివృద్ధి కోసం కేంద్రంతో కలిసి పని చేస్తామన్నారు. ఎవరేం అనుకున్నా తనకు ఇబ్బంది లేదన్నారు. చెరువు మీద అలిగితే మనకే వాసన వస్తుంది.. ఒకాయన అలాగే అలిగి ఫామ్హౌజ్లో పడుకున్నాడంటూ కేసీఆర్ను ఎద్దేవా చేశారు. ప్రతిపక్ష నాయకుడు అసెంబ్లీకి రావాలని.. తన 40 ఏళ్ల రాజకీయ అనుభవాన్ని చెప్పాలని కోరారు. పదవి ఉంటేనే వస్తా అంటే ఎలా అని ప్రశ్నించారు. తాము పదేళ్లు ప్రతిపక్షంలో ఉన్నామని గుర్తు చేశారు. ప్రతిపక్షం కూడా అండగా ఉంటే అద్భుతాలు చేస్తామని.. ప్రపంచంలో తెలంగాణని గొప్ప రాష్ట్రంగా తీర్చుదిద్దుతామని చెప్పారు సీఎం రేవంత్. సంగారెడ్డి జిల్లాలో బసవేశ్వరుడి విగ్రహాన్ని ఆవిష్కరించారు. సమాజంలో అణిచివేతకు గురైన వారి న్యాయం కోసం విశ్వగురు బసవేశ్వరుడు పోరాడారని కొనియాడారు.
జగ్గారెడ్డికి కీలక బాధ్యతలు..
జహీరాబాద్ అభివృద్ధి కోసం ప్రత్యేక సమీక్ష చేసి నిధులు మంజూరు చేస్తామన్నారు ముఖ్యమంత్రి. ఎన్నికలు వచ్చినప్పుడే రాజకీయాలు.. ఆ తర్వాత అభివృద్ధి మన అజెండా అని చెప్పారు. జహీరాబాద్ నిమ్జ్ కోసం భూములు కోల్పోతున్న 5,612 కుటుంబాలకు ఇందిరమ్మ ఇండ్లు ఇస్తామని ప్రకటించారు. భూములు కోల్పోతున్న వారికి జగ్గారెడ్డి న్యాయం చేస్తారని.. నిర్వాసితులకు ఇళ్ల పట్టాలు అందించే బాధ్యత జగ్గారెడ్డికి అప్పజెబుతున్నానని తెలిపారు. వారికి మంచి భోజనం పెట్టించి జగ్గారెడ్డి పట్టాలు ఇస్తారన్నారు. సంజీవ రెడ్డి, సురేష్ షెట్కార్లు.. నారాయణఖేడ్కి రెండు కళ్లలాంటి వారని చెప్పారు. నిమ్జ్ ప్రాజెక్టులో హ్యుందాయ్ కార్ల తయారీ పరిశ్రమ రాబోతుందని తెలిపారు. చక్కెర పరిశ్రమ కోసం సహకార సంఘం ఏర్పాటు చేసుకుంటామంటే.. నిమ్జ్లో 100 ఎకరాల భూమితో పాటు నిధులు కూడా కేటాయిస్తానని సీఎం రేవంత్రెడ్డి హామీ ఇచ్చారు. సింగూరు ప్రాజెక్టును టూరిజం హబ్గా మారుస్తామని చెప్పారు.
Also Read : కవిత మరో షర్మిల..?
కలిసి పని చేస్తేనే..
నిరుద్యోగ యువతకు ఉద్యోగ, ఉపాధి కోసం చర్యలు తీసుకుంటున్నామని చెప్పారు సీఎం. మెదక్ జిల్లాకి ఇందిరమ్మకి విడదీయరాని అనుబంధం ఉందని గుర్తు చేశారు. ఉమ్మడి మెదక్ జిల్లాను అభివృద్ధి చేసేందుకు కేంద్ర సాయం తీసుకుంటామని తెలిపారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు కలిసి పని చేస్తేనే అభివృద్ధి సాధించగలమన్నారు సీఎం రేవంత్.
వరి వేస్తే బోనస్..
వరి వేసుకుంటే ఉరే అని ఆనాటి సీఎం అన్నారని.. కానీ నేడు వరి పంటకు తమ ప్రభుత్వం బోనస్ కూడా ఇస్తోందని గుర్తు చేశారు. రైతులను అప్పుల బాధ నుంచి విముక్తి కలిగించాం.. రైతు భరోసాని 12 వేలకు పెంచి సహాయం అందిస్తున్నాం.. భూమి లేని రైతులకు కూడా సహాయం అందిస్తున్నామని చెప్పారు.
మహిళలే మహారాణులు..
మిస్ వరల్డ్ కాంపిటీషన్కి వచ్చిన వారు మన ఆడబిడ్డలు చేసిన వస్తువులను చూశారని చెప్పారు సీఎం రేవంత్. 18 నెలల్లో మహాలక్ష్మి పథకం కోసం 5500 కోట్లు కేటాయించామన్నారు. కోటి మంది మహిళలను కోటీశ్వరులు చేయాలన్నదే తమ సర్కారు లక్ష్యమన్నారు. మహిళలే బస్సులు కొని ఆర్టీసీకి కిరాయి ఇచ్చేలా చర్యలు తీసుకున్నామని.. ఇందిరమ్మని ఆదర్శంగా తీసుకుని సోనియమ్మ స్పూర్తితో ఆడబిడ్డలు ఆర్థికంగా నిలదొక్కుకునేలా చేస్తామన్నారు ముఖ్యమంత్రి.